తెలుగువారి జానపద కళారూపాలు/విలక్షణ వీథి భాగవతం తూర్పు భాగవతం

వికీసోర్స్ నుండి

విలక్షణ వీథి భాగవతం తూర్పు భాగవతం

ఆంధ్ర దేశంలో ప్రఖ్యాతి వహించిన వీధి భాగవతాలలో కూచిపూడి వీధి భాగవతాలలో కూచిపూడి వీథి భాగవతాలు గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాయి. వీరే కాక గొల్ల భాగవతులూ, యానాది భాగవతులూ, మాల భాగవతులూ, చిందు భాగవతులూ మొదలైన వారూ భాగవతాలను ప్రదర్శించారు

ఆనంద గజపతీ, ఆదిభట్లవారూ:

పై వారే కాక ఉత్తరాంధ్ర దేశంలో విశాఖపట్టణం, శ్రీకాకులం, గంజాం, కోరాపుట్టి మొదలైన ప్రాంతాల్లో తూర్పు భాగవతమనే భాగవతం ప్రచారంలో వుంది. ఇది సామాన్య ప్రజానీకాన్నే కాక, పండితుల్ని, విద్వాంసుల్నీ, కవుల్నీ, గాయకుల్నీ ఆకర్షించడమే కాక ఇది ఒక విశిష్ట నర్తన రీతి గానూ, సంగీత సాంప్రదాయం గానూ, మృదంగ బానీగానూ ఈ నాటకం పోషింపబడుతూ వుందని శ్రీ గరిమెళ్ళ రామమూర్తి, శ్రీ డి.వై. సంపత్ కుమార్ గారలు తెలియ చేస్తున్నారు.

ఇది పైన సూచించిన ఆయా ప్రాంతాలలో తిరునాళ్ళలోనూ, అమ్మవారి జాతర్లలోనూ, ఈ భాగవాతాలు ప్రదర్శింప బడి ప్రజాభిమానాన్ని చూరగొన్నాయి. పండితులైన హరికథా పితామహుడు అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు, ఆనంద గజపతి మహారాజు లాంటి కళా పోషకుల ఆదరాభిమానాల్ని చూరగొనడమే కాక ఎందరో ఉత్తమ భాగవత కళాకారులకు సింహతలాటాలను ఘంటా కంకణాలనూ కలియుగ సత్యభామ__ పండిత సత్యభామ__అభినయ సత్యభామ __ గాన కోకిల __ వసంత గాన కోకిల మొదలైన బిరుదులను గూడ ప్రసాదించారు.

భాగవత కథే భాగవతం:

భాగవతమంటే కృష్ణ సంబంధమైన కథలను కేళిక చేయడమే. ఇందులో కృష్ణా సత్యభామల ప్రణయ కలహం ముఖ్యమైనది. దీనినే కృష్ణ పారిజాతమనీ, భామా కలాపమనీ వ్వవహరిస్తారు. ప్రారంభంలో సిద్దేంద్ర యోగి భాగవత సంబంధమైన ఈ భామాకలాప రచన చేసి ప్రచారం చేశారు.

అయితే భామాకలాపాన్ని సిద్ధేంద్రయోగి రచనను కూచిపూడి వీథి భాగవతుల అధిక ప్రచారంలోకి తీసుకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే సిద్ధేంద్రుల వారి పారిజాతాపహరణానికి తూర్పు వారు ప్రదర్శించే భాగవతానికి వ్వత్యాసం వుంది. కూచిపూడి భామాకలాపంలో కనిపించే దరువులు మొదలైనవి వీరి భాగవతాలలో తక్కువ కనిపిస్తాయి.

బలరామ భుక్త భాగవతం:

తూర్పు వారు ప్రదర్శించే పారిజాతాపహారణం ఆ ప్రాంతానికి చెందిన బలరామభుక్తగారు వ్రాసింది. కథ ఒకటే అయినా పాటలకు సంబంధించిన బాణీ, దరువులూ, నడిపే విధానం, మృదంగ వాయిద్య రీతుల్లోనూ, కూచిపూడి వారి బాణీకి, తూర్పు వీథి భాగవత బాణీకీ చాల తేడా వుంది.

