ఉపోద్ఘాతము

వికీసోర్స్ నుండి
'శ్రీ సాయిసచ్చరిత్రము' (మొదటి రోజూ పారాయణము : గురువారం)



మహరాష్ట్ర దేశములోని వారందరికి శ్రీ గురుచరిత్ర సుప్రసిద్దము. అ దేశమంతటను దత్తాత్రేయభక్తులు దీనిని చదివెదరు. కొందరు నిత్యపారయణం చేసెదరు. దీనిని రచించినవారు సరస్వతి గంగాధారుడు. ఇందులో శ్రీ పాదా శ్రీవల్లభస్వామి యెక్కయు, శ్రీ నరసింహస్వామి యెక్కయు లీలలును విచిత్రచర్యలును వర్ణింపబడియున్నవి. వీరిద్దరు దత్తాత్రేయుని ముఖ్యావతారములు. ప్రముఖ మరాటీ గ్రంథకర్తయగు శ్రీ L.R.పాంగాకర్ అభిప్రాయము ప్రకార మీ రెండవాతారములు 14,15శతాబ్దములలో వెలసెను. దత్తత్రేయుని తదుపరి యవతారములు కూడ గలవు, ఇందులో ముఖ్యమైనవి నైజాము ఇలాఖాలో శ్రీమాణిక్యప్రభువు, షోలాపూరు జిల్లాలో శ్రీ ఆక్కల్ కోటకర్ మహరాజ్ గారు, తుట్టతుదుకు అహమదునగరు జిల్లాలోని శిరిడీ శ్రీ సాయిబాబాయును. బాబా 1918వ సంవత్సరములో మహసమాధి చెందిరి. శ్రీ ఆక్కల్ కొటకర్ మహరాజ్ అవతార పరంపరయే శ్రీ సాయిబాబాయని కొందరు భక్తుల నమ్మకము. అయిదవ యధ్యాయములో వేపచెట్టు క్రింద పాదుకలు ప్రతిష్టించిన కధయు, ఇరువదియారవ యధ్యాయములో చేప్పబడిన హరిశ్చంద్రపితళే అనుభవమును ఈ నమ్మకమును ద్రడపరుచుచున్నవి.



పైన వివరించిన రెండు అవతారముల విచిత్ర లీలలను శ్రీ గురుచరిత్రము మను గ్రంథ మందు 53 అధ్యాయములలో సరస్వతి గంగాధారుడు డేట్లువర్ణించెనో, యటులనే శ్రీ గోవిందరఘునాథ ఉరుఫ్ అన్నాసాహెబు దాభోళ్కరు (’హేమడ్‍పంతు’) అనువారు శ్రీ సాయిలీలలను 53 అధ్యాయములలో శ్రీ సాయిసచ్చరిత్రమును గ్రంథమును వర్ణించియున్నారు. కనుక నీ శ్రీ సాయిసచ్చరిత్రము యినాటి ’గురుచరిత్ర’యని చెప్పవచ్చును!



పై చరిత్రల గూర్చి ఈ దిగువ వివరించిన అంశములు గమనార్హములు: 1. శ్రీ గురుచరిత్ర వ్రాసినవారు కన్నడవారు కాబాట్టి, వారికి మరాటీ భాష బాగుగా తెలియకుండెను. అయినప్పటికి వారి ఇష్టదైవము యొక్క అశీర్వాదము వల్ల మరాటీ భాషలో ప్రసిద్ధికెక్కిన గొప్ప గ్రంథమును వారు వ్రాయగలిగిరి. శ్రీ సాయిసచ్చరిత్రము యొక్క గ్రంథకర్త సుప్రసిద్ద మరాటివారు. వారు మహరాష్ట్ర దేశములోని యనేక యోగుల చరిత్రలను చదివియున్నారు. ప్రసిద్దిచెందిన ఏకనాథ భాగవతము వారి నిత్యపారయణ గ్రంథము. శ్రీ సాయిసచ్చరిత్రము ను జాగ్రత్తగా చదివినచో, ఏకనాథ భాగవతము లోని పెక్కు విషయములు శ్రీ సాయిసచ్చరిత్రము లో పొందుపరచబదియుండుట చూడగలరు.

