ఆ భా 3 1 181 to 3 1 210

వికీసోర్స్ నుండి

వోలం సురేష్ కుమార్


వ. అ ట్లసంఖ్యాత చతురంగ సైన్యంబులతో నరిగి గిరి వన సరోవర సరిద్దేశంబులు గడచి మార్తికావతదేశంబున కరుగునంతకు ముందర సాల్వుండు సౌంభకారూఢుం డయి సముద్రకుక్షి దేశంబునకుం బోయిన. 181

క.. ఏనును వానిపిఱుందన మానక చని తచ్చమూసమాజముతోడన్ భూనాథ రణము సేసిది నానానిశితాస్త్రవర్షణ వ్యాప్తముగన్. 182

క. వీరు లగుయోధుల నారాచావళులు గప్పె నారథము పయిన్ సారథిఁ దురంగములపయి చారుధ్వజ యష్టపయి నసంఖ్యాతముగన్. 183

వ. వాని నెల్ల నస్మదీయగోచరంబులు గాకుండ ననేకాయుత శరంబు లేసి సాల్వుసైన్యంబుతో మహాయుద్ధంబు సేసిన. 184

మ. అవనీనాథ తదాహవాంతరమునం దస్మత్కరాకృష్ట శా ర్జవినిర్ముక్తనిశాతసాయకశతాగ్ర చ్ఛిన్నమై దైత్యదా నవదేహ ప్రకరంబు వాత విధుతార్ణః పూర్ణసంఘూర్ణి తా ర్ణవకుక్షిం బడియెం గపిప్రవర సైన్యక్షిప్త శైలాకృతిన్. 185

చ. ఘనతర దైత్య దానవ నీకాయకళేబర పాతఘట్టనం దనరి యుగాంత్యకాలచలితంబును బోలెఁ బయోధి మ్రోసె న వ్వనధిరవంబుకంటె ననివారితమై చెలఁగెన్ మదీయవా హిని భటసింహనాద హయహేషిత సింధుర బృంహితధ్వముల్. 186

వ. అట్టి మదీయ సేనోత్సాహంబును నిజసేనాక్షీణతయుం జూచి సహింపక సాల్వుండు వెండియు సౌంభకారూఢుం డయి నాతో మాయాయుద్ధంబుసేయ సమకట్టి. 187

సీ. పరశు పాశాంకుశ కరవాలశూల ముద్గరములు నామీఁదఁ దెరలఁ గురిసె నేనును గడఁగి యద్దానవు శస్త్రముల్ వాయంగఁ జేసితి మాయఁ జేసి వెఱవక సాల్వుండు వెండియు నామీఁదఁ బరుష శిలావృష్టిఁ గురిసె వరుస సమరఁ దమః ప్రకాశములతో దుర్దివసుదిన శీతోష్ణముల్ గదియఁ జేసి.

ఆ. దితిసూతాధముండు శతసూర్య శతచంద్ర శత సహస్ర విష్ణుతతులు వెలుఁగ గగనతలము సేసెఁ బగలిది రేయిది యని యెఱుంగ నయితి మనములోన. 188

క. మనుజేంద్ర సర్వమాయా పనోదనం బయిన యగ్ని బాణంబున న ద్దనుజ వినిర్మితమాయా వినివర్తనఁ జేసితిని నవిస్మయమతినై. 189

వ. అట్టి యవసరంబున ద్వారవతినుండి యాహుక ప్రేషితుం డయి యొక్కరుండతి త్వరితగతిం బఱతెంచి సాల్వుచేత నక్కడ వసుదేవుండు పట్టువడియె నీవెవ్వనితోడం గయ్యంబు సేసెదు క్రమ్మఱి చని పురంబు రక్షించుకొనుమనిన విని యదరిపడి మహా బలపరాక్రము లయిన బలదేవాదులు రక్షించుకొని యుండ వసుదేవుఁ డేల పట్టువడు నిదిపోలదని సంశయించుచు విమనస్కుండ నయి యుండు నంత. 190

సీ. పుణ్యకర్మంబులు వొలిసిన నుర్వికి బ్రీతి నేతెంచు యయాతి వోలె భూణషదీప్తులు వొలియంగ వివృత కేశాంబరుడయి సౌంభకంబు వలనఁ బఱదెంచు వనుదేవుఁ బాపని శాచర బలపీడ్యమాను దవ్వులన కాంచి యత్యంత మోహశోకాంధుం డ నయిన నా హస్తంబు వలన విస్రస్తమయ్యె.

