తాలాంకనందినీపరిణయము (49-64పుటలు)

వికీసోర్స్ నుండి

చ.

పులినశ్రీకటి మీనలోచన లసత్ఫుల్లాంబుజాతాస్య యు
జ్జ్వలచక్రస్తని జీవనభ్రమణభాస్వన్నాభి చక్రాంగమం
జులయాన త్రివళీతరంగ మధులిట్ శుంభత్కచాబంధ కో
మలబింబాధర కృష్ణవేణి హరిరామాయీ నదీయైనదో!

203


వ.

అని వినుతింపుచు.

204


క.

అటు తటుకున వెడలి మహో
త్కట శుభద మహోబలంబు గని గడఁచి రుచి
స్ఫుట పటల దిక్తటము వేం
కట మహిభృత్కటకమణినికటమున విడిసెన్.

205


ఉ.

శ్రీ తిరువేంగఁడప్పని భజించి పదంపడి కాంచికాపురీ
నీతనతాదరు న్వరదునిం గని మ్రొక్కి కవేరకన్యకా
శీతల వీచికా తుషిత చిత్త సనాథుని రంగనాథు న
త్యాతుర భక్త పూజ లిడి యవ్వల సేతువు గాంచి వేడుకన్.

206


తే.

శ్రీ ధనుష్కోటి స్నానంబుఁ జేసి వెడలి
పదియు మూఁడవ నెలకు నప్పాండుసుతుఁడు
మహిని మలయధ్వజుం డేలు మణిపురమ్ము
చెంత నొక్కెడ నుపవనసీమలోన.

207


ఉ.

రంగదనంగమంగళతురంగి మెఱుంగుల మేలితావి సం
పంగి విలోలలోచన విధంగిత బాలకురంగి మోహనా
పాంగి కళానుషంగి రుచిరాబ్ధితరంగి మనోహరాంగి చి
త్రాంగద పేర నొప్పు మలయధ్వజు కూతురుఁ గాంచె దవ్వులన్.

208


సీ.

కనుఁగొన దళుకు తళుక్కని దృష్టి లోఁదోఁచ
     ఘనతటిల్లతిక యంచును దలంచు

ఘనతటిల్లతకు నిల్కడ గల్గునే! నిండు
     వెన్నెలతేఁట యంచు న్నుతించు
వెన్నలతేఁట కీ వన్నెలా? వలరాజు
     చిల్కపటానితేజి యని గాంచు
చిల్కపటాని కెమ్మెల నడ ల్గలవే? రా
     యంచ గాఁబోలు నం చతిశయించు


గీ.

నైన రాయంచ కలరు నీమేని సొబఁగు
మేని సొబఁగును బూనిన బ్రాణమైన
గుందనఁపుఁ బొమ్మ గాఁబోలు నిందువదన
యనుచు వినుతించె తమినాటి యా కిరీటి.

209


తే.

పడతి నడఁకకు మును గజపతియు నోడె
హరిపతియు సూక్ష్మ మధ్యమం బందు నోడె
సుదఁతి మెఱుఁగైన వాడి వాల్చూపు తూఁపు
లరసి నరపతిలోఁబడు టబ్బురంబె.

210


క.

విజయుం డాసతి మలయ
ధ్వజు కూఁతురుఁగా నెఱింగి తమిచే నబ్భూ
భుజు పాలికావిశారదు
నిజసుమనోరథముఁ దెలుపు నెట్టన బనిచెన్.

211


చ.

పనిచిన నాతఁ డర్థిజని పాండ్యపతిం గని బల్కె పాండుభూ
జనపతిసూనుఁ డర్జునుఁడు చక్కని నీతనయన్ వనంబులోఁ
గనుఁగొని యుద్వహక్రమణకౌతుకహేతుమనీషుఁ డౌచు మీ
మనమరయంగ బంపె ననుమానముమాని యొనర్పఁగాఁ దగున్.

212


క.

అని విని యెనలేని ముదం
బును బెనఁగొన బల్కెఁ బాండుపుత్రునకును నా
తనయను సతిఁగా నొసఁగం
బనిపడె నిది యింతకన్న భాగ్యము గలదే!

