తెలుగువారి జానపద కళారూపాలు/జానపదుల జ్యోతి నృత్యం

వికీసోర్స్ నుండి

జానపదుల జ్యోతి నృత్యం

రాయలసీమలో తొగట వంశస్థులు భక్తితో తయారు చేసిన జ్యోతిని వెలిగించి నెత్తిమీద పెట్టుకుని చౌడమ్మ దేవతను వర్ణించే పాటల కనుగుణంగా చేసే నృత్యం. ఈ నృత్యాన్ని, పల్లెల్లో 'జ్యోతుల బోనాలు ' అని అంటారు. ఈ నృత్యాన్ని ఏడాదికి ఒకసారి మాత్రమే కులవృత్తిపరంగా చేస్తుంటారు. నేసే కులస్థులంతా ఏకమై నృత్యం చేస్తూ తృణమో పణమో వసూలు చేస్తారు. (తొగట వంశస్థులే, నేసే కులస్థులు. ఈ నృత్యానికి కంచుతో చేసిన తాళాలు, చేతులు చప్పట్లు వుంటాయి. వీటి కనుగుణంగా పాట ననుసరించి తాళ గతిని మార్పు చేస్తూ వుంటారు. పాటలన్నీ శివునిపైనా, చౌడమ్మపైనా వుంటాయి.

జ్యోతిని ఇలా తయారు చేస్తారు:

ఊరు బయట స్థలంలో ఆవు పేడతో అలికి ఒకరు స్నానం చేసి, ఉపవాసం చేసి జ్యోతిని తయారు చేస్తారు. గోధుమ పిండిని ముద్దగా కలిపి మధ్యలో ఒక కొత్త గుడ్డను మైనపు వత్తిలా తయారుచేస్తారు. రతి పోసిన తరువాత జ్యోతిని దానిపై వుంచి పూజ చేస్తారు.

కాళ్ళకు గజ్జలు కట్టుకుని, ఎర్రటి గుడ్డను నడుముకు అడ్డగుడ్డలా కట్టుకుంటారు. మొడలో కొన్ని హారాలు వేస్తారు. నుదుట బండారుబొట్టు పెట్టుకుంటారు. అలా జ్యోతిని ఎత్తుకుని వుండగా ఆ జ్యోతి చుట్టూ గుండ్రాకారంగా జనమంతా నిలబడతారు. వీరిలో కొద్ది మంది తాళాలు పట్టుకొని వుంటారు. అందరూ గుండ్రాకారంగా తిరుగుతూ పాటలు పాడతారు.ఒకరు పాడుతూ వుండగా మిగిలిన వారంతా వంత పాడతారు. జ్యోతి నెత్తుకున్న వ్వక్తి పాట కనుగుణంగా అడుగులు వేస్తుంటాడు. జ్యోతులు రెండు మూడు కూడ వుంటాయి. నడి బజార్లో జ్యోతి నృత్యం జరుగుతూ వుండగా, ఆ జ్యోతికి బలిని ఇస్తూ వుంటారు.

గణపతి ప్రార్థన:
ఒకరు జ్యోతిని ఎత్తుకుని నట్టనడుమ నిలబడి పాట కనుగుణంగా, చుట్టూ గుండ్రాకారంగా నిలబడి వున్నవారంతా అడుగులు మారుస్తూ తిరుగుతూ వుండగా గణపతి ప్రార్థన ప్రారంభమౌతుంది.

పార్వతీ పుత్రుని పరమేశ్వరుని సూడ
ఎలుక వాహన మెక్కి వెళ్ళే తన వేడ్క
అమరంగ బెనకయ్యను ఆత్మలో తలచేరు
సంతోషమున కల్గు సకల జనులకును

అంటూ ఆందరి దేవుళ్ళనూ ప్రార్థించి, చౌడమ్మ కదిలే దృశ్యాన్ని కళ్లకు కట్టినట్లు పాట త్వర త్వరగా సాగుతుంది. అడుగులు త్వర త్వరగా వేయటం, గుండ్రంగా తిరగటం, జ్యోతి నెత్తుకున్న వ్వక్తి గిరగిరా తిరుగుతూ, కళ్ళు పెద్దవి చేసి చౌడమ్మలా కనిపిస్తాడు. తరువాత ఇలా పాడతాడు.

కదిలెను చౌడమయంత తోడను గాంభీర్య నాదములతో
రంతులునే మగరాడు చౌడమ రానువు కదిలెను రమ్యముతో
ఎప్పుడు మనకు ఇచ్చిన వరములు యే కొదువా లేదు
తప్పక కొలవండి దారుని లోపల దైవంబసలే చౌడమ్మ.

ఇలా చౌడమ్మ గూర్చి, ఆమె గొప్ప తనాన్ని గూర్చి వేనోళ్ళ పొగుడుతూ అనేక గేయాలు పాడతారు.

రక్తపు బొట్టు:

జ్యోతి నృత్యం చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ నడి బజార్లో వెళుతూవుండగా భక్తులు ఆమెకు జంతు బలుల్ని ఇస్తూ వుంటారు. ఆ చౌడమ్మ దేవతను రక్తపు బొట్టుతో అలంకరిస్తారు. ఒకరే ఒక్క వేటుతో పొట్టేలు తలను నరుకుతాడు. క్రిందబడిన రక్తం దాటుకుంటూ జ్యోతి వెళుతూవుంటుంది. చివరికి దేవతలనూ, చౌడమ్మను స్తుతిస్తూ మంగళం పాడతారు.

జ్యోతి నృత్యాన్ని చూస్తున్న శ్రోతలు రెండు చేతులెత్తి మ్రొక్కటం, భక్తితో ఇంటి దగ్గరకు వెళ్ళేటప్పుడు టెంకాయలు కొట్టి ఎవరికి వారు బలి ఇస్తారు. స్త్రీలు, పురుషులూ కూడ గుంపుతో కలిసి నృత్యం చేస్తారు. 'చౌడమ్మా' అంటూ బిగ్గరగా అరుస్తూ చేతులెత్తి మ్రొక్కుతారు. ఇలా నృత్యం చేసే గ్రామాలు__ ధర్మవస్రం, రేగాటి పల్లె, పెద్దకోట్ల, డా॥ బిగిచర్ల కృష్ణారెడ్డిగారి సౌజన్యంతో (జానపద నృత్యకళ నుండి)