బలరామభుక్త గారి తరువాత ఈ జిల్లాకు చెందిన నరసింగబల్లి వారు, కేశవ పురి వారు, బొబ్బిలి వారు, దువ్వవారు, నెల్లిమర్ల వారు ఇత్యాదులు ఎందరో ప్రసిద్ధ నాట్య శాస్త్ర వేత్తలు, ఈ తూర్పు వీథి భాగవత బాణీకీ కావలసిన కలాప రచనలను చేశారు.

అయితే ఈ నాటికీ వంకాయల బలరామభుక్త వ్రాసిన గ్రంథమే ప్రస్తుతం ప్రచారంలో వుందని చెపుతారు. ఈ సాంప్రదాయం కూచిపూడి వారి బాణీకి భామా కలాపానికి దగ్గరలో వున్నా పాట పాడే బాణీ, దరువు నడిపే విధానం, మృదంగం వాయించే రీతి ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆహార్యాది వేష ధారణలో, అలంకారంలో కూడ ప్రత్యేకాత కనిపిస్తుంది.

ముచ్చటైన కథా వస్తువు:

తూర్పు వీధి భాగవత కలాపంలో కథా వస్తువు ఒక ముచ్చటైన సంఘటన మాత్రమే...తన మందిరం నుంచి అలిగి వెళ్ళి పోయిన శ్రీ కృష్ణుని, సత్యభామ రాయ భారం పంపించి__మళ్ళీ తన ఇంటికి రప్పించుకున్న సంఘటనే ఈ కథా వృత్తంతం. కథ చిన్నదే అయినా ఇందులో అష్టవిధ నాయికల వర్ణనలూ, అవస్థలూ విప్రలంభ శృంగారంతో నిండి ఇది ఒక పెద్ద ప్రబంధమై పోయి, వరుసగా ఈ భాగవతాన్ని తొమ్మిది రోజులు ప్రదర్శించేవారట. ప్రారంభంలో, అటు వంటిది, కాలానుగుణ్యంగా మూడు రాత్రులకు కుదించారు. అయితే ఈనాడు ఈ కథను ఒక్క రాత్రే పూర్తి చేస్తున్నారు. శాస్త్ర యుక్తంగా ప్రదర్శించే భామా కలాపం తరువాత, గొల్లకలాప ప్రదర్శనాన్ని కూడ జన రంజకంగా ప్రదర్శించేవారు. అయితే ఈ గొల్ల కలాపం, దేశీ సాంప్రదాయానికి సంబంధించిన కళా రూపంగా ప్రదర్శించేవారు.

తూర్పు బాణీ ప్రత్యేకత:

ఈ భాగవత ప్రదర్శనంలో దరువులూ, ద్విపదలూ, కంద పద్యాలూ, వృతాలూ, అర్థ చంద్రికలూ, ఏల పదాలూ, చూర్ణికలూ మొదలైన దేశి సంగీత రచనలు వాటుతూ వుంటారు. ముఖ్యంగా ఈ దరువులు ఈ ఆటల్లో ప్రాముఖ్యం వహిస్తూ వుంటాయి.

భరతుడు నాట్య శాస్త్రంలో ఉదహరించిన ప్రాచీన ధృవాగానం ఈ నాటికీ తూర్పు వీధి భాగవతులు ప్రదర్శిస్తున్నారు. రాగాలూ, తాళాలూ, నేటి కర్ణాటక సాంప్రదాయానికి చెందినవైనా, రాగ సంచారం, తాళ ప్రసారం మొదలైన విధానాలు ప్రాచీన సంప్రదాయ పద్ధతిని అనుసరించే వున్నాయి. ముఖ్యంగా తెలుగు దేశపు కళారూపాలలో ఈ కళారూపంలోనూ అత్యంత ప్రాముఖ్యం వహించని మృదంగం ఈ తూర్పు వీధి భాగవతంలో అత్యధిక ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ముఖ్యంగా తూర్పు వీధి భాగవతానికి ఆయువు పట్టు మృదంగ విన్యాసమే.

