చందమామ పిల్లల మాసపత్రిక/సంపుటము 6/జనవరి 1950/కొంగమెడ

వికీసోర్స్ నుండి

భగవానుడు మొట్టమొదట ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు, ఇప్పుడు మనం చూచే పక్షులూ, చెట్లూ ఈ మోస్తరుగా ఉండేవి కావు. ఆ స్వరూపాలే వేరు.

చెట్లూ చేమలూ సృష్టి ప్రారంభంలో పొడవుగా, మేఘ మండలాన్ని తాకుతూ ఉండేవి. అవి అంత పొడవుగా ఉండడం వల్ల మనుషులూ, జంతువులూ మసలడానికి ఇబ్బందిగా ఉండేది. మరి, మనుషులూ, జంతువులూ అటు యిటు మసలకపోతే తిండి దొరికేది ఎట్లా?

పోతే - చెట్లెక్కి కాయలూ, పండ్లూ కోసుకొందామంటే అవి మేఘ మండలాన్ని తాకుతూ పొడవుగా ఉండటం చేత, అసలే వీలులేకపోయేది. ఆకాశమంత ఎత్తున ఉండే పండ్లు ఎవరు అందుకోగలరు?

ఈ కష్ట సుఖాలన్నీ కనిపెడుతూ వున్న భగవానుడు యోచించి, బ్రహ్మదేవుడికి కబురు పంపించాడు. "బ్రహ్మా ! - ఈ చెట్లు

పొడవుగా ఉండటం చేత, వాటి ఫలాలను కోసుకొని అనుభవించడానికి మనుషులకూ జంతువులకూ వీలు కాకుండా వుంది. కనుక చెట్లలో పండిన ఫలాలను భూమి మీద పడవేయడానికి తగిన సాధనం ఏదైనా నీవు యోచించి వెంటనే సృష్టించవలసింది" అన్నాడు.

అప్పుడు బ్రహ్మదేవుడు భగవానుని ఆజ్ఞ ప్రకారం మొదట ఒక నెమలినీ తరువాత ఒక కొంగనూ సృష్టించాడు.

సృష్టి ప్రారంభంలోనే ఈ రెండు పక్షుల మధ్యని అసూయ బయల్దేరింది. కొంగ సరాసరి భగవానుని వద్దకు వెళ్లి "స్వామీ!- నెమలి ఎంతో చక్కగానూ, సుందరంగానూ ఉన్నదని లోకం అనేక విధాల మెచ్చుకొంటున్నది. లోకులు మెచ్చుకొంటున్న కొద్దీ నెమలి ఉత్సాహపడి, తన అందానికి తనే మురిసిపోతున్నది. నేను చూడబోతే చిన్నదానిలా, భూమికి బెత్తెడు


యస్.మల్లిఖార్జునరావు, భీమవరం

ఎత్తున పొట్టిగా కనబడుతున్నాను. అందు చేత అన్ను ఎవళ్లూ మెచ్చుకోలేదు సరికదా, నావేపైనా కన్నెత్తి చూడటంలేదు. బ్రహ్మకు నాపైన ద్వేషం, ఇటువంటి పక్షపాత బుద్ధి ఎందుకు కలిగిందో ఏమిటో కనుక్కోండి" అని ప్రార్థించేవరకు, భగవానుడు మళ్ళీ బ్రహ్మను పిలిపించాడు.

"ఏమయ్యా బ్రహ్మా! - నువు సృష్టించిన కొంగ ఇలా గోలపెడుతున్నదేమిటి? నెమలిలాగా దానిని కూడా ఎందుకు అందంగా చేశావు కావు?" అని అడిగాడు

అప్పుడు బ్రహ్మ "స్వామీ! - కొంగకు ఎలా ఇష్టమైతే అలాగే దాని రూపం సవరిస్తాను. ఎప్పుడైతే మాత్రం ఏమి మించిపోయింది?" అంటూ, కొంగను రెండు చెతులలోకి తీసుకొని, ఒక చేతుతో దాని మెడ, రెండవ చేతితో దాని కాళ్ళూ పట్తుకొని బాగా సాగదీయనారంభించాడు. బ్రహ్మ చేసే మరమ్మత్తుకు తట్టుకోలేక, కొంచెం సేపటికే

కొంగ "బాబోయ్! చాలు బాబోయ్!" అని గోల పెట్టింది.

అప్పటినించీ కొంగ కాళ్ళూ, మెడా పొడవై, లోకులందరకూ స్పష్టంగా కనబడేటట్టు తయారుచేయబడింది. తన పొడవాటి మెడ చూచుకొని, నెమిలి కంటే ఎత్తుగా ఉన్నాను గదా అని తృప్తిపడి, కొంగ మురిసిపోయింది. బ్రహ్మచేసిన ఈ మార్పుకి భగవానుడు సంతోషించి, నెమలిని పక్షులకు రాజుగానూ, నెమిలిరాజు కింద కొంగ మంత్రిగానూ ఉండాలని నియమించాడు.

ఆ తరువాత జంటజంటలుగా రకరకాల పక్షులను బ్రహ్మదేవుడు సృష్టించనారంభించాడు. అవన్నీ రెక్కలు టపటపా కొట్టుకుంటూ చెట్లపైకి ఎగిరి, వాటికి ఉండే పండ్లను భూమిమీద పడవేయటానికి ప్రారంభించాయి. అప్పటినించీ, ఏ ఎగిరే పక్షుల సాయం వల్ల మానవులకూ, జంతువులకూ తిండి సమస్య కొంతవరకు తీరింది.

పుట:Chandamama 1950 01.pdf/51