పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగము 2019-20.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రూ.2,494.12 కోట్లు కాగా ఆర్థిక లోటు దాదాపు రూ. 29,141.72 కోట్లు. ఇవి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వరసగా 0.27 శాతం మరియు 3.14 శాతం.

145. బడ్జెటు అంచనాలు 2019-20: ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2,26,177.53 కోట్ల వ్యయాన్ని నేను ప్రతిపాదిస్తున్నాను. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 1,80,369.33 కోట్ల మేరకు అంచనా వేయబడగా, క్యాపిటల్ వ్యయం రూ. 29, 596.33 కోట్లకు అంచనా వేయబడింది. 2018-19 బడ్జెట్ అంచనాల కన్నా 2019-20 బడ్జెట్ అంచనాలు మొత్తం మీద 18.38 పెరుగుదలను చూపిస్తున్నాయి. రెవెన్యూ వ్యయం సుమారు 20.03 శాతం పెరగనుండగా, క్యాపిటల్ వ్యయం 2018-19 ఆర్థిక సంవత్సరం కన్నా 20.03 శాతం ఎక్కువ కానుంది.

146. రెవిన్యూ లోటు రూ.2,099.47 కోట్ల మేరకు ఉండగలదని అంచనా వేయగా, ఆర్థిక లోటు సుమారు రూ. 32,390.68 కోట్ల మేరకు ఉండగలదని అంచనా. ఆర్థిక లోటు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.03 శాతం ఉండగా, రెవెన్యూ లోటు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 0.20 శాతంగా ఉండగలదు.

ముగింపు

147. కొత్తగా ఏర్పడిన దేశాలు, రాష్ట్రాల అభివృద్ధి పథం తొలి 10-15 ఏళ్ళ పునాదులపైనే ఆధారపడి ఉంటుంది అనేది చరిత్ర చెప్పిన సత్యం. ప్రజలు మనపై ఉంచిన అపారనమ్మకాన్ని పదేపదే మా మంత్రిమండలి సభ్యులకు గౌరవ ముఖ్యమంత్రివర్యులు గుర్తు చేస్తుంటారు. రాష్ట్ర ప్రగతి కోసం ప్రజలకిచ్చిన వాగ్దానం మేరకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కోసం ఒక నిర్దిష్ట మార్గంలో పని చేశాము. ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టంలోని వాగ్దానాలు, అప్పటి ప్రధాన మంత్రి రాజ్యసభలో మనకిచ్చిన హామీల అమలు, కేంద్ర పన్నులో మన వాటా, కేంద్ర పథకంలో మనవాటా కోసం మన హక్కుల సాధన కోసం పోరాడటంలో ఎప్పుడు వెనుకంజ వేయలేదు. ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడే యాచకులం అంతకన్నా కాదు.

148. ఎన్నో అడ్డంకులు ఎదురైనా మన గమ్యాన్ని చేరే మార్గాన్ని నిజమైన నాయకత్వం సుగమం చేస్తుంది అనేది సత్యం. 2022 నాటికి దేశంలో 3 అగ్రగ్రామి రాష్ట్రాలలో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ రూపొందాలని, 2029 నాటికి దేశంలో అగ్రగామి రాష్ట్రం కావాలని, 2050 నాటికి ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా ఉపాధికల్పనా కేంద్రంగా, ఆంధ్రప్రదేశ్ రూపొందాలన్నదే మన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రిగారి ఆకాంక్ష. ఇది కేవలం మాటలకే పరిమితమైంది కాదు. సరైన అభివృద్ధి వ్యూహాలతో భావితరాలకు మార్గదర్శకం చేసే దిక్చూచి. మా ప్రభుత్వం పనిచేస్తుంది కేవలం మాకు ఓటు వేసినవారి కోసమే కాదు, మాకు ఓటు వేయని వారి కోసం మరియు మన బిడ్డలు, వారిబిడ్డల కోసం పనిచేస్తోంది. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం, భావితరాల భవిష్యత్తు కోసం పని చేయాల్సిన బృహత్తర బాధ్యత ప్రస్తుత తరంపై ఉంది.

28