Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/ఆంధ్రగ్రంథములు విరివిగా వ్యాపించుటెట్లు?

వికీసోర్స్ నుండి

ఆంధ్ర గ్రంథములు విరివిగ వ్యాపించుటెట్లు.



పూర్వము సౌకర్యములు తక్కువగ నున్నపుడు మన ప్రాచీనకవులు తమ యనుభవముల నన్నిటిని తాళపత్రములవ్రాసి గ్రంథస్థము జేసియుండిరి. వాటి వాసన గ్రహించినవారు ఎంతయోశ్రమపడి వాటి ప్రతులను వ్రాసికొనుచుండెడివారు. ఇప్పటికిని కొన్ని యిండ్లయందు వ్రేలాడగట్టబడియుండు తాళపత్రగ్రంధములనేమి, కాగితములమీద అచ్చుగుద్దినలాగు వ్రాసిన ప్రతులనేమి, జూచుట తటస్థించినపుడు ఆ గ్రంధములు వ్రాయుటకు వారుపడిన శ్రమ, వారి శ్రద్ధాభక్తులు, మనకు ఆశ్చర్యమును గొలుపక మానవు.

ప్రస్తుతము ముద్రాయంత్రములు విరివిగ ప్రబలుటచే తాళపత్రములమీదను వ్రాసికొను దశ యంతరించి స్వల్పధరలకు సందరికి లభించులాగున అచ్చు ప్రతులు దొరుకుచున్నవి. పూర్వులు వ్రాసిన గ్రంధములను వారు అంతరించుటతోడ నే వారి సంతతివారు వాటివిలువ తెలియక కొందరు, యచ్చువేయ సమర్థతలేక కొందరు, వ్యర్థము గావించియుందురు. ఇప్పటికిని గ్రంధము అచ్చు వేయించినవారు గతించుటతోడనే వారిసంతతివారి తెలివి లేమిచే నయ్యవి యింట నే యొదిగి బైటకు రాకున్నవి. ఖరీదునకు చిక్కకున్నవి. కొందరు పూర్వగ్రంధములను సాధించి సంపాదించి, అచ్చు వేయించి ప్రజల కుపకారము చేయుచున్నారు. ఇప్పటివారిలో బుద్ధిమంతులు తమ శక్తికొలది గ్రంధములు వ్రాసి ప్రచురింపుచు భాషకు నూత నాలం కారముల నొనగూర్చుచున్నారు. ఏ వ్విధమునచూచినను గ్రంధములు విరివిగ బయలు దేరుచున్నవి. వాటి గ్రంధకర్తలకు తగినంత ఉత్సాహము కలుగులాగున యవి దేశమందంతటను వ్యాపించుట లేదు. ఇట్లు వ్యాపింపకుండుటకు కారణము లెవ్వియో నించుక విచారింతము. ఇతర దేశములలో పుస్తకము అచ్చు వేయించుటకగు ఖర్చులకన్న హెచ్చు మొత్తమును ఆ పుస్తకము అమ్ముడుపోవుటకై ప్రకటించు ప్రకటన పత్రికల నిమిత్తము వెచ్చింతురు. మనమో ర్పు 100 లు గాని ర్పు 200 లు గాని పుస్తకము అచ్చువేయించుటకై ఖ ర్చు పెట్టి, ర్పు 10 లు అయినను ప్రకటన పత్రికలనిమిత్త ము వెచ్చించుటకై శంకించుచున్నాము. అందుమూల మున అసలుగ్రంధము అచ్చుపడినదన్న సంగతియే వెల్లడి కాకపోవుటయు, దేశమంతట వ్యాపింపకపోవుటయు త టస్థించుచున్నది. మనలో ఆంధ్ర పుస్తకము లన్నిటిని ఒకచో జేర్చి అమ్ము పుస్తకశాల గాని, అన్ని పుస్తకము లు లభింపగల గొప్పగ్రంధ భాండాగారము గాని లేదు. సాధారణముగా కొన్ని దేశములయందు గ్రంధము మంచి దైనను కాకున్నను, గ్రంధకర్తలను నూతన గ్రంధముల వ్రాయ ప్రోత్సహించుటకై ఆ గ్రంధమును కొనెదరు. అది వారి నై జస్వభావముగా నున్నది. మన కట్టి స్వభా వేములేదు. మన మితర దేశముల వారితో ద్రవ్యవిషయమున సమానము గా నేరకున్నను, ఉన్న దానిలోనైన, చేయ తగినంతమట్టుకు గ్రంధకర్తలకు ప్రోత్సాహము చేయకున్నారము.

ఇక మనగ్రంధములు విరివిగ వ్యాపింపజేయుటకై సాధనము లాలోచింతము.

తామసు కార్లలియస్ వ్రాసినట్లు మనగ్రంధములలో రుచిచూడవలసినవి, నమలవలసినవి, నమలి మ్రింగవలసినవి గలవు. వీటియొక్క ప్రాశస్త్యా ప్రాశస్త్యములను లోకమునకు తమ యభిప్రాయములమూలమున వెల్లడింపగల పండిత సంఘము నొకదాని నేర్పరచుట ముఖ్యము, అయ్యది శాఖలుగానుండవలెను. అనగా పద్యకావ్యములను పరిశీలించు నుపసంఘము, చరిత్రలను పరిశీలించు నుపసంఘము, ఈమాదిరి నుపసంఘములు గలిగిన పెద్ద సంఘమొకటి అత్యవసరము. వీరివలన మన్నననందెన గ్రంధముయొక్క విరివి వ్యాపనకై మనము తోడ్పడవలెను.