213

క.

ఈకన్యకామణికి యిపు
డా కవ్వడిచే జనించునట్టి కుమారు
న్నా కలిమికి రాజ్యమున క
నాకులగతి నాథుఁ జేతు నని సమ్మతుఁడై.

214


చ.

అని యిటు లుత్సహించి శుభమైన ముహూర్తము నిశ్చయించి, మే
ల్దనరుపనుల్ రచించి, విబుధప్రతతిం బిలిపించి, పెండ్లికూఁ
తునకు నలంకరించి, పటుతూర్యనినాదము మించి దిక్కులం
బెనఁగొన మేళవించి పురవీధుల చిత్రము లేర్పరించియున్.

215


చ.

వరుస నవద్యహృద్యశుభవాద్యము లెల్లెడ నిండి మ్రోయ క
ప్పురఁపుమెఱుంగుటారతులు పుణ్యవధూజను లీయ, వృద్ధభూ
సురవరు లాగమప్రథితసూక్తుల దీవన లీయ, పాండ్యభూ
వరసుతకు, గిరీటికి వివాహ మొనర్చి రతిప్రమోదులై.

216


తే.

మధురవృత్తులు రీతులు పృథుగుణములు
గలుగు కూతురునకు నలంకారము లిడి
పాండుసుతునకు మలయధ్వజుం డొసంగె
కవి రసజ్ఞుకు కృతినిచ్చు కావ్య మనఁగ.

217


మ.

ఇటులం బెండ్లి యొనర్పఁ బిమ్మట నరుం డిచ్ఛారతిం గొన్నినా
ళ్ళట చింత్రాంగదకేళికారతిసుఖయత్తాత్ముఁడై యుండున
ప్పట నయ్యంగన కందిపుచ్చుకొనుఠేవం గర్భచిహ్నంబు లం
తట జూపట్టె నహస్కరాభ్యుదయప్రోద్యత్పూర్వశైలక్రియన్.

218


క.

తొమ్మిదినెల లీగతి నతి
నెమ్మదిగా గడచినంతనే శుభమౌ ల
గ్నమ్మిదియని వినుతింపఁగ
నమ్మదిరాక్షికిని తనయుఁ డపు డుదయించెన్.

219


క.

తనమనుమని గనుఁగొని నం
తన యనుకంప పాండ్యధరణీపతియుం

దనదుహితాపత్యంబున
దనదు హితం బమరెనని ముదంబున జెలఁగన్.

220


చ.

అతనికి బభ్రువాహనుఁడు నా నొక నామ మొసంగి యర్జునుం
డతులితతద్ధరాతలమహాధిపతిత్వము వానికే దహో
త్రతవిధిగాఁ దదన్వయము రంజిలఁగా నిడి వారిచే సుహృ
స్టత సెలవందుచు న్వెడలె చయ్యన దక్షిణతీర్థయాత్రకై.

221


మ.

చనుచో పంచముఖప్రవాహ మగుచున్ సౌభద్రతీర్థంబు
జను దత్పంచకపుణ్యతీర్థములలో స్నానంబు గావింపఁ బో
యిన నందచ్చర లేవు రాది నొకమౌనీశోగ్రశాపాహతిం
ఘననక్రాకృతి బూని తైర్థికుల మ్రింగం జొచ్చుట ల్గాంచియున్.

222


క.

తనచే శాపవిమోచన
మును జేకురు టెఱఁగి తీర్థముల గ్రుంకిడి యం
తను వామకరముచే తొలి
తనువామకరములు దాల్ప దరిబడవైవన్.

223


చ.

చనుఁగవపొంకముం జిగురుచాయలవాతెఱలు న్నెరాతళు
క్కనుజిగిమేనులున్ సటువులైన పిఱుందులు ముద్దుమోములుం
గనుఁగవమేల్బెడంగులు చొకాటపుచక్కనిసోగముక్కు లిం
పునజెలువొందువేల్పుఁ బువుబోఁడుల రూపముదాల్చి నిల్చినన్.

224


క.

