పుట:కాశీమజిలీకథలు-05.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

111

    విద్యాంసు లెద్దాని వెదకి శ్రద్ధాభక్తి
           విశ్వాసయుక్తి దద్విధ మెరింగి
    యధిగతామితసచ్చిదానందరూపులై
           సంసారమున వెండి జననమరణ
    లక్షణక్లేశంబులను జెంద కెప్పుడు
           నిత్యసౌఖ్యోన్నతి నెసఁగుచుందు

గీ. రట్టితత్త్వంబు నీ వౌదు వళివతంస
   తలఁచికొమ్ము మనంబులోపల నిజంబు
   దెలియుమాటలను దేటతెల్లముగను
   మోహమందుట తగదు నీ కైహికమున.

వ. అని యిట్లు వీణాతంత్రీస్వానంబులతో గంఠనాదంబుల మేళగించి యాయంతేవాసు లత్యంతమనోహరస్వరంబుల గాంధర్వంబు బాడి తత్సభాసదుల మోహవివశులం గావించిరి. అమరకుండును దద్గానామృతంబు గ్రోలి వివశుండయ్యెనో యనఁ దద్వాక్యంబులంగల యభిప్రాయంబు హృదయంబునకుఁ బశ్చాత్తాపము గలుగజేయ నప్పుడ యప్పీఠంబుదండకు మేను జేర్చి విగతచేతనుం డయ్యెను.

అవ్విధంబు సూచి యతండు నిద్రించుచున్నవాఁడని తలంచి రాజభటులు సద్దుచేయవద్దని సభ్యులకెల్ల దెలియజేసిరి. అప్పు డొక్కింతసేపు తత్సభాభవనము చిత్రతంబaయిన నిశ్శబ్దమైయుండెను. ఆ నృపాలుం డెంతసేపటికిని లేవక యట్లనే పడియుండుటఁ దిలకించి మించుబోణులు కొందరు దాపునకుఁ బోయి వికృతవదనముతో కళదప్పియున్న యతని యాకృతిం జూచుచు "అయ్యో! యిది యేమి చిత్రము? ఈ ధాత్రీపతి మఱల మూర్ఛ నొందినట్లున్నవాఁడ"ని పెద్దయెలుంగునం బలికిన నాధ్వని విని యందున్న రాజభార్యలెల్ల బెల్లుగా నేమియేమి యని యరచుచు దాపునకుం బోయి చూచి గుండెలు బాదుకొనుచు, హా! యింకేమి యున్నదనువారును, యిట్టి ప్రాణనాథుఁడు మన కేమిటికిఁ దక్కుననువారును, ఆ గండముదాటి యింతలో మరల నిట్లయ్యె నేమనువారును, మునుబోలె మరల బ్రతుకునేమో యనువారును, మన కట్టియదృష్టము పట్టునా యనువారును, ఎంతలో నెంత సంతోషము పెట్టె నిట్లయ్యెనే యనువారును, ఈ నడుమ నీ సుఖము చేయకపోయినను నింతవిచారము లేకపోవుననువారును నారాజకాంతలెల్ల నానెలదినములలో నతండు గావించిన కృత్యములన్నియు స్మరించుకొనుచు నుచ్ఛస్వరంబుల నేడుఁవదొడంగిరి. అంతలో నా వృత్తాంత మాలించి సామంతమంత్రిపురోహితాదు లచ్చోటికి వచ్చి యతండు చచ్చుటం జూచి యచ్చెరువందుచు నంతకుఁబూర్వము జరిగిన కథయంతయు విమర్శించి బుద్ధిమంతులగు మంత్రు లాగాయకు లెచ్చట నున్నారని కేకవేసిరి.