ఆ. శార్జ్గమప్రియావసన్న దేహూండనై యుడిగి రథముమీఁదఁ బడుతి నేను దానిఁ జూచి భయము దగిరి మత్సైన్యంబు దల్లడిల్లి యులిసెఁ బెల్లురేఁగి. 191

వ. అంత నెతంయుం బ్రొద్దునకుఁ దెనిసి సాల్వుసౌంభకంబున వసుదేవుం గానక దాని మాయగా నెఱింగి పదంపడి మాయావి యయిన సాల్వుంజూచి వాని పయి నలిగి యే సేసిన నయ్యసురయు సౌంభకంబు నదృశ్యం బగుటయు. 192

క. అసురుల యాక్రోశధ్వను లెసఁగెం బదిదిశల నంత నేనును దద్రా క్షసులఁ గతాసులఁ జేసితిఁ బ్రసభంబున శబ్దభేరి బాణప్రతతిన్. 193

వ. అంత సాల్వుండును దన సౌంభకంబుఁ బ్రాగ్జోతిషంబుఁజేసి తానును దానవుండయి పర్వతవర్షంబు నాపయిం గురిసిన. 194

ఆ. పరుష విషమ భూరి పాషాణభీషణ గిరులు వచ్చి నన్నుఁ దెరలఁ గప్ప వజ్రబాణమేసి వాని నన్నింటిని బాచి యున్న నన్నుఁ జూచి యపుడు. 195

క. దరుకుఁ డిట్లనియె మహా వీరు ను పేక్షింపఁ దగునె వీనిని మాయా ప్రారంభు నుపేక్షింప ర పారపరాక్రములు పోర బ్రాకృతునైనన్. 196

వ. అనిన వానిపలుకులు విని యలిగి యనలజ్వాలాకరాళం బయి ప్రతికూల రాక్షస యక్ష గంధర్వ దైత్య దానవ భస్మసాత్కరణ దారుణం బయిన చక్రంబు నభిమంత్రించి సౌంభకంబు పయి వైచిన నది యుగాంతకాల పరివేషభీషణం బయిన రవి మండలంబునంబోలె గగనంబునం బఱచి సౌంభక మధ్యంబునం బడిన. 197

చ.. తడయక ఘోరదర్శన సుదర్శనపావకుచే దహింపఁగా బడి పరమేశ్వరోగ్రశరపావక దగ్ధపుర త్రయాభమై యెడరి ధరిత్రిమీఁదఁ బడియెం జెడి సౌంభక మంత సాల్వుఁడుం బడియె మదీయ చక్ర పటుపాతరయంబున రెండు వ్రయ్యలై. 198

- పాండవులు ద్వైతవనంబనకు వచ్చి యుండుట - సం. 3-23-42

వ. అని యిట్లు సాల్వుం దనచంపిన విధంబుసెప్పి చక్రధరుండు పాండవుల వీడ్కొని సుభద్రాభిమన్యులం గాంచనరథం బెక్కించుకొని తోడ్కొని ద్వారవతి కరిగె ధృష్టద్యుమ్నుండును బ్రతివింధ్యాతులయిన ద్రౌపదేయులం దోడ్కొని ద్రుపద పురంబునకుం జనియె నిట పాండవులును రథంబులెక్కి యాయుధంబులు ధరియించి యింద్రసేనాదిమూలభృత్యు లిరువదుండ్రు ముదటరా ననేక సహస్ర బ్రాహ్మణవరులతో ద్వైతవనంబున కరిగి రంత ధర్మరాజు తమ్ముల కిట్లనియె. 199

మధ్యాక్కర. ఇది మహోగ్రాటవి సింహ శర భోరగేంద్ర శార్దూల మదగజాకీర్ణంబు దీనిలోన నేమఱకుండ వలయు నదియునుంగాక పరప్రయోగమాయలు గల వెఱిఁగి మది నుండునది యన్న నన్న కిట్లను మఘవనందనుఁడు. 200

వ. బ్రహ్మవిదులును దపోవృద్ధులైన బ్రాహ్మణులును నఖిలలోకద్వారంబుల నప్రతిహతు లయిన నారద ద్వైపాయనాది మునివరులును నీచేత నుపాసితులయి నీ కుశలంబు కోరుచుండుదురు భవత్ప్రతాపం బెల్ల వారిని రక్షించు నివ్వనంబు సకలకాల కసుమ ఫలభరిత వనస్పతి శాఖాశిఖారూఢ మయూరకీర కోకిలాప మధురంబును బక బలాక కోక కారండవ సారస రమ్యమధుకర సౌమ్య సరోవర సంకులంబును విమల శీతలజల ప్రవాహనదీ శోభితంబును మహర్షి గణసేవితంబును నై యొప్పుచున్నయది యిందుండుదమని లలితలతావితా నాదిరమణీయంబు లయిన వృక్షమూలంబుల నేవురు వేఱువేఱ నివాసంబులు సేసి నియతాత్ములయు యిష్టంబున దేవపితృ కార్యంబులు సేయుచుం దమ్ముఁజూడ వచ్చిన మహామునులకు బ్రాహ్మణులకు మనఃప్రియంబు లయిన యాహారంబులు వెట్టుచు ద్వైతవనంబున నుండు నంత. 201

క. పాండవుల కడకు ధర్మవి దుండు తపోదహన దగ్ధ దురితౌఘుఁడు మా ర్కండేయుం డను మునినా థుం డంతేవాసి గణముతోఁ జనుదెంచెన్. 202