2. శ్రీ గురుచరిత్ర ముఖ్యముగా కర్మకాండపై నాధార్పడి యుండుటచే దానిని భోధపరచుకొనుట బహుకష్టము. దత్తాత్రేయుని ముఖ్యశిష్యలు గూడ దాని నాచరణలో పెట్టలేకున్నారు. శ్రీ సాయిసచ్చరిత్రము విషయము అట్టిది కాదు. అందులోని వెషయములు తేటతెల్లములు, మిక్కిలి సామాన్యమైనవి. ఇందులో చెప్పినవానిని అందరు సులభముగా గ్రహించి యాచరణలో పెట్టగలరు.

3. శ్రీ గురుచరిత్రలో వర్ణించిన విషయములు అవి జరిగిపొయిన నూరేండ్లుకు వ్రాయబడెను. కాని శ్రీ సాయిసచ్చరిత్రము లోని కోన్ని లీలలను రచయిత స్వయముగా చూచెను. శ్రీ సాయిబాబా యొక్క యనుమతి పొంది, వారు యాశీర్వాదముతో ఈ గ్రంధమును ప్రారంభించెను. వారి యాజ్ఞానుసారము అక్కడక్కడ ముఖ్యమైన విషయములు, లీలలు టూకిగా వ్రాసియుంచుకొనెను. 1918వ సంవత్సరములో సాయిబాబా సమాధిచెందిన తరువాత, శ్రీ సాయిలీల మాసపత్రికలో శ్రీ సాయిచరిత్రమును కొంచెము కొంచెము ప్రకటించెను.

శ్రీ సాయిసచ్చరిత్రము మీ విధముగ 1923 నుండి 1929 వరకు శ్రీసాయిలీల లో థారావాహికముగా ప్రచురించబడినది. కనుక శ్రీ సాయిసచ్చరిత్రము ప్రస్తుత గ్రంథము అధికారమైనది. శిరిడి శ్రీ సాయిబాబా సశిరీరులుగ యుండగా దర్శించుకొను భాగ్యము లభించని సాయిభాక్తులకు యీ గ్రంథము నిజముగా యొక్క వరము.

శ్రీ సాయిసచ్చరిత్రము ను అన్నాసాహెబు దాభోళ్కరు కూర్చెను. కాని, ప్రతి అధ్యయము చివరను శ్రీ సాయి ప్రేరేపణచే ’హేమడపంతు’చే వ్రాయబడి నట్లన్నది. కావున ఈ హేమడపంతు ఏవరని పాఠకులడుగవచ్చును. అన్నాసాహెబు దాభోళ్కరు మొట్టమొద్దటిసారి శ్రీ సాయిబాబాను సందర్శించినప్పుడు, వారీ బిరుదును దాభోళ్కరుకు కరుణించిరి. ఎప్పుడు ఏ సందర్బములో నీ బిరుదునతనికి నొసంగిరో యను విషయము రెండవ అధ్యాయములలో రచయితయే చెప్పియున్నారు. అన్నాసాహెబు జీవితచరిత్ర యీ దిగువ క్లుప్తముగా చెప్పబడినది.


గ్రంథరచయత యగు దాభోళ్కరు 1859వ సంవత్సరములో ఠాణాజిల్లాలోని కేళ్వేమాహిమునదు యెక పేద అద్యగౌడబ్రాహణ కుటుంబములో జన్మించిరి. వారి తాతతండ్రులు దైవభక్తిగలవారు. దాభోళ్కరు తమ ప్రాథమికవిద్యను స్వగ్రామందే పూర్తిచేసి, పూనాలో 5వ స్టాండర్డు వరకు అంగ్లవిద్యనభ్యసించిరి. కుటుంబ ఆర్దికపరిస్థితులంత బాగుగా నుండకుండుటచే వారు పై క్లాసులు చదువుట మానుకొనిరి. అప్పట్లో నున్న సర్కారు నవుకరి పరికలో నుత్తిర్ణులై తన ఊరిలోనె బడిపంతులు ఉద్యోగములో ప్రవేశించిరి. అ సమయమందు నున్న సాబాజీ చింతమణి చిటెణీస్ అనువారు వీరి సచ్చీలతను, బుద్దికుశలతను, సేవానిరతిని చూచి మెచ్చుకొని తలాఠియను గ్రామెద్యోగిగా నియమించిరి. తరువాత ఇంగ్లీషు గుమస్తాగా వేసిరి, పిమ్మట మామల్తదారు కచేరిలో హెడ్ గుమస్తాగా నియమించిరి. కొంతకాలము జరిగిన పిమ్మట అటవీశాఖలో ఉద్యోగిగా నుంచిరి. కొన్నాళ్ళకు కరువు సంబధపు పనులందు ప్రత్యేకోద్యోగిగా గుజరాత్ లోని బ్రోచ్ లో నియమితులైరి. ఆయా ఉద్యోగములలో తన బాద్యతలను అత్యంత సమర్దవంతముగ నెరవేర్చుట వలన 1901వ సంలో ఠాణా జిల్లాలో శాహపూరులో మామల్తదారుగా నియమింపబడిరి. వారచ్చట 1903వ సంలో ఫస్టుక్లాసు రెసిడెంటు మెజిస్ట్రేటుగా బాంద్రాలో నియమింపజ్బడిరి. వారచ్చట 1907 వరకు ఉద్యోగము చేసిరి. తరువాత అయన ముర్బాడు, అనంద్, బోర్సదులలో పనిచేసి, 1910వ సంలో తిరిగి బాంద్రాలో రెసిడెంటు మెజిస్ట్రేటుగా నియమియ్తులైరి. ఈ సంత్సరమందే వారికి శిరిడీకి పోయి శ్రీ సాయిసందర్సనము చేయు భాగ్యము కలిగెను.

