తెలుగువారి జానపద కళారూపాలు/కాకతీయుల కళా విన్యాసం

వికీసోర్స్ నుండి

కాకతీయుల కళా విన్యాసం

ఆంధ్రుల చరిత్రలో అత్యంత ప్రసిద్ధి గాంచిన ఓరుగంటి కాకతీయ చక్రవర్తులు క్రీ.శ. 1050 మొదలు 1350 వరకు దాదాపు 300 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశారు. ఆంధ్ర దేశ చరిత్రలో కాకతీయులు వర్థిల్లిన కాలం మహోజ్యలమైంది. కాకతీయ చక్రవర్తులు అనేక మహమ్మదీయ దండ యాత్రలకు ఎదురు నిల్చి పోరాడి విశాల సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఆంధ్రజాతికి ఒక కర్తవ్యాన్నీ, విశిష్టతనూ చేకూర్చారు. వీరి పరిపాలనా కాలాన్ని మూడు దశలుగా విభజించవచ్చు.

1000 -1158 వరకూ కొంతకాలం తూర్పు చాళుక్య రాజులకూ, మరి కొంతకాలం పశ్చిమ చాళుక్య రాజులకూ సామంతులుగా వుండి చిన్న చిన్న రాజ్యాలను ఓడించి చివరకు చాళుక్య రాజ్యాన్ని కూడ ఓడించి స్వతంత్ర ప్రభువులుగా రూపొంది, 150 సంవత్సరాల కాలంలో నలుగురు రాజులు పరిపాలించారు. వీరిలో చివరి వాడైన రెండవ ప్రోలరాజు అతి ప్రసిద్ధుడు.

మహోన్నత వీరులు:

తరువాత దశలో 1159- 1261 వరకు తెలంగాణాను పునాదిగా చేసుకుని ఆంధ్ర దేశాన్నంతా జయించారు. ఈ దశలో మొత్తం ముగ్గురు రాజులు పరిపాలించారు. వీరిలో ప్రసిద్ధులైన కాకతీయ గణపతి దేవుడు దీర్గ కాలం (1193 - 1262) వరకు పరిపాలించి కాకతీయ రాజ్యాన్ని విస్తరింప జేశాడు.

ఆ తరువాత దశలో 1262 నుండి 1323 వరకూ పరాయి రాజుల దండ యాత్రలనుండి కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడిన వారు రుద్రమదేవి. ప్రతాపరుద్రుడు. రుద్రమదేవి అనేక మంది సామంత రాజుల తిరుగుబాట్ల నోడించి సమర్థవంతంగా రాజ్య పాలన చేసింది. రెండవ రాజైన ప్రతాపరుద్రుడు అల్లావుద్దీన్ దండ యాత్రల్ని అనేక సార్లు త్రిప్పి కొట్టి చివరకు ఓడి పోయి బందీగా చిక్కి భరింప లేని కారాగార జీవితంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

కాకతీయ చక్రవర్తుల లలితకళల్నీ, సారస్వతాన్నీ పోషించి వాటికి నూతన వికాసాన్ని కలిగించారు. వీరి కాలంలో నాట్య కళ బహుముఖాల విజృంభించి నట్లు అనేక శాసాల వల్లనూ, ఆనాటి శిల్పకళ వల్లనూ, సాహిత్యం వల్లనూ విదితమౌతోంది.

కళాకారులకు ఘన సత్కారాలు:

దేవాలయ కైకర్యం చేశే నర్తకీ మణులకు, మృదంగ విద్వాసులకు, గాయకులకూ, గృహదానాలు చేసినట్లు పిల్లమఱ్ఱి శాసనంలో ఉదహరించ బడింది.

పానుగల్లు శాసనంలో మైలాంబ గాయకులకు, నర్తకీమణులకు పై విధమైన గృహదానాలు చేసినట్లుంది. ధర్మ సాగర శాసనంలో 'జలజకరండ' మనే అపూర్వమైన వాద్య ప్రశంస వుంది. ఈ కరండ వాద్యకారులకూ పది మంది, నాట్య కత్తెలకూ కొన్ని నివర్తనాల బూమిని ఇచ్చినట్లు వ్రాయబడివుంది.

చేబ్రోలు శాసనంలో కాకతి గణపతి దేవుడు నృత్తరత్నావళి రచయిత జాయప సేనాని పదహారు మంది ఆటకత్తెలకు గృహ దానాలు చేసినట్లుంది.

మాన్యాలు, సమ్మానాలు:

గుంటూరుజి ల్లా, గుంటూరు తాలూకా, మంచారమనే (నేటి మందడం) మల్కాపురం శాసనంలో 1183 లో కాకతీయ మహారాణీ రుద్రమదేవి విశ్వేశ్వర శివాచార్యుడు స్థాపించిన గోళకీమత విద్యాస్థానానికి దేవాలయంలో పదిమంది నర్తకులకూ, ఎనిమిది మంది మార్దంగికులలూ, కాశ్మీరు గాయకునికీ, పద్నాలుగురు గాయనీ మణులకూ, కరడా వాద్యంలో ఆరితేరిన కళాకారులు ఆరుగురికీ, వృత్తి మాన్యాలిచ్చి నాట్య సంగీతాలకు పోషణ కల్పించినట్లుంది.

