తెలుగువారి జానపద కళారూపాలు/సిద్దీ నృత్యం

వికీసోర్స్ నుండి

సిద్దీ నృత్యం

హైదరాబాదు ప్రాంతంలో సిద్దీలు చేసేది సిద్దీ నృత్యంమనీ, ఇది జనపద నృత్యం కాదనీ పుట్టుకతో సిద్దీలు, ఆఫ్రికన్లు, 14వ శతాబ్దం మధ్య భాగంలో (అరబ్బులు, టర్కీలు, ఇరానీలు) మొదలైన ముస్లిం జాతుల వారు హైదరబాదుకు బానిసలుగా వలస వచ్చారనీ జానపద నృత్య కళా గ్రంథంలో డా॥ చిగిచర్ల కృష్ణారెడ్డిగారు ఉదహరించారు.

వీరు నైజాం నవాబు సేనల్లో నియమితులై నిజాం ప్రత్యేక అంగ రక్షక దళంగా పేరు పొందారు. వీరి నృత్యాల్లో వాటి పూర్వపు ఆప్రికా రీతులు ఇంకా నిలిచాయి.

యుద్ధ నృత్యాల్లో ఖడ్గనృత్యం ప్రత్యేక మైనది. ఈ నృత్యాన్ని వివాహ సందర్భాలలో చేస్తారు. నృత్యం చేసేవారు రంగు రంగుల లుంగీలు ధరించి, నడుముకు బెల్టు బిగించి, బెల్టులో బాకును ధరించి, చేతితో ఖడ్గం పట్టి నృత్యం చేస్తారు. నృత్య కారులు అర్థ వలయాకారంలో ఏర్పడి వెనుక పాడే వంత పాటకు రక రకాల ఖడ్గ యుద్ధ రీతులు ప్రదర్శిస్తారు. వేగం ఎక్కువయ్యే కోద్దీ నృత్యం పరాకాష్ట నందుకుంటుంది. ఆ సమయంలో నృత్యకారులు బాకుల్ని నోట కరుచుకుని, పైకి ఎగురుతారు. నవ దంపతుల్ని ఆశీర్వదించే నినాదాలు చేస్తూ కృత్యంతో రంగం అవతలికి వెళతారు. డప్పు వాయిద్యం సిద్దీ నృత్యానికి భిన్నంగా వుంటుంది. దీని రీతి ఎక్కువ ప్రసన్నం, నృత్యం అనటం కంటే వాద్య గోష్టీ అనవచ్చునంటారు కృష్ణారెడ్డిగారు.