1916వ సంలో వారు ఉద్యోగమువిరమణ చేసిన పిమ్మట కోన్ని నెలలు వరకు తాత్కలిక ఉద్యోగిగా పనిచేసిరి. అదియును విరమించిన తరువాత సాయిబాబా మహసమాథి చెందువరకు శ్రీ సాయిసేవలోనె పూర్తగ నివగ్నులయిరి. బాబా మహసమాథి పిమ్మట శిరిడి శ్రీ సాయిబాబా సంస్థానమును, 1929వ సంలో తాను మరణించువరకును, ఎంతో చాకచక్యముగ నడిపిరి. వారికి భార్య, ఒక కుమారుడు, అయిదుగురు కుమార్తెలుండిరి. బిడ్డలకు తగిన సంబంధములు దొరికినవి. అందరు సుఖముగా నున్నారు.


సాయిబాబా యెవరు:

సాయిబాబా యెవరు? -- అను ప్రశ్నకు మూడు విధములుగా సమాధానము చెప్పవచ్చును:

1. దీర్ఘాలోచన చేయకయే, విషయములనుగూర్చి గాని, మనుష్యులను గూర్చి గాని యభిప్రాయము చెప్పు అభ్యాసము గలవారు సాయిబాబానొక పిచ్చి ఫకీరనియు, వారు శిరిడిలో శిథిలమై పాడుపడిన మసీదులో ననేక సంవత్సరములు నివసించిరనియు, ఇష్టము వచ్చినట్లుగా మాట్లాడుచు, తమను దర్శించ వచ్చినవారి నుంచి దక్షిణ రూపముగా ధనము వసూలు చేయుచుండిరనియు చెప్పుదురు.

ఈ యభిప్రాయము తప్పు! అర్. ఏ. తర్ఖడ్ గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శినానంతరము, బాబా వద్ద సెలవు పుచ్చుకొని బొంబాయి తిరిగి పోవునప్పుడు కంటితడి పెట్టుకొనెను. అతనితో బాబా యిట్లునెను "పిచ్చివానివలె ప్రవర్తించున్నవేమి? నేను బొంబాయిలో మాత్రాము నీతో లేనా?" దానికి తర్ఖడ్ గారి మిత్రుడిట్లు జవాబిచ్చెను:" నాకా విషయము తెలియదు. ఎందుకనగా మీరు బొంబాయిలో నాతో నున్నట్లు నా కనుభవము లేదుగదా!" అందులకు బాబా యిట్లనియెను: "ఎవరయితే బాబా శిరిడిలో మాత్రమే యున్నాడని యనుకొందురో వారు బాబాను నిజముగా గ్రహింపలేదని తెలుసుకో!"

2. కొందరు సాయిబాబాను మహసిద్దిపురుషుడనిరి. మహమ్మదీయులు బాబాను తమ పీరులలో నొకనిగా భావించిరి. హిందువులు బాబాను తమ మహత్ములలో నొకనిగా గ్రహించిరి. ప్రతి సంవత్సరము శిరిడీలో జరుగు ఉత్సవముల నిర్వాహకులు తమ ప్రకటనలలో బాబాను ’సంతచూడామణి’గా పేర్కొనెదరు.

ఈ యభిప్రాయము కూడా సరియైనది కాదు!

3.శ్రీ సాయిబాబాను సన్నిహితముగాను, వాస్తవముగాను సేవించిన వారు మాత్రము బాబాను భగవదవతారముగా నిప్పటికిని భావించుచున్నారు. దీనికి కొన్ని దృష్టాంతముల నిచ్చెదము.