శాసనాలతో పాటు కాకతీయ చక్రవర్తులు కట్టించిన అనేక దేవాలయాలమీద నాట్య సాంప్రదాయలను ప్రతిబింబించే అనేక నాట్య శిల్పాలున్నాయి. అనేక దేవాలయాలు, శిల్పాలు తురుష్కుల దండ యాత్రల్లో చిన్నాభిన్నమైనాయి.

రామప్పగుడిలో రమణీయ నృత్యాలు:

శిల్పకళా విశిష్టతతో నిర్మితమైన రామప్ప గుడి వరంగల్ జిల్లా ములుగు తాలూకాలో వుంది. ఇది వరంగల్లుకు నలబై మైళ్ళ దూరంలో వుంది. ఈ గుడిని 1162 లో రుద్రసేనాని అనే రెడ్డి సామంతు కట్టించాడు. రామప్పగుడి ఆలయ నిర్మాణంలోని చిత్ర కౌశలం, శిల్ప నైపుణ్యం వర్ణిచనలవికానివి. ఈ కాకతీయ శిల్పచాతుర్యమంతా, ఇన్నేళ్ళు గడిచినా, ఈ నాటికీ చూపరులకు అమితానందాన్ని కలిగిస్తూంది. భరత నాట్య శాస్త్రమంతా మూర్తీ భవించి, స్తంభాలమీదా, కప్పులమీదా, కనబడుతుంది

రామప్ప గుడిలోని విగ్రహాలు, స్తంభాలపై ఉన్న శిల్పాలు ముఖ్యంగా దేవాలయ మంటపంపై కోణాల్లో నాలుగు పక్కలా పెద్ద నల్లరాతి నాట్య కత్తెల విగ్రహాలు అతి సుందరమైనవి. ఆ విగ్రహాల సొమ్ముల అలంకరణాలు, వాటి త్రిభంగీ నాట్య భంగిమలూ శిల్పకారుల్నే సమ్మోహితుల్ని చేస్తున్నాయి. దేవాలయం లోని స్తంభాలపై నాట్య భంగిమలు మృదంగాది వాద్యముల వారి రేఖలు చిత్రించబడి వున్నాయి. జాయన సేనాని రచించిన నృత్తరత్నావళిలో ఉదాహరించిన నాట్యశిల్పమంతా రామప్ప గుడిలో తొణికిసలాడుతూ వుంది.

ముద్దుగుమ్మల మద్దెల ధ్వనులు:

పాలంపేటలోని రామప్ప చెరువు కట్ట తూర్పు చివరనున్న దేవాలయంలోపలి భాగంలో స్త్రీలు మద్దెల వాయిస్తూ వుండగా, వివిధ భంగిమలలో నృత్యం చేస్తున్న అనేక మంది ఆటకత్తెల శిల్పాలున్నాయి. అదే దేవాలయం పడమటి వైపు ద్వార బంధాలమీద మార్ధంగికురాండ్ర శిల్పాలున్నాయి.

వరంగల్లు రుద్రమదేవి కోట ద్వారబంధంపై రాతి పలక మీద మార్ధంగికురాండ్ర శిల్పాలు చెక్కబడి వున్నాయి.

ఆ కోటలోనే స్వయంభూ దేవాలయంలో ఒక చిన్న శివ తాండవ నృత్య శిల్పముంది.

హనుమకొండ వెయ్యి స్తంభాల గర్భగుడి ద్వార బంధాలమీడ వివిధ నాట్యాల నృత్య భంగిమలలో స్త్రీల శిల్పాలున్నాయి.

కాకతీయ యుగంలో నాట్య బహుళ ప్రచారంలో వున్నట్లు ఆ నాటి సంస్కృత గ్రంథాలలో ఉదహరింపబడి వుంది. జాయపసేనాని రచించిన అపూర్వ నృత్యశాస్త్ర గ్రంథం ('నృత్తరత్నావళి'- సంస్కృత గ్రంథం) ఆనాటిదే.

జాయపసేనాని కత్తి వీరుడే కాక కళాప్రియుడైన సేనాని:

కాకతి గణపతి దేవ చక్రవర్తి కటాక్షానికి పాత్రుడైన జాయప తన స్వయంశక్తి వల్ల సేనాని కాగలిగాడు. ఈయన వీరుడే గాక, కళాకారుడు కూడాను.