చివర కెట్టి చిన్న గ్రంధమైనను ఎంత విలువగల గొప్పగ్రంధమైనను కార్డువ్రాసినతోడనే సప్లయి చేయగల పుస్తకశాల యొకటి ఆంధ్రదేశమధ్యమున స్థాపింపబడవ లెను. ఇదివరకు ప్రచురించినవి, ఇప్పుడు ప్రచురింపబోవునవి, అన్ని గ్రంధములును ఇందు దొరకవలెను. ఇయ్యది ధనాధికు లెవరైన స్థాపింపవచ్చును. లేదా వాటాల పద్దతినైన నొక సంఘము స్థాపింపవచ్చును.

ప్రతిమానవుడు ప్రతిగ్రంథమును కొనగల ద్రవ్యసంపత్తి గలిగి యుండకపోవచ్చును గాని ప్రతి గ్రామము కలసి అధమపక్ష మొకగ్రంధముకొని పఠింపకపోలేదు. అట్టితరుణమువ కొద్దియెత్తుననైన పుస్తక భాండాగారములను ప్రతిగ్రామమున స్థాపించుటకై ప్రయత్నములు సలుపవలెను.

ఈ పై నుదహరించిన పుస్తకశాలవారు ఈగ్రంథభాండాగారమువారు తమతావున దొరుకు పుస్తకముల పట్టీలను విరివిగ ప్రతిగ్రామము ప్రతియింటా జేరునట్లు పంచి వేయవలెను. అం దేనెల కానెల నూతన గ్రంథములని ప్రశస్తగ్రంధములని పై పట్టిక లో జూపుచుండవలెను. వాటిపై ప్రముఖులిచ్చిన అభిప్రాయములను ప్రచురింపు చుండవలెను.

గ్రంధకర్త లైనవారు తమ గ్రంథములను ప్రాముఖ్యుల కుచితముగ బంపి వాటిపై వారి యభిప్రాయములు వచ్చునటుల చేయవలెను. వీలయినతావులనగా ప్రతిపట్టణములోను, ముఖ్య రెయిల్వేస్టేషనులలోను, సామాన్య అంగడులలోను, దొరుకులాగున కమీషన్ పద్ధతిని ఏజంట్ల నేర్పరచి అమ్మించవలెను. అట్టి ఏజంట్లు సరీగా లెక్క చెప్పరను భయముకద్దు. కాని సౌమ్యులనే యేరు కొనవలెను. పుస్తకధరలు కొంచెము సరసముగా నుండవలెను.

ఇందు విషయమై మన జయమంతయు, తుదకు ఆదానికల క్రింద మనము ధారాళముగా వెచ్చించు ద్రవ్యమునుబట్టియు ఆదానికలు వ్రాయురీతిని బట్టియు నుండుసని జ్ఞాపకముచేయుచున్నాను. ఆదానికల క్రింద విరివిగా వెచ్చించినవారు ఎవరును చెడిపోయినవారు లేరు. ఇందులకై హిగి౯ బాతం మున్నగు కంపినీల వారిని చూడుడు. వారెట్లు విరివిగ ఆదానికల ప్రకటించి వెల్లడించెదరో! మనలోను ఇందులకు విక్టోరియాడిపో, విలియం అండు కో, మున్నగువారు నిదర్శనముగానున్నారు.. ఈ పద్దతులమీద ఆంధ్రగ్రంథముల వ్యాపనకై ప్రయత్నింపుడని ప్రార్థింపుచు విగమించుచున్నాను.

కొడాలి శివరామ కృష్ణారావు.

శ్రీ వీరేశలింగకవి పుస్తక భాండాగారము, రాజమహేంద్రవరము.

దేశాభ్యుదయమునకు భాషాభివృద్ధి ప్రధమ సోపానము. భాషాభివృద్ధికిఁ బుస్తక భాండాగారము లె ప్ర ధాన సాధనములు. ఏదేశమునఁ బుస్తక భాండాగారములు మిక్కుటముగ వెలయుచుండునో, యా దేశము సకలకళలకు నెలవై నాగరకతకుఁ దావలమై యఖిల సంపదలతోఁ దులతూఁగుచు నత్యున్నతపదవి నలంక రించియుండును. భాండాగారములవలనఁ గలుగు ప్రయోజన పరంపరల లెస్సగ గ్రహించియె జర్మని, ఇంగ్లండు, అమెరికా, జపాను మున్నగు 'విదేశములవారు తమతమ దేశములఁ బ్రతి పట్టణమునఁ, బ్రతిగ్రామమున, వేయేల ప్రతిగృహమున భాండాగారములఁ గుప్పలు తిప్పలుగ వెలయింపఁజేసి ప్రపంచమునందలి జాతీయులలో నెల్ల నాగరకాగ్రగణ్యులని వినుతికెక్కి యుండిరి.

ప్రకృతము మనహిందూ దేశమునఁ గూడ పుస్తక భాండాగారముల యావశ్యకత గ్రహింపఁబడి బరోడా మున్నగు ప్రదేశములయందు భాండాగారములు నెలకొల్పబడుచున్నవి. మన యాంధ్రదేశమునందు సయిత మచ్చటచ్చట కొన్ని భాండాగారము లిపుడిప్పుడు స్థాపింపబడుచున్నవి. సుమారు పదునై దువత్సరముల క్రిందట మన యాంధ్ర దేశమున నాంధ్ర భాండాగారము లంతగ వ్యాపించియుండని సమయమున మనమాతృభాషకుఁ గలిగిన యీ అంతను గొంతవఱకు నివారించి యోపినంత వరకు దేశ సం సేవన మొనరింపఁగోరి, యాంధ్రభాషావధూటికిఁ బుట్టినిల్లనఁ దగు రాజమహేంద్రవరమున 'వీరేశలింగ పుస్తక భాండాగారమను పేరిట నొక భాండాగారమును స్థాపించిరి.