అంతట నక్కాంతలవృ
త్తాంతము నాద్యంతమరసి యతిమృదుభాషా
సంతతులన్ వీడ్కొలిపి య
నంతర మటవెడలి పశ్చిమాశాస్థలికిన్.

225


ఉ.

వచ్చి ప్రభాసతీర్థవనవాటికడన్విడి ప్రాణమిత్రుఁ డా
యచ్చుతుఁ బిల్వఁ బంప నతఁ డర్జును చిత్త మెఱింగి యిట్లనున్

వచ్చినభావ మేర్పడె సుభద్రను రాముఁడు రాజరాజుకే
నిచ్చెద నన్నవాఁడు సతి నేగతినైనను నీకె గూర్చెదన్.

226


క.

అన విని వనజనయను మన
మున తనునెనరెనయ నునిచి మునుపనుకొనురీ
తిని వనిత నెనయు చనువును
వెనుకొను కపటత్రిదండి వేషము దాల్చెన్.

227


సీ.

భుగభుగవాసించు మృగనాభిఁ దుడిచి స
     ద్విమలమృత్స్నోర్ధ్వపుండ్రమును దీర్చి
పుటపాకగాంగేయపటము సడల్చి కా
     షాయవస్త్రము గటిస్థలి ధరించి
జ్యావల్లికాటంక్రియావిధాయకమైన
     దక్షిణపాణి త్రిదండ మూని
గాండీవగుణకిణాంకంబైన డాకేల
     సలిలపూరితకమండలువు దాల్చి


తే.

వీరరసమెల్ల నిర్జించి విమలశాంత
రసము నేకీభవించి తారసిలునట్లు
ఘనజగన్మోహనాకారుఁ డనఁగ నెగడు
విజయుఁ డవ్వేళఁ దాపసవేషి యయ్యె.

228


క.

చెలులవిడి సన్న్యసించుట
లిలలో సహజం బటందు రీ చెలికై యా
శలఁ జెంది సన్న్యసించఁగ
నలవడి యర్జునుఁడు రైవతాద్రికిఁ జేరెన్.

229


క.

ఈవిధి రైవతకాద్రివ
నీవాటిం జేర్చి మౌననియమముచే ధా
త్రీవరతాపసవేషసు
ధీవరమతి నుండు మనుచుఁ దెలిపి హరి జనెన్.

230

క.

గోపాలాగ్రణి యంతటి
లోపలనే బోయి పురములోపల జనులన్
రేపే రైవతకోత్సవ
మాపాదింపంగవలయునని చాటింపన్.

231


శా.

నందుం డాదిగ యాదవుల్ మిగుల నానాజాతిజాతంబు గో
విందప్రీతికరాంగనాజనము వేవేల్ రాజకన్యాజనం
బుం దేవేరులు రుక్మిణీప్రభృతులున్ భూషామణిస్పీతులై
యందందం జనుదెంచి రప్పురములో నాబాలగోపాలమున్.

232


శా.

ప్రీతిన్ రైవతకోత్సవంబునకు శౌరిన్ గూడి రాముండు దా
నేతేరం గపటత్రిదండికడ కెంతేనేర్పునం జేరి కం
జాతాక్షుండు వినమ్రుఁడై బలికె నోస్వామీ! కృప న్మీరలీ
చాతుర్మాస్యము మద్గృహంబుననె భిక్షం జేయ వేంచేయరే.

233


వ.

అని యక్కడలి బొడమిన జడుతపడతివడయుం డవ్వెడఁగు జడదారి యొడంబడునటుల మడతనుడువుల నుడివిన.

234


క.

అనుజుం డనుమాటకు బలుఁ
డనుమతిఁ గైకొనఁగ నుత్సవాంతంబున నే
తనుతనవారలతో న
మ్మునిఁ దోకొని బోయి భవనమున వనవాటిన్.

235


క.

నిలిపి, సుభద్రామణి న
య్యలఘునకు సపర్య సేయునటు నియమించెన్
బలదేవుఁడు మునులకు క
న్యలెకా శుశ్రూష జేయనగు వారనుచున్.

236


క.