మృదంగ ఘోషల్లో, ముత్యాల సరాలు:

తూర్పు వీధి భాగవత బాణీలో మృదంగం అధిక ప్రాముఖ్యాన్ని వహిస్తుంది. వారి వాయిద్య ఉధృత తాండవంగా వుంటుంది. ప్రేక్షకులను ఉత్తేజపరుస్తుంది. ఉద్వేగ పరుస్తుంది. మార్థంగికులు తమ వాయిద్యంలో సముద్రం ఘోషించి నట్లూ, పిడుగులు పడినట్లూ, ఉరుములు ఉరిమినట్లూ, మేఘాలు గర్జించి నట్లూ, భేరీలు , నగరాలు మ్రోగినట్లూ ప్రళయంగా వుంటుంది. ఆ దరువులను బట్టే నృత్యం కూడా అంత ఉద్వేగంగా వుంటుంది. వారి మృదంగ వాయిద్యంలో ఎంతటి గంభీర నాదాలుంటాయో, అంతటి సున్నితమైన, మృదుమధురమైన కోయిల స్వరాలూ, చిలుక పలుకులూ మొదలైన వాటిని మృదంగం మీద పలికిస్తూ ప్రేక్షకులను ఆనంద డోలికల్లో ముంచేస్తారు.

ఈ విశిష్ట వాయిద్యంలో నిష్ణాతులు బాజ్ఞాతి ఆస్థాన విద్వాంసులైన బుగత రామయ్యగారూ, ఆయ కుమారుడు గొప్పన్న గారు.

ఆ తరం తరువాత, కింతాడ అప్పన్న, ముట్నూరి సంగమేశ్వర శాస్త్రి, దూపం సూర్య లింగం, ఆగూరు కంచరాం, గ్రామ వాస్తవ్యులు, ప్రముఖ భాగవత శిఖామణి యైన దూడల శంకరయ్య గారి కుమారుడు, శ్రీ గోవిందరావు లాంటి వారు ప్రముఖులు.

ఈ బాణీలో సుప్రసిద్ధ మార్థంగికులు. అనేక బిరుదులు పొంది, అనేక మంది భాగవత మార్థంగికులను తయారు చేసిన ప్రఖ్యాతి అభినవ నందికేశ్వరునిగా పేరు తెచ్చుకున్న కీ॥శే॥ కోరు కొండ సత్యం గారికే దక్కుతుంది.

ముందు వెనుకల మృదంగ వాయిద్యం:

ఈ భాగవత కళలో మృదంగ వాయిద్య ఒక ప్రతేక బాణీలో ప్రాముఖ్యం వహించింది మృదంగం. ఈ బాణీకి జీవమని ముందే తెలుసుకున్నాం. ఇతర కళా రూపాలలో, కూర్చుని మృదంగం వాయిస్తూ వుంటే ఈ ప్రదర్శనంలో రెందు మృదంగాల్ని ముందు వెనుక నడుముకు కట్టుకుని గంటల తరబడి ప్రదర్శనం జరిగినంత కాలం, తెల్ల వార్లూ పాత్రల అభినయంతో పాటు నిలబడి వాయించటం చెప్పుకోతగిన విషయం. ఇది ఎంతో అబ్బురంగా వుంటుంది.

ఇది సంపూర్ణ దృపద రీతి, బొబ్బిలి ఆస్థానంలో "నంది భరతం" అనే మృదంగ జతుల గ్రంధం సృష్టించబడింది. ఒకే తాళలో, సప్త తాళాలు ఇమిడి వుండేరీతిలో, శబ్దాలను కూర్చి ఆడించటం ఈ కళాకారుల ప్రతిభను వెల్లడిస్తోది.

అమ్మవారి, జాతర అయ్యగార్ల ప్రదర్శన:

విశాఖ, శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ అమ్మవారి జాతర జరుగుతుందో అక్కడ ఈ తూర్పు వీథిభాగవతం విధిగా ప్రదర్శించటం ఇప్పటికీ అచారంగా వస్తూంది. ముఖ్యంగా జాతర్లలో గ్రామ ప్రజలు ఎంతో ఆప్యాయితతో తెల్లవార్లూ ఈ కళారూపాన్ని చూచి ఆనందిస్తారు. ఈ కళాకారులు ఒకే రాగంలో దరువు ప్రారంభించి గంటల తరబడి గంతులు వేస్తూ, హెచ్చు శృతిలో దీర్ఘకాలం దమ్ము పట్టి ఆలాపన చేయటం వలన, ఈ భాగవతాన్ని నక్కల భాగవతం అని జానపదులలో వాడుకై పోయింది.

అందరూ ఆదరించిన కళ:

ముఖ్యంగా ఈ భాగవతాలను ప్రదర్శించే వారు కూచిపూడి బ్రాహ్మణుల మాదిరి ఒక తెగకు చెందిన వారు కారు. అన్ని కులాలకూ, వర్గాలకూ చెందిన వారున్నారు. బ్రాహ్మణులు, విశ్వ బ్రాహ్మణులు, కొప్పువెలమలు, దాసర్లు, పంచములలో కూడ ఈ కళాకారు లున్నారు.

