పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగం 2024-25.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

121. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలతో సహా పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడం కోసం విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్, చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ మరియు హైదరాబాద్ - బెంగళూరు పారిశ్రామిక కారిడార్ల వంటి ప్రధాన పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టులను త్వరితగతిన అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం పని చేస్తోంది.

122. పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతికత పాలసీ 2021-2024 మరియు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ పాలసీ 2021-2024 అమలు చేయబడుతున్నాయి. 2019 నుండి, 65 కొత్త ఐ.టి. కంపెనీలు స్థాపించబడగా, ఇవి 47,908 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. అదానీ డేటా సెంటర్ పార్క్, WNS, Pulses, Ranstad మరియు ఇన్ఫోసిస్ వంటి ఐ.టి. దిగ్గజ సంస్థలు తమ కార్యాలయాలను మన రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుంటున్నాయి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ అభివృద్ధి కేంద్రాన్ని అక్టోబర్ 16, 2023 న ప్రారంభించడంతో, మన రాష్ట్రము ఒక సుస్థిర ఐటి హబ్ గా అభివృద్ధి చెందుతోంది.

123. 2023 లో జరిగిన ప్రపంచ పెట్టుబడి దారుల సదస్సులో ఎలక్ట్రానిక్స్ రంగంలోని పెట్టుబడిదారుల నుండి అధిక స్పందన లభించింది. ఈ సదస్సులో 15,711 కోట్ల రూపాయల పెట్టుబడులతో 55,140 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు 23 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. 2019 నుండి గమనిస్తే, మన రాష్ట్రంలో అదనంగా 17 ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీల స్థాపన ద్వారా 7,832 కోట్ల పెట్టుబడితో 34,750 మందికి ఉపాధి అవకాశాలను కల్పించటం జరుగుతోంది.

124. గౌరవ ముఖ్యమంత్రి గారు AIL Dixon టెక్నాలజీన్ ప్రైవేట్ లిమిటెడ్ని ప్రారంభించటంతో పాటు మరో రెండు కంపెనీలకు శంకుస్థాపనలు చేశారు. అదే విధంగా కడపలోని వై.ఎస్.ఆర్. ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (YSR-EMC) లో జూలై 2023 లో 450 కోట్ల రూపాయల పెట్టుబడితో మొత్తం 6,350 మందికి పైగా ఉద్యోగాలు సృష్టించబడతాయనే అంచనాతో మరో రెండు అవగాహన ఒప్పందాలను చేసుకోవటం జరిగింది.

32