అన్నల యనుమతి నీగతిఁ
గన్నియ శుశ్రూషజేయఁగా దొరకొనియెన్

మున్ను ధనంజయు నెనయ మ
ది న్నెగడు మనోరథంబు దీరు నటంచున్.

237


సీ.

౧ అరుణపల్లవము లాదరణత నిడు తన
     యధరంబు సాటివి యన్న యట్లుఁ
౨ బుష్పముల్ దెచ్చి నేర్పుననిచ్చు తనసౌర
     భాంగము కివి సాటి యన్నయట్లు
౩ రసఫలంబులుఁ దెచ్చి యొసఁగును తనమధు
     రాలాపముల సాటి యన్నయట్లు
౪ నాహిమాంబువు పూజకని యొసంగును తన
     హాసంబునకు సాటి యన్నయట్లు


తే.

విమలపత్రపుటంబుల విధుశిలాది
పాత్రలను నించి, వినయసంభ్రమత మించి,
భక్తి సేవించి విజయుండు పతియుఁ గాఁగ
గోరియానారి రాజడదారిఁ జేరి.

238


సీ.

చారునఖద్యుతుల్ చరణారుణచ్ఛటల్
     గలసి కుంకుమగంధ మిల కొసంగ
మంజీరశింజినీరంజితధ్వని శుకా
     రావంబుతోడ బేరజము లాడ
వాల్గన్నుల మెఱుంగు వాఁడిచూపులు దిశా
     తతుల పువ్వుల వసంతంబు లాడ
పాణిపల్లవరుచుల్ పటుకంకణధ్వనుల్
     కలకంఠములను విందులకుఁ బిల్వ


తే.

ఘంటికాకాంచి లేఁగౌనునంటి మ్రోయ
బలుని యనుమతితోడ సపర్యఁ జేయ
మనసు భద్రముగా వేగమున సుభద్ర
భక్తితోఁ జేరె మాయాతపస్వికడకు.

239


క.

ఇటు లాకుటిలాలకనృప
జటి కభ్యర్చనలు సలుప సలుపఁగ మునిహృ

త్పుటము దిటమెల్లవిడి యం
తట నే నర్జునుఁడ ననుచుఁ దగఁ బలుకుటయున్.

240


మ.

మునుపే వాసవి రూపచిహ్నముల నాప్తుల్ జెప్పఁగా విన్నరీ
తిని యమ్మౌనికి గాననయ్యెనని సందేహింపఁగా తథ్యమ
య్యె నటంచు న్నునుసిగ్గుదొంతరలు నయ్యేణాక్షికిం దోడుగా
జని యభ్యంతరసీమఁ జేరె తను సంజాతాహతస్వాంతయై.

241


తే.

అన్న యెడ రుక్మిణి సత్య లన్ని చిన్నె
లెన్ని వెన్నునిచే మున్ను విన్నకతన
కన్నె కన్నుల విలుకాని బన్నములను
సన్నగిలనీక శిశిరముల్ గొన్ని బన్ని.

242


చ.

నరునకు భోజనోపకరణప్రముఖార్చన లాదరించి త
త్పరిణయకార్యసంఘటన బంకజనాభుఁ డొనర్ప మేచకాం
బరుఁ డిది విన్నచో సమయభంగ మొనర్చు నటంచు హస్తినా
పురమునకుం బ్రయాణమయి పోయె నిజాగ్రజుతోడ గూడుకన్.

243


సీ.

తన మంత్రివరులతోడను సుభద్రార్జునో
     ద్వహరహస్యములు యుక్తముగఁ దెలిపి
కేవలహితసాత్యకీయుద్ధవాదులఁ
     దగుకార్యముల జాగ్రతల నమర్చి
నేర్పు మీఱఁగ రుక్మిణీ సత్యభామల
     హిత శుభక్రమణసంగతి విధించి
కవ్వడితో లగ్నకాలంబు కిదె వచ్చె
     ద నటంచు నభయప్రదాన మొసఁగి


తే.

జనని యెడ నుంచి సుముహూర్తసరణి నెంచి
లలి సుభద్రార్జునులకు నలంకరించి
హితపురోహితు లతికుతుకత ధరించ
విధివిధాగతిఁ బెండ్లి గావించి మించి.