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన అప్పలస్వామి, అనే భాగవత కళాకారుడు పంచమ కులానికి చెందిన వాడు, ఈ భాగవతాలలో పాత్రలు ధరించే వారందరూ పురుషులే.

అయినా ఏభై సంవత్సరాల క్రితం, ఒకే ఒక స్త్రీ, భామ వేషం ధరించి, ఆనాటి ప్రజానీకాన్ని ఆశ్చర్యపర్చిందట. ఆమె "తెర్లాం" గ్రామానికి చెందిన కాలి గుంటి వెంకట స్వామి అనే భాగవత కళాకారుని కుమార్తె. గ్రామాలలో సహజంగా వుండే సెంటి మెంట్సును బట్టి ఆమె పేరు " పొయ్యిబుగ్గి" ఎనభై సంవత్సరాల వయస్సులో తినటానికి తిండి లేని దీనావస్థలో కాలం గడిపింది.

ఎందరో కళాకారులు, ఎన్నో ప్రదర్శనాలు:

ఈనాడు విశాఖ జిల్ల శృంగవరపు కోట తాలూకా, ఖాసా పేట గ్రామానికి చెందిన విశ్వబ్రాహ్మణుడు కొచ్చెర్ల బ్రహ్మం భాగవత కళాకారుడు తన కుమార్తె అంజలికి ఈ విద్యను నేర్పి, అనేక ప్రదర్శనలను ఇప్పిస్తున్నారు.

అలాగే బొంతల కోటి జగన్నాథం, దూడల శంకరయ్య, బొంతల కోటి రామమూర్తి, దూర్వాసుల మాణిక్యం, కురుమోజ రామమూర్తి అచారి ... హిమంది బోడిదాసు. భడితోక సత్యనారాయణ అచారి.... చందక వెంకటప్పారావు.... దూడల లింగ మూర్తి.... తంపెట్ల సత్యం...... కాలి గుంటం అప్పల స్వామి ...... కొచ్చర్ల బ్రహ్మం ..... చామర్తి సత్యం, కోనేటి అప్పారావు .... యర్రా సూర్య నారాయణ, అలకంసెట్టి నరసింగారావు .... యర్రా సింహాచలం, వానపల్లి పరదేశి .... మీసాల అప్పలనాయుడు, మీసాల ఎరుకు నాయుడు .....సుక్క పోలి నాయుడు. గొర్లి పేట రాముడు .... వైష్ణవ అప్పల స్వామి దొమ్మి, అప్పల స్వామి .... రంగు ముద్ర అప్పల స్వామి, ముసిది అవతారం .... బురడ గవరయ్య .... ధర్మవరపు గురువులు .... వరదా లక్ష్మణ రావు, పిన్నింటి రామునాయుడు, ఆర్ సింహాచల శర్మ, గిరిజాల సత్య నారాయణ, కల్లూరి సూర్య నారాయణ, శంబన సత్యనారాయణ, గురువిల్లి స్వామి నాయుడు, ఎం. సిమ్మప్పడు, పులఖండం నారాయణ మూర్తి శర్మ, కుందుం సాంబమూర్తి, పేరూరు వరహాలు మొదలైన ఎందరో సుప్రసిద్ధ కళాకారులు ఈ నాటికీ, ఈ తూర్పు భాగవత కళను ఆరాధిస్తున్నారు. గమనించ వలసిన విషయ మేమంటే, ఈ కళాకారులందరూ అరవై సంవత్సరాలకు పైబడిన వారే, అంటే ఈ తరం అంతరిస్తే తరువాత తరం వారు ఈ కళను ఆరాధించగలరా? అన్నది సందేహం.

ఈ నాటికీ అరవై మేళాలు:

ఈనాటికీ ఆ ప్రాంతంలో అరవై భాగవత మేళాల వరకూ వున్నాయి. ప్రతి మేళానికి పదిమంది సభ్యులకు తక్కువ వుండరు. ఆ విధంగా ఆరు వందలకు పైగా సంగీత నృత్య కళాకారులు, సుమారు నూరు మంది, మృదంగ వాద్యకులూ వున్నారు. ఒక బాణీకి చెందిన ఇన్ని మేళాలు, ఇంత మంది కళాకారులు భారతదేశంలో ఏ ఒక్క కళారూపంలోనూ లేదంటారు సంపత్ కుమార్ గారు.

