గణపతిముని చరిత్ర సంగ్రహం/రథ చలనము

వికీసోర్స్ నుండి

6. రథ చలనము

ఆయన అరుణాచలమున వాసుదేవశాస్త్రి అను శిష్యుని యింట బసచేసి తనకు తపస్సునకు యోగ్యమైన స్థలమును చూపుమని తొందర చేసెను. అతడు మరకత శ్యామాంబికాలయమును (పచ్చైయమ్మన్ కోవెల) యోగ్యస్థలముగా చూపెను. వెంటనే వాసిష్ఠు డచ్చట దీక్షను గైకొని ఆ దేవినే ధ్యానింప నారంభించెను. ఒకనాడు రాత్రి పది గంటల వేళ ఆయనకు మొదట మధురతమ మగు నృత్య శబ్దము వినిపించెను. తర్వాత వందలకొలదిగా శివ గణములు వికృతరూపములతో వచ్చి వికటాట్టహాసములతో ఆయనను పరివేష్ఠించిరి. అది దుర్భరమై ఆయన దుర్గను ప్రార్థించెను. మఱుక్షణముననే ఆ గణములు మాయమయ్యెను. ఆ కోవెల చెంత పసుల కాపరుల యాగడముల వలన ధ్యానమునకు భంగము కలుగు చుండుటచే ఆయన తపస్సునకు నిశ్శబ్ద వాతావరణము ఆవశ్యకమని ఆ ప్రదేశమును వీడి నైరృతి లింగ స్థలమునకు చేరెను. అచ్చట వారము దినములు గడచునప్పటికి అరుణాచలేశ్వరుని యాలయమున కృత్తికోత్సవములు ఆరంభ మయ్యెను.

ఉత్సవము లందు ఏడవనాడు ఊరేగుచుండిన రథము వేద పాఠశాలకు, అన్నధర్మశాలకు మధ్య చదునైన బాట యందే హఠాత్తుగా స్తంభించెను. ప్రజ లెందఱో పూనుకొని ఎంత లాగినను ఆశ్చర్యకరముగా అది కదల లేదు. వారు అర్ధ రాత్రి వఱకును దానితో పెనగులాడి అలసిపోయి యిండ్లకు పోయిరి. అట్లగుట పెద్ద యనర్థమునకు కారణ మగునని అందఱు అలజడి నొంద జొచ్చిరి. అ సమయమున ధ్యానము ముగించి నిద్రించుచున్న వాసిష్ఠునకు కలలో గుడిలోని పెద్ద పూజారి కన్పించి, 'ఆచార్యా! మీరు వచ్చినగాని కదలనని భగవంతుడు చెప్పుచున్నాడు; కావున మీరు రావలె' అని మాయ మయ్యెను. మేలుకొన్న తరువాత ఆయనకు 'ఈశ్వరుడు నిన్ను పిలుచు చున్నాడు' అని అశరీరవాణి వినపడెను. అది ఈశ్వరాజ్ఞ అని వెంటనే రథము నొద్దకు వచ్చెను. అప్పుడు ఆ ప్రదేశమున కాపలావారు తప్ప జనులు లేకుండిరి. ఆయన ఈశ్వరునకు నమస్కరించి ఉదయమే వత్తునని నివేదించి నైరృతి లింగ స్థలమునకు తిరిగి వచ్చి నిద్రించెను. తెల్లవాఱి లేచునప్పటికి ఆలస్యమైనదని చింతించుచు ఆయన ఉదయము పది గంటలకు రథము నొద్దకు వచ్చెను. అప్పటికి అది యట్లే నిశ్చలముగా నుండెను. లాగుచున్నవారు ఆయాస పడుచునే యుండిరి. ఆయన లాగుచున్న వారిని ఆగుమని చెప్పి, పూజారులు త్రోవ చూపుచుండగా రథమును సమీపించి దేవుని కెదురుగా నేలపై సాష్టాంగముగ ప్రణమిల్లి 'తండ్రీ! ఇంక నీ రథమును కదలునట్లు అనుగ్రహింపు' మని ప్రార్థించెను. ఆయన లేచి ప్రక్కకు తప్పుకొని గుంపులో కలిసిపోయెను. అప్పుడు ప్రజలు లాగగా రథము సులభముగా కదలెను. 'ఈ మహాభక్తు డెవరో' అని ప్రజలు వెదకుచుండగా, వాసిష్ఠుడు వడివడిగా ప్రక్క సందులలో నుండి దూరముగ నేగెను.