244

సీ.

కుచకోకముల మైత్రి గొనఁగ తానై వచ్చు
     పూషుం డనఁగ తాళిబొట్టు గట్టి
కల్యాణ లోకనాగత ఘనచ్యుత వృష
     త్పటలంబనా దలఁబ్రాలు వోసె
తనమన్మథవ్యథల్ తరళాక్షి చెవితోన
     జెప్పనేఁగినమాడ్కి చెట్టఁబట్టె
నీకాలిగోరున కేకాంతసరియన్న
     భావంబుగా సప్తపదము లానె


తే.

భీషణత మున్ను దన్ను దపింపఁజేయ
మేటికందర్పశరవహ్ని మింగునట్లు
దోప హోమాగ్ని నాత్మ నారోపణంబు
సలిపె సమయోచితము జూచి సవ్యసాచి.

245


తే.

అంతలోన సుభద్ర హృదంతరమున
గొంత సంతసమంది యొక్కింత చింత
నన్న రాఁడాయెనని యనుకున్న తఱిని
చెల్లెలి మనంబుఁ గని దారసిల్లె శౌరి.

246


ఉ.

అత్తఱి శేషహోమదివసాంతమునన్ ఫలశోభనోత్సవా
యత్త మొనర్ప మోదమున నర్జునుఁ డంగనతో దినత్రయిం
జిత్తజు కేళిలో మణితసీత్కృతహావవిలాసవిభ్రమో
పాత్తమనస్కుఁడై ప్రముదితాంబుధిలోఁ దగ నోలలాడుచున్.

247


సీ.

తనువుననంటు చందనకర్దమము నాఁటి
     భసితాంగరాగసంపదను దెలుపఁ
దళుకుకుంకుమజిల్క మొలతాటి మునుపటి
     కాషాయవస్త్రసంఘటన దెలుప
నుదుటిముత్తెఁపుసరు లెదనొత్తుటలు నాఁటి
     నళినాక్షమాలికోన్నతిని దెలుప

ఫాలంబు నంటి తత్పదనఖరేఖలా
     మృత్న్సోర్ధ్వపుండ్రసమృద్ధిఁ దెలుప


తే.

నంగజానందయోగాంతరంగుఁ డౌచు
ప్రేమనధరామృతాతిథ్యభిక్ష మెసఁగి
యోగియో గాక కామినీభోగియో య
నంగ వెడలెను దత్కేళికాంగణంబు.

248


శా.

ఈలీలన్ సుఖవార్ధినిం దనిసి లక్ష్మీశుండు వీడ్కొల్పఁగా
చాలాప్రేమను రుక్మిణీముఖసతుల్ స్రక్చందన స్వర్ణవ
స్త్రాలంకారము లిచ్చిపంపిన బురం బర్థిన్ బ్రవేశింపఁ బో
నాలో కొందఱు సీరపాణిహితు లుద్యత్కోవసన్నద్ధులై.

249


ఉ.

దొంగవలెన్ సుభద్ర నదె దోకొనిపోయె కిరీటి యంచు ను
త్తుంగబలాంగులై తనునెదుర్కొనువారి నెదిర్చి యాధను
శ్చంగుఁడు పుష్పసంభృతనిషంగుఁ డఱంగఁడె లోనగెల్చి య
బ్భంగి శుభాంగితోఁ జనియె భంగజయంగతపేటి వీటికిన్.

250


క.

నానావిధవాద్యంబుల
నూనగతిన్ మ్రోయఁ బురజను లెదుర్కొనఁగా
సూనాస్త్రకోటి రుచిరన
వీనాంగుఁడు తత్పురప్రవేశం బాయెన్.

251


క.

సతిపతు లీరీతి ననా
రతము హితము దోప సౌఖ్యరతి మెలఁగుతఱిన్
కతిపయదినములకును త
తృతి క తికుతుకతను నెలమసలె సలలితమై.

252


చ.