ఇటీవల మార్పు;

మామూలుగా ఈ తూర్పు బాణీలో వున్న ప్రత్యేకత ఏమంటే ఒకే రాగంలో దరువు ప్రారంబించి, గతులనూ, సంగతులనూ మారుస్తూ గంటల తరబడి గానం చేస్తారు.

ఇంతకు ముందు అటా పాటా సమపాళ్ళలో నడిపించినా, ఇటీవల కాలంలో, భామా పాత్రాభినయానికి ప్రాముఖ్యం పెరగటం వల్ల, ఆటకు సంబంధించిన నృత్యాభినయం తగ్గి పోయి పాటకు ప్రాముఖ్యం పెరిగిందంటారు. భామ పాత్రధారి ఎంత గొప్పగా గానం చేస్తే, అంత గొప్పగా ప్రజలు ఆదరిస్తారట. ఆయననను గొప్ప కళాకారుడుగా గుర్తిస్తారట. అందువల్ల భాగవతాల్లో కళాకారుడు దీర్ఘగానాలు ప్రవేశపెట్టి ప్రేక్షకులను ఆనందపరుస్తారట.

ఆదరణల లేక అంతరిస్తున్న కళ:

తూర్పు భాగవతంగా శతాబ్దాల తరబడి ప్రసిద్ధి చెంది, ప్రజలను అలరించిన,ఈ బాణీ, ఈనాడు అన్ని జానపద కళారూపాలు ఎలా శిధిలావస్థలో వున్నాయో ఇదీ అలాగే క్షీణదశలో వుంది. నాటి ఆదరణ ఈనాడు లేదు.

ఒకప్పుడు విజయనగరం, బొబ్బిలి, మాడుగుల, కళింకోట, మందసా, చోడవరం, చీకటి కోట, ధారాకోట, సాలూరు, పాఅర్వతీ పురం మొదలైన సంస్థానాలు, జమీందారులూ, ధనవంతులూ, పండితులూ, మహా విద్వాంసులూ, ఈ కళను ఆదరించి పోషించారు. ప్రజలు ఆదరించారు హర్షించారు, పోషించారు.

నాటి ఆదరణ ఈనాడు లేదు:

ఈ కళా రూపానికి, నాటి పోషణ ఈనాడు లేదు. మహా విద్వాంసులైన భామ వేషధారులూ, మహా విద్వాంసులైన మార్ధంగికులు, కొద్ది మంది మాత్రమే కొన వూపిరితో వున్నారు. ఇలాగే కొంతకాలం జాగు చేస్తే ఈ కళారూపం నామమాత్రం కూడ లేకుండా పోతుంది. అక్కడక్కడ మిగిలివున్న ఆయా విద్వాంసుల బాణీని రికార్డు చేయాలి, డాక్యుమెంటరీలు తీయాలి. వేష భూషణ అలంకారాలను భద్రపరచాలి. అక్కడక్కడ మిగిలి వున్న వృద్ధ కళాకారుల ద్వారా ఈ నాటి యువతరానికి గురుకుల పద్ధతిలో ఈ బాణీని అభ్యసింపచేయాలి.

ఆసక్తి లేక అంతరిస్తున్న కళ:

అయితే ఈనాతి యువతరం ఈ కళను నేర్చుకోవాలనే ఆసక్తిని చూపడం లేదు. అందుకు ముఖ్య కారణం ఈ విద్యను నేర్చుకోవడం అతి కష్టమైనది కావడమే. అంతే కాక ఈకళ ద్వారా జీవించగలమనే నమ్మకం లేక పోవడం వల్ల తరతరాలుగా వస్తున్న ఈ పారంపర్య కళను వదలి, నేటి యువతరం ఇతర జీవన విధానాలను వివిధ వృత్తులనూ

అవలంబిస్తున్నారు. అందువల్ల ఈ కళను ప్రభుత్వం తప్ప మరెవరూ పోషించే అవకాశం లేదు.

మన కళలు జాతికి జీవనాడులు లాంటివి. పరిపూర్ణ కళాస్వరూపమై జానపదులకు అత్యంత సన్నిహితమై రసాను భూతినీ, ఆత్మానందాన్ని

కలిగిస్తున్న ఈ తూర్పు భాగవతబాణీని క్షీణించకుండా చూడ వలసిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఎంతైనా వుందంటారు డి.వై. సంపత్ కుమార్ గారు.