వ. ఇట్లు వచ్చి వారలచేత నర్చితుండయు వనవాస క్లేశదుఃఖితు లయిన పాండవులను ద్రౌపదిం జూచి యమ్మార్కండేయుం డిట్లనియె. 203

సీ. పిత్రునిదేశమ్మునఁ బృథివీశ్వరత్వంబు విడిచి సానుజుఁడై పవిత్ర చరిత జానకిఁ దోడ్కొని చని వనంబున నున్న రఘుకులనందను రాముఁ దొల్లి చూచితి నిపుడు భూసురవంశ పోషకు సాధుజన స్తుత్య సత్యధర్మ నిత్య ధర్మజు రమణీయ కీర్తి ప్రియు శమవంతుఁ జూచితి సగరభరత.

ఆ. నల యయాతి వైవ్య నాభాగు లాదిగా నాది రాజు లెల్ల నధిక ధర్మ సత్యయుక్తిఁ జేసి సకల లోకంబులు వడసి భాగధేయ భాగు లయిరి. 204

వ. పాపసౌబల ప్రయుక్తుం డయిల ధార్తరాష్ట్రు నట్లు ధర్మువు దప్పిన వారెవ్వరును లేరు మీరు ధర్మనిత్యులగు సత్యవ్రతులరు గావున మీకిష్ట సిద్ధియగు నని మార్కండేయుం డరిగిన నవరసంధ్యోపాసనాసీనుం డయిన ధర్మరాజును సాయంహోమార్థ ప్రజ్వనిత జ్వలనంబు లయిన యనేక సహస్ర బ్రాహ్మణాగ్నిహోత్రంబులం జూచి బకదాల్భ్యుం డను మహాముని యిట్లనియె. 205

భూమిసురోత్తముల్ ప్రకృతి పుణ్యవిధాయులు వీరు ఋగ్యజు స్సామపరాయణుల్ పరమసాధు చరిత్రులు మీకు సంతత ప్రేమమునన్ శుభోన్నతులు వెంచుచు నుండుటఁ జేసి సద్గుణో ద్దామ యరణ్యవాన మిది దద్దయి నొప్పెడు మాకుఁ జూడఁగన్. 206

వ. బ్రాహ్మశాను గ్రహంబునం జేసి తొల్లి వైరోచనాదు లనేక కాలంబు లక్షయ లక్ష్మీవిభవు లయి సముద్ర నేమి భూచక్రంబు రక్షించిరి యనిలసహాయుండయిన యగ్నిదేవుం డరణ్యంబులు దహించు నట్లు బ్రాహ్మణ సహాయుం డయిన మహీశుండు శత్రువర్గంబు నిశ్శేషంబు సేయు వినీతుం డయి విప్రులచేత ననుశాసితుం డయిన రాజునకు నలబ్దలాభాదిత్రితయంబు సంపన్నంబగు బ్రాహ్మణరహితుం డయి ధర్మహీనుం డయున రాజును బ్రజవలవదు బ్రజానురాగంబు లేనివారికి రాజ్యంబు సుస్థిరంబు గానేరదు మీరు బ్రాహ్మణ ప్రియులరు ధర్మనిత్యుల రెప్పుడును మీ కభ్యుదయం బగునని బకదాల్భ్యుం డరిగినఁ బాండవులుం దమ యిష్టంబున నుండి దుఃఖోపశమనంబు లయిన కథలు సెప్పుకొనుచున్న యవసరంబున ద్రౌపది ధర్మరాజున కిట్లనియె. 207

ఆ. వృద్ధు గొడుకుపలుకు విని క్రూరుఁడైన పాప బుద్ధిఁజేసి మిమ్ము భూతలంబు వెలువరించి రాజ్యవిభవంబు గొని యిప్పు డలుకసెడి సుచిత్తుఁ డయ్యె నొక్కొ. 208

ఆ. అద్దరాత్ము హృదయ మది యయః పాషాణ నిష్ఠురంబు ధర్మనిధుల మిమ్ము నట్లు గొడుకు లెగ్గు లాడంగఁ బోయిన వలదనండ కలహవాంఛఁ జేసి. 209

సీ. విమలహార్మ్యంబుల విహరించువారలఁ బ్రియ మహార్హాసనశయనరతులఁ జందనా గురులిప్త చార సర్వాంగు నతవరనాథ సేవితుల మిమ్ము వనమునఁ గ్రుమ్మరు వారిఁ గాఁ గుశబృసీశచనాభిరతులఁ గా నియతరూక్ష భూరేణుధూ సరీభూతవిగ్రహులఁ గా ద్రుతవన్య మృగ నిషేవితులఁ గాఁగ.

ఆ. నిట్లు సూచి చూచి యే నెట్లు చిత్తోప శాంతి సేయుదాన సకల భోగ విషయవిరతిఁ జేసి విధియును ధృతరాష్ట్రు నట్లు మీకు నహితుఁ డయ్యె నొక్కొ. 210


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com