తనువు చెమర్పసాగె, కనుదమ్ముల మబ్బు ఘటిల్లె వేవిళు
ల్గనఁబడె చన్మొనల్ నలుపుఁ గాఁదగె చెక్కులు వెల్లనయ్యె భో
జనము లసహ్యమయ్యె గతిజాడ్యత గాంచెను. మంటిపెల్లలం
దున రుచిమించె జిట్టములుదోఁచె కటిం బెగడయ్యెఁ బోటికిన్.

253

క.

ఈ లీల గర్భచిహ్నము
లాలోలవిశాలనేత్రికలవడఁగ సము
త్తాలానువేలసుషమా
జాలారుణవిలసదుదయశైలము బోలెన్.

254


ఉ.

అంత లతాంతపేశలశుభాంగి సమస్తజనుల్ కుతూహల
స్వాంతులుగా నవగ్రహశుభాకలితాద్భుతలగ్నమందు శ్రీ
కాంతజయంతనైషధనృకాంతవసంతమంజులా
క్రాంతదురంతబాహుబలరంతు దిగంతరకీర్తివంతునిన్.

255


స్రగ్ధర.

కనియెం బుత్రుం బవిత్రుం గలుషచయలతాఖండనోద్దండదాత్రుం
ఘనగాత్రు న్సచ్చరిత్రుం గలితదరహసత్కమ్రకంజాతనేత్రున్
జనమిత్రున్ శత్రు న్సకలబుధజనాజ్ఞాతసంఘాతమిత్రున్
జననాథస్తాత్రపాత్రుం బటులరిపువనజ్వాలికావీతిహూత్రున్.

256


మ.

శరజాతప్రభవుండు నేర్పు దనరం జాంబూనదం బందు భా
స్కరబింబంబును సానబట్టి రజముం జల్లించి రాకాసుధా
కరసారంబును బిందుచుం బడునుగాఁ గైజేసి మర్దించి శం
బరవైరిం బడి యచ్చునొత్తి సృజియింపం బోలు నబ్బాలునిన్.

257


సీ.

కురువంశవల్లికాంకుర మీతఁడని కోర్కె
     దనరఁగా ధర్మనందనుఁడు జెలఁగ
నాపదుద్ధరణహస్తాలంబ మీ యప
     త్యం బని భీముఁ డుత్సాహ మంద
స్వర్గాపవర్గసంసర్గహేతువె పుత్ర
     సంతాన మని సవ్యసాచి యలర
బాలకుండీక్షణభాగధేయ మటంచు
     నకులుండు సహదేవునకు వచింప


తే.

నిటుల ననుకంప జనకుల కేర్తరింపఁ
బొల్ఫు దీపింపఁ గౌతుకంబున నిలింప

వరులు విరులను వర్షింప సిరుల బెంపఁ
దరమె వినుతింపఁ బడఁతి కాతఁడు జనింప.

258


క.

నెనరున గుంతీసతి దా
గనుఁగొని గనుగొనల వివిధగతులన్ మతులన్
జనువనుఁగుల్ బెనఁగొనఁగన్
మనుమని మను మనుచు దీవెనల నిడి వేడ్కన్.

259


క.

నరుడుం గన్నకుమారుని
పురుఁడుం గణుతింపఁగలఁడె భువనత్రయి న
మ్మరుఁడుం గలఁడేమో యని
బురుఁడుం గావించి రఖిలపుణ్యాంగనలున్.

260


ఉ.

ధన్యుఁడు కల్పకప్రతివదాన్యుఁడు విశ్రుతరాజలోకమూ
ర్ధన్యుఁ డనారతాశ్రితశరణ్యుఁడు రూపవిలక్షణైకసౌ
జన్యుఁడు దుష్కరారిజయసైన్యుఁ డితం డగుగాక యంచు స
న్మాన్యుఁడు ధర్మసూనుఁ డభిమాన్యుఁ డనన్ మహదాహ్వయం బిడెన్.

261


సీ.

సకలాగమాంతభాసకళాప్తిచే బృహ
     స్పతిరీతిని మహానుభావుఁ డగును
నిఖిలాస్త్రశస్త్రప్రముఖనీతి చతురత
     పరశురామసమప్రభావుఁ డౌను
సంతతాత్మజ్ఞానసంసర్గను సనత్కు
     మారునిగతి జగన్మాన్యుఁ డగును
కమనీయసుందరాకారగౌరవమున
     కందర్పకోటిసంకాశుఁ డగును


తే.