1. బి.వి. నరసింహస్వామిగారు రచించిన ’బాబా సూత్రములు - పలుకులు’ అను గ్రంథమునకు పీఠికలో ఇండోరు హైకోర్టు జడ్జిగారగు యమ్.బి.రేగేగారు ఇట్లు వ్రాసి యున్నారు: "బాబా సశరీరులుగయున్నపుడు, వారొక రూపుదాల్చిన భగవత్స్వరూపముగ తమ భక్తులకు భాసిల్లుతూ, తమ లీలాప్రాబోధాల ద్వారా సాధకుల మార్గమును ప్రకాశింపజేయుచుండెడివారు. వారి నశ్వరమైన దేహము మాయమైపోయినది గాని, దానిలో అప్పుడుండిన ’బాబా’ మాత్రము నిప్పటికిని అనంతశక్తివలె నిలిచి, వారు సమాధీ చెందకముందు భక్తులకు తోడ్పిడినట్లే ఇప్పటికిని వారినాశ్రయించు యసంఖ్యాక భక్తులకు నిశ్శబ్దముగా సహాయపడుచున్నారు."

2. శ్రీ బి.వి. నరసింహస్వామిగారు రచించిన ’భక్తుల యనుభవములు’ అనుపుస్తకములోని మెదటి పేజీలో ఉత్తరభారతదేశములో నున్న ఒక హైకోర్టు జడ్జి గారిట్లు వ్రాసియున్నారు: "నేను సాయిబాబాను స్రష్టిస్థితిలయకారకుడుగా భావించెదను. 1918వ సంలో వారు సమాధి చెందకముందు నేనట్లు భావించితిని. ఇప్పటికి నేనట్లే భావించుచున్నాను. నాకు మాత్రము వారు సమాధి చెందినట్లు లేదు. నాదృష్టిలో, వారు అన్ని పరిమితులకు అతీతులు. వారు మా మధ్య యున్నప్పుడు వారు మానవశరీరము మా కనుల ముందు సంచరించుచుండెను, ఒక్కోక్కప్పుడది మాదృష్టిని విశేషముగ నాకర్షించెడిది. కాని, ఎక్కువ భాగము మా ఎరుకలో నిలిచినది మాత్రము వారి అనంతతత్త్వమే. శాశ్వతము - అశాశ్వతముల అద్భుత సమ్మేళన రూపమైన యొక మానసికప్రతిబింబ వలే వారు మాకు భాసించేవారు. అశాశ్వతమైన తమ మానవదేహము నొక్కొక్కప్పుడు మా ముందుర తళుకుమని మెరిపించేవారు. ఇప్పుడు అశాశ్వతమైన అ దేహము మాయమై, ’సాయిబాబా’యను శాశ్వతమయిన అనంతశక్తి మాత్రము నిలిచియున్నది."

3. బి.వి. నరసింహస్వామిగారు రచించిన ’భక్తుల యనుభవములు’ అను గ్రంథములో 19,20 పుటలలో అచార్య జి.జి.నార్కే, (యం.ఏ.యం.యస్.సి., పూనా ఇంజనీరింగు కాలేజీ) యిట్లు చెప్పి యున్నారు: "ఇంటివద్డ నిత్యము నేను పూజించు గ్రహదేవతల మధ్య సాయిబాబా నొకరినిగా నుంచితిని. సాయిబాబా భగవంతుడు. అయన సామాన్య సత్పురుషుడు కాడు. మా మామగారగు శ్రీమాన్ బూటీ, నాభర్య, నాతల్లి గొప్ప సాయిభక్తలు. వారు సాయిబాబాను భగవంతునివలె పూజించువారు. నేను క్రొత్తగా శిరిడి పోయినప్పుడొకనాడు అరతి సమయములో సాయిబాబా మిక్కిలి కోపోద్దీపితుడై యుండెను. అ కారణముగా వారు కోపించుచు, శపించుచు, భయపెట్టుచుండిరి. అయన పిచ్చివాడా యేమను ऽऽసంశ్యము నా మనస్సుऽऽ మెదిలెను. మామూలుగనే అరతి పూర్తియాయెను. అనాటి సాయంకాలము నేను బాబా పాదములను ఒత్తుచుంటిని. అప్పుడు బాబా ప్రేమగా నా తలనునిమురుచు, ’నేను పిచ్చివాడను కాను!" అనెను. ఎంత యాశ్చర్యము! నా హ్రదయగత భావమును గ్రహించుచున్నారు. వారికి తెలియకుండ మనము ఏ రహస్యములను దాచజాలము. వారు యంతర్యామి, నా యాత్మయొక్క యంతరాత్మయని నేన్నుకొంటిని. అటు పిమ్మట వారి యంతర్యామిత్వమును గూర్చి నాకనేక నిదర్శములు కలిగెను. వారు నాతో మాట్లాడునప్పుడు నా హృదయములో కూర్చుండి, మాట్లాడువానివలె మాట్లాడువారు. నా హృదయములోగల యాలోచనలను, కోరికలను గ్రహించుచుండెడివారు. వారు నాలో నున్న భగవంతుడు. వారే భగవంతుడుని నిశ్చయించుటలో నాకెట్టి సంకోచము లేకుండెను. ఒక్కొక్కప్పుడు వారిని నేను పరీక్షించుచుంటిని. ప్రతి పరీక్షలో వారు సర్వజ్ఞులనియు, వారి యిచ్ఛానుసారము సర్వమును నడిపించెదరను ఒకే నమ్మకము కలిగుచుండెను."

