పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

49


సీ.

ఆ సఖీమణి సప్తవాసరములలోన
        నట్లన గీర్వాణయక్షవరుల
దనుజముఖ్యులను గంధర్వకిన్నరులను
        మహినిఁ బ్రసిద్ధులౌ మనుజపతుల
భావంబుమీఱ గొప్పపటంబునను వ్రాసి
        యాపటంబును గొంచు నతిజవమున
నెప్పుడెప్పుడటంచు నెదురుచూచుచు మదిఁ
        గలఁగుచుండెడు నుషాకన్యఁ జేరి


గీ.

తాను దెచ్చినపటము ముందఱను నిల్పి
కన్నె! కను మిప్పటంబున నున్నవారి
వన్నె మీఱు సురాసురకిన్నరోర
గప్రముఖులైన సౌందర్యఖనుల ఘనుల.

58


క.

వీరల నందఱఁ గనుఁగొని
కోరికలను నిన్ను ప్రేమఁ గూడిన పురుషున్
నీరజముఖి! యెఱిఁగించిన
జేరువకున్ దోడి తెత్తుఁ జెలువుగ నతనిన్.

59


చిత్రరేఖ చిత్రపటములందలి నాయకుల వర్ణించుట

వ.

అని పలికి తదనంతరంబ చిత్రరేఖ యిట్లని వివరింపఁదొణంగె.


సీ.

పరికింపు కృతనేత్రపర్వులై వెలయు సు
        పర్వులు వీర లోపద్మగంధి!
తమిఁ జూడు రుచిరగాంధర్వులై చెలఁగు గం
        ధర్వులు వీర లోతలిరుఁబోణి!