పుట:కాశీమజిలీకథలు-05.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

284

కాశీమజిలీకథలు - ఐదవభాగము

ఈతఁడే మనకు నమ్మఁదగిన పరిజనుఁడు అని చెప్పినది. అప్పుడు చంద్రాపీడుఁడు కాదంబరికి నమస్కారము గావించెను.

అట్లు నమస్కరించిన చంద్రాపీడు నత్యంతప్రీతిపూర్వకముగా వారచూపులచేఁ జూచుచున్న కాదంబరియొక్క నేత్రకోణములనుండి శ్రమజలకణములవలె నానంద బాష్పబిందువులు రాలినవి. మొగంబున సుధాధవళములగు స్మితజ్యోత్స్న లించుక వ్యాపించినవి. ప్రతిప్రణామంబున నతని సత్కరింపుమని శిరంబున కెరిగించునవివోలె భ్రూలతలు పైకెగసినవి.

అప్పు డందున్న గంధర్వకన్యకలు తిర్యగ్విలోకనముల నతని సోయగము పరికింపం దొడంగిరి.

కాదంబరి సంభ్రమముతో నతనికి నమస్కరించి మహాశ్వేతతోఁగూడఁ బర్యంకమునఁ గూర్చుండెను. పిమ్మటఁ బరిజనులచే దొందరగాఁ బర్యంకశిరోభాగప్రాంతమున వేయబడిన హేమపాదాంకితమగు రత్నపీఠంబునఁ జంద్రాపీడుఁ డుపవిష్టుం డయ్యెను.

అప్పుడు ప్రతిహారులు కాదంబరీ మహాశ్వేతల సంవాదప్రకారము విను తలంపుతో సంవృతముఖన్యస్తహస్తలై హస్తసంజ్ఞలచే వేణువీణాదిగీతధ్వనులు వంధిమాగధజయశబ్దముల నంతటను నాపివేసిరి.

అంతలో గాదంబరి లేచి పరిజనోపనీతమగు నుదకముచే మహాశ్వేతపాదములు గడిగి యుత్తరీయాంశుకమునఁ దడియొత్తి వెండియుఁ దల్పంబునఁ గూర్చుండెను.

పిమ్మటఁ గాదంబరికి బ్రాణసఖురాలు అనురూపరూపలేఖ, మదనలేఖ యనునది రాజపుత్రుం డిచ్చగింపుకున్నను బలవంతమున నతని పాదంబులం గడిగి తడియొత్తినది.

అప్పుడు మహాశ్వేత కర్ణాభరణమణికిరణకిమ్మారిత మగు కాదంబరి యొక్క భుజముపైఁ జేయివైచి చోమరపవనంబునఁ జారుచున్న కుసుమంబు వెండియు వేణికాబంధంబునం గూర్చుచు సఖీ! కాదంబరీ! కుశలముగా నుంటివా? అని యడిగిన గాదంబరియు నిజగృహనివాసంబున నపరాధము జేసినదివోలె సిగ్గుపడుచు నిట్లుత్తరము చెప్పినది.

చ. ప్రియసఖి నారచీరల ధరించి భయంకరభూరికందరా
    లయమునుండి యాకలములన్ భుజియింపుచు దారుణవ్రత
    క్రియలను గాలము న్గడుప హ్రీరహితాత్మకనైన నాకనా
    మయమున కేమిలో టిట సమస్తసుభోగములన్ భజింపగన్ II

వ॥ అని పలికి,