ననుచు దీవించి ధర్మజుం డతిశయించి
దానము లొనర్చి జాతకోత్సవ మొనర్చె
బ్రియము మొనదేల నిధిఁ గన్న బేదలీల
నుల్ల మిగురింప నభిమన్యుఁ డుద్భవింప.

262

సీ.

తలనంటి మేనజొబ్బిలఁగ జము ర్బూసి
     సకలాంగములు దిద్ది చక్కనొత్తి
జలకముల్ గోర్వెచ్చజలములచే నార్చి
     తడిబోవఁ గర్ణరంధ్రముల నూది
చలువసన్నపు పుట్టములమేన దడియొత్తి
     పట్టుపొత్తుల మెత్తపడక నునిచి
నునుపైన కాటుకఁ గనుదమ్ముల ఘటించి
     బొమలుదీరిచి యుక్క బొట్టుఁ బెట్టి


తే.

పొదిఁగిటను జేర్చి పాలిచ్చి బుజ్జగించి
కెంపురవచెక్కడంపు నిద్దంపు సొంపు
నింపునుయ్యాలలోన నిద్రింపు మనుచుఁ
బాటఁ బాడుచు నూచి రాపట్టినపుడు.

265


సీ.

కనుఱెప్పలిడక చక్కనజూచు తనకూర్మి
     తండ్రిని గను బురందరుని బోల్కి
పాలబుగ్గలపెంపు బరఁగును దనకుల
     స్వామిబుట్టిన దుగ్ధజలధిలీల
కరము లల్లనజాచి కదలించు తనవంశ
     కర్తయై తగుసుధాకరునిమాడ్కి
బుడమినిల్వడి తప్పడుఁగుల నిడు బలి
     మథనుఁడౌ తనమేనమామ పగిది


తే.

వైభవగభీరరుచిరకృపాభిరతులఁ
దేజరిలునంచు నికవేరె తెలుపనేల
ననుచు బుధులు నుతింప నయ్యతివబెంప
చిన్నిబాలుఁడు ముద్దులఁ జేయుచుండు.

266


సీ.

తొట్టెపై పికిలిబంతులు జూడఁగా సాగె
     మొగమెత్తి పొరలి బోరగిలసాగె

చెల్వమౌ జోపాట చెవియొగ్గి వినసాగె
     కిలకిల నగి ముద్దుజిలుక సాగె
కూర్చుండి చప్పటు ల్గొట్టి యూగఁగసాగె
     వేడుకల్ జూపి దొగ్గాడసాగె
చేతుల నప్పచుల్ జెయిమన్న జేసాగె
     వడి తప్పటడుఁగుల నిడఁగసాగె


తే.

నంతకంతకు దోఁబూఁచు లాడసాగె
నెత్తుకొని దించునపుడు పోర్వెట్టసాగె
బిలుచువారలతొడలపై నిలువసాగె
మాటికతఁ డిట్టు ముద్దులమూట గట్టి.

265


శా.

చుంచుం బుత్తడి ముత్తియాల్ మెలుచుకుచ్చు ల్పచ్చరా లుచ్చులున్
మించం జాలు కడేలుడా ల్గొడల గ్రొమ్మించుం గమిం చుంగరాల్
చంచత్కాంచననూత్నరత్నకృతమౌ జాబిల్లి ఫాలాగ్రమం
దంచత్ప్రీతి చలింప క్రీడఁగొను లోకానందసంధాయియై.

266


క.

దుడదుడ నడుఁగులు దడఁబడ
కడువేడుక నిడుచు తల్లి కడ నాడును నే
యెడ ధర్మ మిటుల భూస్థలి
నడుఁగుల నడిపింతునని యథార్థముదోపన్.

267


శా.

గున్నై మిన్నగు చిల్కతాళ్సరిఫిణీ ల్గొల్సుల్ సరా ల్కుండలాల్
సన్నాజి ల్గురుమా ల్తురాయి మొలనూల్ జూపట్ట నట్టిట్టుమే
ల్వన్నెల్ గుల్కఁగ నాటలాడుతరి నవ్వయ్యార మయ్యారె యే
మన్నాతీరునె కండ్ల పండువలు సేయం జూడఁగానే వలెన్.