4. రావుబహుద్దూర్ యమ్. డబ్ల్యు. ప్రధాన్ వ్రాసిన ’శిరిడి సాయిబాబా’ యను గ్రంథముకు ఉపోద్ఘాతములో గౌరవనీయులును, అమరావతిలో ప్రసిద్దికెక్కిన వకీలును నగు దాదాసాహెబు ఖాపర్డే యిట్లు చెప్పియున్నారు:

"శ్రీ సాయిబాబా ప్రతివారి యంతరంగమందు మెదలు అలోచనలన్నియు తెలిసిన వానివలె వుండి, వారి కోరికలు తీర్చుచు సుఖసంతోషములు కలుగజేయుచుండెడివారు. అయన భూమిపై నడయాడు దైవమనే భావము కలుగుచుండెను."

5. దాసగణు మహరాజు తమ ’స్తవన మంజరి’ యను స్తోత్రము నందు సాయిబాబాను జగత్తుయొక్క సృష్టికర్తగాను నిర్మలమయిన యంతరాత్మగాను నిత్యశాంతమూర్తిగాను వర్ణించి యున్నారు.

6. హేమడ్‍పంతు శ్రీ సాయిసచ్చరిత్రము యొక్క మొదటి అధ్యాయములో సాయిబాబాను గోధుమలు విసరుచుండిన యొక వింతయోగిగా వర్ణించెను. కాని రాను రాను బాబాతో సంబంధము పెరిగిన కొలది, బాబాను భగవంతుడనియు, సాక్షాత్పరబ్రహ్మస్వరూపుడనియు చెప్పియున్నారు.

7. శిరిడీ భక్తులందరు, ముఖ్యముగా మధవరావు దేశపాండే వురుఫ్ శ్యామ యనువారు బాబాకు మిక్కిలి భక్తులు; వచ్చిన భక్తులందరితో కలిసిమెలిసి తిరుగువాడు. అయనెల్లప్పుడు బాబాను ’దేవా’యని సంబోధించువాడు.

ఈ భక్తులందరి యభిప్రాయములను అవధరించి, వారు చెప్పినదానిలోని యదార్దమును గ్రహించి శ్రీ సాయి యవతారపురుషుడని భావించెదము గాక!

ఉపనిషత్ ద్రష్టలైన మన పూర్వఋషులు భగవంతుడు సర్వాంతర్యామి యను సత్యమును దర్శించిరి. బృహదారణ్యక, ఛాందోగ్య, కఠ, శ్వేతాశ్వతర ఉపనిషత్తులు జీవకోటితో సహ సర్వవస్తు సమూదాయమైన ప్రకృతి యంతయు భగవంతుని రచనయనియు, అది యంతయు నంతార్యామిచే, అనగా సర్వమును సృష్టించి పాలించెడి భగవంతునిచే, వ్యాపింపబడి యొన్నదనియు వక్కాణించుచున్నవి. ఈ సిద్దాంతమును నిరూపణ చేయుటకు తగిన యుదాహరణము శ్రీ సాయియే! ఈ శ్రీ సాయిసచ్చరిత్రము ను, సాయిబాబాకు సంబంధించిన ఇతర గ్రంథములను చదివినవారు తప్పక యీ సత్యము గ్రహించి, యదార్దమయిన శ్రీసాయిని దర్శించగలరు!



శ్రీ సాయినాథాయ నమః ఉపోద్ఘాతము సంపూర్ణము

సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు