తెలుగువారి జానపద కళారూపాలు/బగ్గు గొల్లల ఒగ్గు కథలు

వికీసోర్స్ నుండి

బగ్గు గొల్లల ఒగ్గు కథలు


రాగభావ యుక్తంగా ఒక కథను అల్లడం, చెప్పడం కథాగానం అని వ్వవహరించవచ్చు. ఈ కథాగాన కళా ప్రదర్శనంలో ఒకరు ప్రథాన కథకులు, అయితే ఇద్దరూ ముగ్గురూ లేక అంతకు ఎక్కువ మంది సహా కళాకారులుంటారు ఒగ్గు కథలో.

గానకళారూపాలు:

ఇటువంటి గానకళారూపాలు మన రాష్ట్రంలోనే అనేకం వున్నాయి. జముకుల కథ, గొల్ల సుద్దులు, వీరముష్టి కథ, పిచ్చుకుంటుల కథ, పంబ కథ, మొదలైనవి. ఆంధ్ర దేశంలో వివిధ ప్రదేశాలలో ప్రచారంలో వున్నాయి. కథ చెప్పే తీరులోనూ, సహకార వాయిద్యాలలోనూ, స్వీకరించే కథలలోనూ ఈ కళా రూపాలు భిన్నంగా వుంటాయి. కాని సంగీతం అభినయాలను ఆశ్ర యించడం ఏదో ఒక కథను ఆలంబనం చేసుకోవడం, ఈ కళారూపాల యొక్క సామాన్య లక్షణం. అందుకే ఈ కళారూపాలనన్నింటినీ కలిపి కథా గాన కళ అని నామకరణం చేయవచ్చు. అన్నిటిలోనూ ఛందోబద్ధమైన రచనలతో పాటు అనేక రకాలైన పాటలు చోటు చేసుకున్నాయని కొత్త దేశిపతిరావు గారు నాట్యకళ పత్రికలో ఉదహరించారు.

కథనుబట్టి కళారూపం పేరు:

ఈ కథా గాన కళారూపాల పేర్లు ఆ కథలను చెప్పే వారి కులాలను బట్టీ, కథ చెప్పే సమయంలో ఉపయోగించే సహకార వాద్యాలను బట్టీ, కథా వస్తువును బట్టీ వచ్చాయి.

సహకార వాయిద్యం అధారంగా పేరును సంతరించుకున్న కళా రూపాలు పంబ కథ, జముకుల కథ, బుర్ర కథ, ఒగ్గు కథ, ఇక తెగలను బట్టి పేర్లు వచ్చిన కళారూపాలు జంగం కథ, పిచ్చు కుంటుల కథ, గొల్ల సుద్దులు మొదలైనవి. కథా వస్తువును బట్టి వ్వవాహృతమౌతున్న కళారూపాలు హరి కథ, పాండవుల కథ, రేణుకా కథ మొదలైనవి.

భిన్న విభిన్న మైన కథాగాన కళా రూపాలలో ఒగ్గు కథ ఒక్క తెలంగాణా ప్రాంతంలో తప్ప మరో ప్రాంతంలో లేదు. అందులోనూ వరంగల్, నల్లగొండ, హైదరాబాదు జిల్లాలలో బహుళ ప్రచారంలో వుంది. ఈ మూడు జిల్లాలలోనూ సుమారు ఏభై ఒగ్గు కథా బృందాలు కథలు చెపుతూ వున్నాయి.

ఒగ్గు:

శైవ సంప్రదాయంలో ఒక వర్గం వారు శివుని డమరుకాన్ని ఒగ్గు అంటారని వీనికే జెగ్గు, జగ్గు అనే పేర్లున్నాయని ఈ ఒగ్గును కథకు వాయిద్యంగా వాడుతూ కథ చెబుతారు కాబట్టి ఈ కథలకు ఒగ్గు కథ అనే పేరు వచ్చిందనీ, ఈ కథలు శైవ మతానికి సంబంధించినవనీ మల్లన్న, బీరప్ప కథలు ప్రారంభంలో చెపుతూ వుండేవారనీ, అదీ కాక కురుమ కులం వారే ఈ కథలు చెప్పేవారనీ, బీరప్ప, మల్లన్నలు వీరి కులదేవతలనీ, డా॥ బిట్టు వెంకటేశ్వర్లుగారు కరీంనగర్ రాష్ట్రీయ జానపద కళోత్సవాల సంచికలో వివరించారు.

తొలి చెమట, మలి చెమట:

శివుని తొలి చెమట బీరప్పగానూ, మలి చెమట మల్లన్న గానూ పుట్టినట్లు కురుమల కథలు చెపుతున్నాయి. బీరప్పను కురుమల కులగురువుగా భావిస్తారు. మల్లన్న సాక్షాత్తు జన్మ నిచ్చిన వాడు. కురుమలకు మరొక కథనం ప్రకారం, ఆదిరెడ్డి నీలమ్మల సప్తమ సంతానం, అతను పద్మాక్షి, రత్నాంగి అనే ఇద్దరిని పెండ్లాడతాడు. పద్మాక్షికి వివాహంలో వత్తి కంకణం కడతాడు. ఆమెకు భూములను, పశువులను ఇస్తాడు. రత్నాంగికి ఉన్ని కంకణం కడతారు. ఆమెకు గొఱ్ఱెలను ఇస్తాడు. పద్మాక్షి సంతానం కురుమల లోని వత్తి కంకణం గోత్రం వారు గానూ, రత్నాంగి సంతానం, ఉన్ని కంకణం గోత్రంవారు గాను ఒప్పుకుంటున్నారు.

కురుమల కథ:

మల్లన్న బీరప్ప కథలను కురుమలు చెప్పుకుంటారు. అవే ఒగ్గు కథలు. ఈ కురమలనే బగ్గు వాళ్ళు, ఒగ్గోళ్ళు అనే పేర్లు. ప్రస్తుతం వీరు ఆ రెండు కథలనే కాక ఇతర కథలను కూడ చెపుతున్నారు. ముఖ్యంగా మల్లన్న కథను కురుమల వివాహ సందర్భాలలో చెపుతూ వుంటారు. ఈ కథలను చెప్పే కురుమలే ఆ కులంలో పురోహితులు. మల్లన్న కథను చెప్పిన తరువాతే కురుమ వధూవరులకు వివాహం జరిపిస్తారు. వీరికి కూడ గ్రామాలు, తాలూకాలు హద్దులుండేవట. ఒకరి హద్దులోకి మరొకరు వచ్చి వివాహాలు చేయకూడదట. పురోహితుడు కూడ ఇతర సమయాల్లో కథలు చెప్పకూడదట. దీన్ని అతిక్రమిస్తే కులబహిష్కారం వుంటుందట. చుక్కా సత్తెయ్య అనే నేటి ప్రసిద్ధ ఒగ్గు కథకుడు ఒకప్పుడు బహిష్కార శిక్షకు గురయ్యాడని చెపుతారు. అతను ఈ కథను కళారూపంగా ప్రచారంలోకి తెచ్చి ధనాన్ని, పేరు ప్రఖ్యాతుల్నీ సంపాదించిన తరువాత కురుమ కులగురువులు అతనినే ఆశ్రయించి, అతని మార్గంలోనే కుల హద్దుల్ని పాటించ కుండా ఈ కథలను చెపుకున్నారనీ, అలా ఈ ఒగ్గు కథ ఒక కళారూపంగా రూపు దిద్దుకున్నదనీ బిట్టు వెంకటేశ్వర్లుగారు అంటున్నారు.

చుక్క సత్తయ్య:

ఈ నాడు ఒగ్గు కథను ప్రతిభావంతంగా చెపుతూ, దాని కొక మన్నననూ, గుర్తింపునూ కలగ జేసి అది ఒక వుత్తమ జానపద కళారూపమని నిరూపించిన వారు వరంగల్ జిల్లా జనగామ వాస్తవ్యులు చుక్క సత్తయ్య గారు. ఆయన ఒగ్గు కథను గురించి ఈ విధంగా వివరిస్తున్నారు.

మావృత్తి కథ వీరభద్రుని గూర్చీ. ఆ తరువాత మల్లిఖార్జున, రేణుకా ఎల్లమ్మ, ఆట్కరన్ కథ, హరిశ్చంద్ర, మహందాత మొదలైనవే గాక చారిత్ర గాథలకు సంబందించిన ఇరవై ముప్ఫై కథల వరకూ చెప్పగలమంటారాయన.

బీరప్ప కథ, చుక్కయ్య కథనం:

ముఖ్యంగా మేము చెప్పే కథలు వీరభద్రుని గూర్చి. దీనినే వీరప్ప కథ అని పిలుస్తాం అంటా డాయన. వారి కుల దైవం అయనే గనక అతని పేరు మీద వచ్చే పండగలకు బీరప్ప ఒగ్గు కథలను చెపుతారు. అలాగే మల్లన్న కథలను కూడా చెపుతారు. తెలంగాణా ప్రాంతంలో "వీరప్ప దేవుడు. మల్లన్న దేవుడు" గుళ్ళు వుంటాయి. ముఖ్యంగా ఒగ్గు కథలు చెప్పే (కూర్మ) గొల్ల వారు.అంటే యాదవులు మల్లన్న బీరప్ప కథల్ని పండుగల సందర్భంలో గొల్లవారితోనే చేయించుకుంటాదు. ఇది పారంపర్యంగా వస్తున్న సంప్రదాయం.

బీర్ఫప్ప పండుగ రోజున బీరప్ప యొక్క జీవిత చరిత్రను గురించి ఒగ్గు కథా రూపంలో చెపుతారు. ఒక్క యాదవులే కాక ఇతర కులాలకు చెందిన వారు కూడ ఈ కథను ఎంతో ఆప్యాయతతో చెప్పించుకుంటారు. అంటే ఆ కథ యొక్క విశిష్టత అంతటిది. ఆ కళారూపం యొక్క గొప్పతనమది.

ఒగ్గు కథకు ఈ పేరెలా వచ్చింది?

వీరభద్రుడూ, మల్లిఖార్జునుడు వీరి చేతుల్లో వుండే వాయిద్యం డమరుకం ( అంటే జగ్గు) ధరించేవారు. చుక్క సత్తయ్య గారి పెద్దలు, రెండు వందల సంవత్స రాల క్రితం మల్లిఖార్జునుడు ఇచ్చినటువంటి గొఱ్ఱెలను కాచుకుంటూ ఈ జగ్గుపైనే, అడవులలో చెట్ల క్రింద ఒగ్గు కథలు చెప్పేవారట. రాను రాను ఈ జగ్గుతో చెప్పే బగ్గుకథ ఒగ్గుకథగా రూపాంతరం చెందింది.

తాతలు చెప్పిన కథలు:

ఈ ఒగ్గు కథలు ఈ నాటి కళాకారులు వ్రాసిన కథలు కావు. వీరి తండ్రులు చెప్పిన కథలు వీరు చెపుతున్నారు. వీరి తండ్రులకు తాతలకు వీరి తాతలు చెప్పిన కథలివి.

ముఖ్యంగా ఒగ్గు కథలు చెప్పే వారి వృత్తి గొఱ్ఱెలను కాయడం. నిపుణులైన వారు ఒగ్గు కథలు చెప్పడం, ముఖ్యంగా వీరు కథను ప్రారంభించే ముందు డోలును వాయిస్తూ, వీరణంతో శబ్దం చేస్తూ డమరుకంతో దడ దడ లాడిస్తూ గంగా దేవిని ప్రప్రథమంగా ప్రార్థిస్తారు.

కథా బృందం:

ఈ ఒగ్గు కథలు చెప్పే వారు అయిదు నుంచి పది మంది వరకూ వుంటారు. అయితే ఇంత మంది వుండాలనే నబంధా లేదు. వారి వారి సౌలభ్యాన్ని బట్టి బృందాలను ఎర్పాటు చేసుకోవచ్చు. ముఖ్యంగా కథకు కనీసం అయిగురు సభ్యులైనా వుండాలి. ఈ అయిదుగురిలో ఒకరు ప్రధాన కథకుడు. మరొకరు సహాయకుడు. వీరిద్దరూ ముందు భాగంలో వుంటారు. వారి వెనుక భాగంలో ముగ్గురు నిలబడతారు. వారిలో ఒకరు డోలు, మరొకరు తాళం, ఇంకొకరు కంజిరా ధరిస్తారు. వీరందరూ ఒక వంక వాయిద్యాన్ని సాగిస్తూ వంత గానాన్ని కూడ అందుకుంటారు. ప్రధాన కథకుడు సందర్భాన్ని బట్టి ఆ యా పాత్రలు ధరిస్తూ కథాగానం చేస్తూ వుంటాడు. వంత దారుడు కూడ పాత్ర ధారణలో సందర్భాన్ని బట్టి సహకరిస్తూ వుంటాడు. వీరిరువురూ పాత్రానుగుణ్యంగా కొంత కొంత ఆహారాన్ని మారుస్తూ వుంటారు. అయితే ఈ ఆహారం మార్పుల్లో కథ ఏమాత్రం కుంటుపడదు.

స్త్రీ వేషం:

ప్రథాన కథకుడే చీర కట్టి, కొప్పు పెట్టి,ముత్తైదువుగా స్త్రీ పాత్రను ధరిస్తాడు. ఇప్పటి వరకూ ఈ కథ తెలంగాణా హద్దులు దాటి లేదు. కథనంలో ముఖ్య కథకుడు, ముఖ్యవంత లిద్దరూ ఒకే రకమైన నటనను అభినయిస్తారు. ఏ‍డమచేతిని చెవికి అడ్డంగా గానీ నడుంపైనగానీ పెట్టి, కుడి చేతిని పైకి ఎత్తి కథను వివరిస్తూ కథానుగుణంగా చేతితో అభినయిస్తారు. ప్రధాన కథకుని రాగాన్ని అందరూ అందుకుంటారు. పాత్రకు తగినట్లు స్త్రీ పాత్రల సందర్భంలొ కంఠాన్ని స్త్రీలా అనుకరిస్తారు. చేతులు తిప్పడంలోనూ, మూతి తిప్పడంలోనూ, శోకాలు పెట్టడంలోనూ, సిగ్గును అభినయించడంలోనూ, స్త్రీ పాత్రభినయాన్ని చక్కగా ఆభినయిస్తారు. తాళాలు డోలు మాత్రం ప్రారంభం నుండీ చివరి దాకా ఉపయోగిస్తారు.

ఒగ్గుడోలు నృత్యం:

ఒగ్గు కథలో ఎక్కువ ప్రాముఖ్యం వహించేది ఒగ్గు డోలు. ఇది ఒక మీటరు పొడవుండి గుండ్రంగా వుంటుండి. డ్రమ్ము ఆకారంలో వుండే ఇత్తడి వాయిద్యం. ఈ వాయిద్యాన్ని పూర్వం చెక్కతో తయారుచేసేవారట. రెండు వైపులా మేక చర్మాన్ని అమర్చి తాళ్ళతో బిగిస్తారు. ఇది గంభీరమైన ధ్వనినిస్తుంది. కురుమలూ, గొల్లలూ వివాహ సమయాలలో వీటిని మంగళ వాయిద్యాలుగా భావిస్తారు.

అంతేకాక అమ్మవారి గుడి సంబరాలలోనూ, జాతర్ల లోనూ, పూజా సమయాల్లో శివాలయాల్లోనూ ఏడెనిమిది డోళ్ళను వాయిస్తారు. ఈ వాయిద్యాన్ని వీరప్ప డొల్ల అని కూడ పిలుస్తారు. ఈ డొల్లలు రాయల సీమ లోని, కర్నూలు, అనంతపురం జిల్లాలో కూడ కనిపిస్తాయి. తెలంగాణాలో మాత్రం ఒగ్గు డోలనే పిసుస్తూ వుంటారు.

కథా ప్రారంభంలో ప్రారంభ సూచనగా ఈ వాయిద్యాన్ని వాయిస్తారు. ఈ ధ్వనితో ఊరిలోని వారందరూ కథకు హాజరౌతారు. డోలు వాయిద్యానికి జిల్లేడు, లేదా సీతా ఫలం కర్ర ముక్కలను వాయిస్తారు. ఈ డోలును ఒక్క కథ చెప్పడం తోనే కాక మల్లన్న పండగ సమాయాల్లోనూ, ఊరేగింపు సమయాల్లోనూ జలధికి పోవడం, మైలపోలూ, తెల్లపాలు తీసినపుడు నాగవల్లి, వీరబోనం సమయాల్లోనూ డోలు వాయిద్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ సన్ని వేశాల్లో ఎన్నో డోళ్ళ తోళ్ళ నుపయోగిస్తారు. ఉధృత వాయిద్యపు వరుసలతో పాటూ రకరకాల అడుగులు వేస్తూ గుండ్రంగా తిరుగుతూ నృత్యం చేస్తూ వాయించడమే కాక డోలుకు కటిన తాళ్ళను పళ్ళతో కరిచి పట్టి నృత్యం చేస్తూ వాయిస్తారు. కూర్చుని డోలును వీపునకు ఆనించి చేతులను వెనకకు త్రిప్పి, డోలును వాయిస్తూ విన్యాసాలు చేస్తారు. ఈ డోళ్ళు "ధిళ్ళెం, భళ్ళెం... ధిళ్ళెం... భళ్ళెం" అని ధ్వని నిస్తాయి. ఈ విన్యాసాలకు తోడు కళాకారుల నైపుణ్యానికి తగినట్లు మరి కొన్నీంటిని జోడించి డోలు నృత్యంగా తయారు చేశారు. ఇలాంటి ఒగ్గు డోలు నృత్య బృందాలు, బండి పెద్దాపురం, జట్టు, మల్లెల బీరప్ప జట్టు, సుక్కా సత్తెయ్య జట్టు మొదలైనవి ప్రఖ్యాతి వహించాయి. ఇలా ఒగ్గు కథా బృందాలు దినదిన ప్రవర్ధమానం అవుతున్నాయి.

కథా ప్రారంభం.

ఒగ్గుకథ ఉజ్జయిని మహంకాళీ స్తుతితో ప్రారంభిస్తారు. అనంతరం గణపతి ప్రార్థన, శారద ప్రార్థన చేసి కథకుడు వ్రేలి అందెలు పట్టుకుంటాడు. వంతగాడు గొంగడి మీద వేసుకుని కర్ర చేత బట్టుకుని గొర్రెల కాపరిలా వుంటాడు. తాళం వేసే వ్వక్తి అవసర మైనప్పుడు కంజరి వాయిస్తూ వుంటాడు.

ఇటీవల కొంత మంది ఒగ్గు కథలుగా "హరిశ్చంద్ర, పార్వతి పరీక్ష, శివ తాండవ మహారాజు, నలపతి మహారాజు, దుర్గపతి మహారాజు, సారంగధర, రత్న మాణిక్యం, సూర్య చంద్రుల కథ, నాగరాజు కథ " మొదలైన జానపద, పౌరాణిక, కాల్పనిక కథలు కూడ చెపుతున్నారు.

నేటి ఒగ్గు కథకులు:

ఈనాడు తెలంగాణాలో ఒగ్గుకథ చెప్పే బృందాలు వరంగల్లు, నల్లగొండ, హైదరాబాదు జిల్లాలో వున్న ఏభై బృందాలలో నాలుగు దళాలు మాత్రమే బహుళ ప్రచారంలో వున్నాయి.

వాటిలో ప్రధాన కథకులు నేర రామస్వామి డెబ్బై సంవత్సరాలు, చీమల కొండూరు, భువనగిరి తాలూకా, నల్లగొండ జిల్లా. వరంగల్ జిల్లా జనగాం తాలూకా నెల్లుట్ల గ్రామ వాసి బండి ఈనయ్య, నల్లగొండ జిల్ల రామన్న పేట తాలూకా, ఆత్మ కూరు గ్రామవాసి, చర్ల కొండయ్య, వరంగల్లు జిల్లా జనగాం తాలూకా మాణిక్యాపురం గ్రామస్థుడు, చౌదరి పల్లి చుక్క సత్తయ్య.

వీరిలో చుక్క సత్తయ్య దళం ఇటీవల కాలంలో చాల ప్రఖ్యాతిలోకి వచ్చింది. సత్తెయ్య కళా నైపుణ్యం అంతటిది. కథను గానం చేయడంలోనూ, అందుకు అనుగుణంగా అభినయించడంలోనూ సత్తయ్య, తన బాణీని నిలుపుకున్నాడు. గంభీరమైన కంఠంతో గానం చేస్తూ కథా సందర్భానికి అనుగుణంగా ఆయా పాత్రలలో ప్రవేశించి, అభినయించి ప్రేక్షకుల మన్ననలను అందుకుంటున్నాడు. ఒక్క

తెలంగాణాలో నూరుకు పైగా బృందాలున్నాయని, ఈ బృందాలలో దాదాపు అయిదు వందల మంది బృంద సభ్యులున్నారనీ సత్తయ్య గారు తెలియచేస్తున్నారు.