పుట:కాశీమజిలీకథలు-05.pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

339

ఆర్యపుత్రా! మనమందరము మృతిజెంది వెండియుం బ్రదికి యొండొరులము గలిసికొంటిమి. పత్రలేఖ సరస్సులోఁ బడి తిరిగివచ్చినది కాదు. ఆమె వృత్తాంత మెట్టిదని యడిగిన విని చంద్రాపీడుఁ డిట్లనియె. ప్రేయసీ! నా భార్యయగు రోహిణియే పత్రలేఖ. నేను బుండరీకునిచే శపింపఁబడి పుడమి జనించుచుండుటఁ జూచి నన్ను విడువలేక నా శుశ్రూషకై నాకన్న ముందుగనే భూమియం దుదయించినది. అంతకుఁ బూర్వము నేనును నెఱుఁగను. శాపాంతమైనది కావున నిప్పుడంతయు స్ఫురించుచున్న దని యెఱింగించెను.

చంద్రాపీడుఁడు పుండరీకునితోఁ గూడికొని కొన్ని దినంబు లుజ్జయిని యందును, కొన్నిదినంబులు హేమకూటమునందును, గొన్నిదినంబులు చంద్రలోకము నందును, గొన్నిదినంబులు లక్ష్మీసరస్సునందు వసించి దివ్యభోగము లనుభవించు చుండెను.

అని యెరింగించి మణిసిద్ధుండు గోపా! నీవు చూచిన చిత్రఫలకములోని యాకృతులు వీరివే. కాషాయవస్త్రము గట్టికొని గుహాప్రాంతమున నిలువబడినది మహాశ్వేత. చంద్రాపీడుని విగ్రహము నర్చించుచున్నది కాదంబరి. అది మదనలేఖ. అది తరళిక అని యా వృత్తాంతమంతయు నెరింగించుటయు నాలకించి యగ్గోపకుమారుండు సంతుష్టాంతరంగుఁడై యయ్యవారి ననేకప్రకారములఁ గైవారము సేయుచు నతనితోఁగూడఁ దదనంతరావసధంబుఁ జేరెను.

క. కాదంబరీరసం బా
   స్వాదించిన నించుకంత పరవశులై సం
   మోదింతురు జనులనఁ ద
   న్మాధుర్యం బెఱుకపడదె మరి విబుధులకున్.

గీ. బాణకవిచేత రచియింపఁబడియెఁ గొంత
   యతనిసుతుచేతఁ బూరితమయ్యెనంత
   మదియు నిదియుఁ గథాసంగ్రహంబు దప్ప
   కుండఁ దెనుగించినాడ గద్యోపసరణి.

క. నీకర్పించితి నీకృతి
   గైకొనుమా బాలచంద్రకలితలలితఫా
   లా! కాశీలోలా? శై
   లాకర శుభకర మహేశ హరవిశ్వేశా!