268


క.

ఈ చందంబున బాలుం
డాచందనగంధి బెంప సభ్యుదయుండై
యాచందమామతో తుల
దూచం దగు మేని కళలతోఁ బెరుగుతఱిన్.

269

వ.

అంతం క్రమక్రమంబున నెలబాలునింబోలు నబ్బాలుండు దినదినబ్రవర్ధమానుం డగుచు నుండె మఱియును.

270


ఉ.

అంతట రాజసూయ మహదధ్వర మా సమవర్తిసూనుఁ డ
త్యంత ముదంబున న్సలుప నర్థిఁ దలంచి దిగంతరావనీ
కాంతుల నెల్లఁ గెల్వ మురఘస్మరుఁ డెందు సహాయ మంచు సు
స్వాంతమునం దలంచి యనుజన్ముల కీ తెఱుఁగెల్లఁ దెల్పియున్.

271


క.

నయమీ క్రతువు విపక్ష
క్షయము యశస్సర్వ దిగ్విజయ మఖిల సుహృ
త్ప్రియము వశీకృత లోక
త్రయ మిదియు నుపక్రమింపఁదగునని మఱియున్.

272


క.

గెలుతము శాత్రవనృపతుల
వెలుతము తద్రాజ్య కలిత వివిధ శ్రీలన్
నిలుతము సత్కీర్తి నిదే
ఫలితము లోకైక ధరణి పాలుర కెల్లన్.

273


వ.

అని వచించి విజృంభించి.

274


క.

తమ్ములకు రథభటాశ్వగ
జమ్ముల నిడి భూనభోదిశాగతరిపురా
ష్ట్రమ్ముల విజయమ్ములచేఁ
గొమ్మని రమ్మనుచు వీడు గొలిపి ముదమునన్.

275


సీ.

సంజయాదినృపాలకుంజరాన్వితు సహ
     దేవుని దక్షిణదిశకు బనిచెఁ
బ్రకటసేనాచతుష్ప్రకరంబుఁ గొలువఁగా
     నకులుని పశ్చిమాశకు విధించె
దుర్జనరిపుజయోపార్జితుండగు సవ్య
     సాచిని యుత్తరాశకు విధించె

భద్రకేకయమత్స్యపతులతో భుజబలో
     ద్దాముని భీముఁ బ్రాగ్భూమి కనిపె


గీ.

నంత చతురంగభూతలాక్రాంతమనుజ
కాంతసంతానదుర్మదధ్వాంతతాంత
కాంతికాంతనిశీధినీకాంతులన దు
రంతవిక్రము లగుచు నంతంత వెడలి.

276


క.

ప్రాచీదక్షిణప్రత్యగు
దీచీభూభాగదుర్మదీభూతధరి
త్రీచక్రేశులధైర్యసు
ధీచతురత గెలిచి వార లతిత్వరితగతిన్.

277


చ.

నలుదెసలం జయించి నరనాథులచే తగుయప్పనంబు లు
జ్జ్వలతరనూత్నరత్నగజవాజిశతాంగభటాంగనాంబరం
బులు శిబికంబులుం గనకభూషణము ల్గొనిదెచ్చి ధర్మజుం
డలర నొసంగి మ్రొక్కి వినయాన్వితులై వచియించి రున్నతిన్.

278


క.

మీపంపున గాదే రిపు
భూపాలుర గెల్చి జయముఁ బొందితిమి భవ
త్కోపానురూపమై దగు
చూపున కెవఁడైన వ్రేలు జూపం గలఁడే!

279


క.

అని వినయమునను తము దె
చ్చిన ఘనకనకమణిధనవిశేషములను స
య్యన నొసఁగిన నవియు సుయో
ధను నందుకొనంగ నాజ్ఞ తగ నియమించెన్.

280


క.

గంభీరనిధి యుధిష్ఠిరుఁ
డంభోరుహనాభు నియమ మటుగొని సవనా