తిరుమల తిరుపతి యాత్ర/మొదటికూర్పు సమపీఠిక

వికీసోర్స్ నుండి

మొదటికూర్పునకు పీఠిక.


శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవస్థానములో శ్రీవిచారణా కర్తలవారిక్రింద పారుపత్యదార్ అను నుద్యోగమును వహించు చుండు నేను యాత్రికుల సౌకర్యార్థ మొక గ్రంథ మత్యావశ్యకమని స్వానుభవముచే నిశ్చయించి దీనిని రచియించినాఁడను. ఇందులో కొన్ని సంగతులు అవ్యవస్థచే వదలియుండును. అవి రెండవకూర్పులోఁ జేర్చబడును.

ఈ చిట్టి పొత్తములో శ్రీవేంకటేశ్వరస్వామివారి మహాత్మ్యమును గుఱించి నేనేమియు వర్ణింపలేదు. గాని "కలౌ వేంకటనాయకః" అను వాక్యము సార్ధకమని తెల్పుటకు దృష్టాంతరములు పెక్కులుగలవు. అందులో నొకటిఁ బేర్కొనెదను. ఒక్కదివసమున అనగా శుక్రవారమునఁ గొచ్చిసంస్థానములోనివారు తమ కుటుంబసహితము మధ్యాహ్నము 11 ఘంటలకు తిరుమలకు వచ్చిరి. అందులో గృహిణికి కాళ్లు 6 నెలల కిందట పడిపోయి చాఁచుటకు నడచుటకు వీలులేక దేఁకుచుండెను. వారలకు స్వప్నావస్థలో "ముడుపులతో నామెను నాకొండకు తీసుకొని వచ్చి స్వల్పకాల మచ్చటనుండినఁ గాళ్లు నిచ్చెదను" అని శ్రీవారి యుత్తరవుకాఁగా వారువినక కాళ్లు బాగుపడి నంతట వచ్చెదమని ప్రార్థించిరి. ఆఱునెలలదాఁకఁ బ్రతీక్షించి కాళ్లు రాకపోవుటవలన శ్రీవారి యాజ్ఞప్రకారము వచ్చిరి. ఇచ్చట నొక్కవార ముండమని స్వప్నమయినది. ఆప్రకారమె వారు ప్రదక్షణ మొనర్చుచు గుంపులేక చక్కగా దర్శనము చేయించగలందులకు నన్ను కోరఁగా నేనందుకు సౌకర్య మొనర్చినాఁడను. ఆమె మఱుశుక్రవారమున గోవిందనామస్మరణఁ జేయుచు ఆవేశముతో నంగప్రదక్షణముఁ జేయుచుండెను. దైవ మాయఁజెప్పుట కలవికాదు. ఆమె ప్రదక్షణములోఁ గాళ్లును చాఁచెను. అంగప్రదక్షణసమాప్తియందు ముడుపుబట్టుకొని యావేశముతో నడిచివచ్చి బంగారు వాకిలిముందు నిలుచుకొనియున్న నన్ను "హుండిఎల్లి" అని కన్నడభాషలో నడుగ నేనుఁ జూపితి. అందులో ముడుపుఁ జెల్లించి యాఱుగురితోఁ గూడిన యాకుటుంబమా అభిషేకదర్శనపు టిక్కెట్లుకొని లోపలికివెళ్లిరి. అనంతర మావేశము నిలిచెను. సంతోషముతో వారింటికిఁ జనిరి. దీనినిఁ బ్రత్యక్షముగాఁ జూచినవా రనేకులు గలరు. ఇట్టి మహానుభావుని దర్శనమునకు విచ్చేయువారి సౌకర్యార్థము నేను దీనిని వ్రాసినాఁడను. శబ్దదోషము లెంచక అర్థగుణములను గ్రహింపఁ బ్రార్థించెదను.

ఇట్లు సుజనవిధేయుఁడు

ఎన్. వి. లక్ష్మీనరసింహారావు.

తిరుమల.

21-4-19