నృత్యాలంటే జాయపకు అత్యంత అభిమానం. స్వయంగా నృత్తరత్నావళిని రచించాడు. ఈ నృత్తరత్నావళి భారతీయ నృత్య సంపదకు ఆభరణమని నృత్య విద్యావేత్తల అభిప్రాయం. సంస్కృత భాషలో ఆంధ్రుల రచించిన మొట్టమొదటి నృత్యశాస్త్ర గ్రంథం ఇదేనని మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు తెలియజేశారు. ఒక వ్యాసంలో.

దీనిని రచించిన జాయప సేనాని అసలు పేరు జాయన. ఈయన అయ్యకుల సంజాతుడు. పిల్ల చోడన పుత్రుడు. తాత-ముత్తాతలది వెలనాడులోని క్రొయ్యూరు. చందవోలు రాజధానిగా ఆంధ్ర దేశాన్ని పరిపాలించిన వెలనాటి మహీపతుల వద్ద ఈతని తండ్రీ, తాతా సేవలు చేశారు.

జాయన ఆయచమూపతి, జాయనేనాధినాథుడు, గజసాహిణి జాయన, గజ సైన్యాధినాథుడు అనే పేర్లతో పిలువబడుతూ వుండేవాడు. గణపతిదేవ చక్రవర్తి జాయపయందు అత్యంత అభినామంతో అతనికి సకల విద్యలనూ, కళలను నేర్పించాడు. ఆ తరువాతనే జాయప అత్యుత్తమమైన నృత్తరత్నావళి రచనను పూనుకుని క్రీ॥శ॥ 1253 -54 ప్రాంతంలో పూర్తి చేశాడు.

నృత్తరత్నావళి జానపదకళారూపాల వర్ణన:

నృత్తరత్నావళిలో మార్గ, దేశి నృత్యాలు రెండూ కలిపి కట్టుగా నడిచాయి. ఇందులో ఎనిమిది ఆద్యాయాలున్నాయి. మొదటి ఆధ్యాయం నర్తన వివేకం, రెండవ అధ్యాయం అంగనిరూపణ, మూడవ అధ్యాయం మండల లక్షణం, నాలుగవ అధ్యాయం, కరణాంగహార వివేచనానికి సంబంధించినది. ఐదవ ఆధ్యాయం దేశి, స్థానక, కరణ, భ్రమరీ లక్షణాలను తెలుపుతూ వుంది. ఆరవ అధ్యాయం దేశ పాట, చారీలాస్యాంగ గతి లక్షణమనే పేరు గలది. 6-7-8 అధ్యాయాలు ఆ నాటీ ఆంధ్రదేశంలో వాడుకలో వున్న దేశి, నృత్త పద్ధతులన్నీ వివరించేవిగా వుండి గ్రంథ ప్రాముఖ్యాన్ని ఎంతగానో చాటుతున్నాయి.

జాయప నృత్తరత్నావళిలో తన కాలంలో ప్రచారంలో వున్న దేశీ నృత్యాలన్నింటినీ అమూలంగా చిత్రించాడు. ఎనిమిది ఆధ్యాయాలు గల ఈ గ్రంథంలో కడపటి మూడు అధ్యాయాలూ దేశి నృత్య సాంప్రదాయాలైన పేరణి, ప్రేంఖణం, రాసకం, చర్చరి, నాట్య రాసకం, దండ రాసకం, శివప్రియం, చిందు, కందుకం, భాండికం, ఘంటసరి, చరణము, బహురూపం, కోలాటం, మొదలైన ప్రాంతీయము లైన అనేక జానపద నృత్యాలను వివరించాడు.

జాయప నృత్తరత్నావళిని పరికించి చూస్తే భరతముని ప్రసాదించిన భరత నాట్యశాస్త్ర గ్రంథంతోనూ, భరత నాట్యంపై ఆభినవ గుప్తాచార్యుల వ్యాఖ్యానం తోనూ జాయపకు పరిపూర్ణ పరిచయం వున్నట్లు తోస్తూవుందని క్రీ॥శే॥ మల్లంపల్లి వారు అదే వ్యాసంలో వ్రాశారు.

జాయప నృత్యరత్నావళిలో నృత్యానికి అనుగుణమైన సంగీత రత్నావళిని గూడ అనుబంధంగా రచించాడట. కాని దురదృష్ట వశాత్తూ అది లభ్యం కాకుండా పోయింది.

జాయప 1213 వ సంవత్సరం నాటికే సాల నాట్య వైదికమణి అనీ, కవి సభాశిఖామణి అనీ పేరొందాడు. జాయప నృత్తరత్నావళిని 1253 - 54 నాటికి రచించండం వలన దాదాపు 60 సంవత్సరాల వయసులో వ్రాసి వుండ వచ్చు. ఏమైనా ఈనాడు ఆంథ్రుల గర్వించగగిన పురాతన నృత్యశాస్త్ర గ్రంథాలలో నృత్తరత్నావళి మణి భూషణం.