ఆంధ్ర రచయితలు/తాడూరి లక్ష్మీనరసింహరాయకవి

వికీసోర్స్ నుండి

తాడూరి లక్ష్మీనరసింహరాయకవి

1856-1936

మధ్వమతస్థులు. తల్లి: సీతమాంబ.తండ్రి: రామారావు. నివాసము: రాజమేంద్రవరము. జననము: 18-7-1856 సం. నల సంవత్సర - ఆషాఢ బహుళ ప్రతిపత్తు - శుక్రవారము. నిర్యాణము: 4-7-1936 సం. ధాతృ సంవత్సర - ఆషాఢ శుద్ధ పూర్ణిమ.

కృతులు: 1. శృంగారభూషనము. 2. ఉన్మత్తరాఘవము. 3. రుక్మిణీ స్వయంవరము. (ఈ మూడు నాటకములు) 4. భోజకుమారము. 5. లక్ష్మీసంవాదము. 6. చంద్రాలోకము. 7. మేఘసందేశము (పూర్వసర్గముమాత్ర మాంధ్రీకృతము) 8. దైవప్రార్థనము. 9. భగవద్గీత (ఆంధ్రీకృతి). 10. శృంగారతిలకము. 11. ఋతుసంహారము. 12. జ్ఞానోదయము (ఆంగ్ల అణు కావ్యముల ఆంధ్రీకరణము). 13. సనత్సుజాతీయము. 14. నీతికథానిధి. 15. రసమంజరి (సంస్కృతమునకు తెలుగుసేత). 16. చమత్కారచంద్రిక. 17. పండితరాయ శతకము. 18. ఉద్యోగపర్వము (తెలిగింపు) 19. బాలనీతి - ఇత్యాదులు.

నాటిరాజమహేంద్రవరము - నేటిరాజమహేంద్రవరము కవులను బెంచుచున్న చక్కని పట్టణము. రాజరాజనరేంద్రుని మొదలు నేటిదాక, ఆపుర మొకేతీరున గవులకు గాపురము.

శ్రీవీరేశలింగముగారితో పాటు, శ్రీ సుబ్బారాయుడుగారితోపాటు, వాసుదేవశాస్త్రిగారితోపాటు, లక్ష్మినరసింహంగారితోపాటు రాజమహేంద్రవరమున గొన్నాళ్ళు నివాసమున్న కవులలో తాడూరి లక్ష్మీనరసింహరావుగా రొకకవి. ఈయనకు కవిగా బేరున్నదిగాని, వాస్తవమునకు రాజకీయోద్యోగి. ప్రభుత్యోద్యోగులై తెలుగు సాహిత్యమును, గవిత్వమును సేవించినవారు మనవారిలో బెక్కురు. జయంతి రామయ్యపంతులుగా రాజాతిలోవారు. ప్రకృతము మన తాడూరి లక్ష్మినరసింహరాయకవి విషయము పరిశీలింతము. ఈయన 'డిప్యూటీ తహసీలుదారు' గా చింతలపూడి, భీమవరము, క్రొత్తపేట, కదిరి, కడప మున్నగు తావుల నుద్యోగించిరి. సాధారణముగా, ప్రతి మానవునకు అభిప్రాయమొకటి - చేయుచున్నపని యొకటి యగుట జరుగుచున్నది. లక్ష్మినరసింహరాయకవికి స్వతంత్రతతో జీవింపవలెనని కాని, పరాధీనమైన సేవకవృత్తిలో గొట్టుకొనవలెననికాని తలపులేదు. కాని తప్పలేదు. 1912 సం.వఱకు తెలుగునేలలో బలుప్రాంతములు పర్యటించి 'డిప్యూటీ తహశ్శీలుదారు'గా బనిచేసి ప్రజలయాశీస్సులకు, అధికారుల యామోదమునకు బాత్రుడై, గౌరవవేతనము పుచ్చుకొనెను. ఉద్యోగమునుండి విరమించిన 1912 మొదలు, ఇరువదినాలుగేండ్లు వీరుజీవించిరి. ఈయిరువది నాలుగేండ్లును సారస్వత సేవకై వినియోగపడినవి. సేవావృత్తిని తూలనాడుచు 'భోజకుమారము' లో వ్రాసిన వీరిపద్య మిది:

సీ. చందమామను మించునందంబు గలదాని

జీ! కురూపినిగాగ జేయుదాన

అలనుమేరువునైన నడగించు దిట్టరి

జీ! పదగాగను జేయుదాన

ఉక్కుమీఱి నురేంద్రు లెక్క సేయనివాని

జీ! యస్వతంత్రుని జేయుదాన

అల దేవగురునోర్చు నతిబుద్ధిశాలిని

జీ! బుద్ధిహీనుని జేయుదాన

గీ. అల్ల సత్యహరిశ్చంద్రు నట్టివాడు

చెప్పు నిజమును జీ! బొంకు సేయుదాన

అవనినోనేవ! కటకటా! యక్కటకట!

కలదె? నీచేయలేని యకార్యమొకటి.

ఈనాటకమున సేవానైచ్యము - అధికార మదాంధత - నిరర్థ బిరుదప్రదానము - మున్నగునవి పేర్కొని, వానిని నిరసించిరి.

1905 తరువాత నీకవి భగవద్గీత - ననత్సుజాతీయములు తెలిగించిరి. భారతమున నుద్యోగపర్వమును వీరాంధ్రీకరించిరి. గాని, యది నేటి దాక వెలువరింపబడలేదు. తిక్కన సోమయాజి తెనుగులో గొన్ని వేదాంతఘట్టములు పరిత్యక్తములయి యుండుట సహింపక, జగద్ధితమునకై భగవద్గీత, ప్రజాగరపర్వము, సనత్సుజాతీయము తాడూరికవి యాంధ్రీకరించెనట. ఇవి పరికించి కొందఱు ప్రోత్సహింపగా ఉద్యోగపర్వము సమగ్రముగా ననువదించెను. భారతపర్వములలో ఉద్యోగము సారవంతమని, లోకప్రవృత్తికి ముఖ్యమని యెంచి తెనిగించిరని కవి హృదయమును వారి కుమారులు వెలువరించిరి. ఈతెనుగు నేత శ్లోకానుక్రమముగా నున్నది. .....లో ప్రథమపుత్రశోకము వలన విరక్తుడై యీకవి భగవద్గీతాదికృతులు తెనుగు సేసెనట. విదురనీతిలోని పద్యములు:

అవమానింపక యెట్టిదుర్బలుని చిద్రాన్వేషియై నేర్పుతో

నవనీనాయక బుద్ధిపూర్వముగ నొయ్యన్ వైరినిం గొల్చుచున్

భువిలో జాల బలిష్టులౌ పగఱతో బోరాడ నావిక్రమం

బవురా! మేల్తఱివేచి తానెఱవు నేడాతండు ధీరుండునూ

ఆపదవచ్చినప్పు డినుమంతయునొవ్వక జాగరూకుడై

యోవుచు శోభనార్థమయి యొప్పు బ్రయత్నము లాచరించుచున్

సైవుచు నడ్మ గష్టమయిన న్వెలుగొందెడు నమ్మహాత్ముడో

భూప! ధురంధరుండు రివువుంజము నాతడు గెల్చినాతడే.

ఇక, ఋతుసంహారము నందలి శృంగారపద్యశైలి తీరు నారయునది.

ఒండొక పువ్వుబోడి నురతాగ్రతచే నొడలెల్ల డస్సి తా

మెండుగ రాత్రియెల్ల రతి మేల్కొనుట న్నయనంబు లెఱ్ఱనై

మండగ గొప్పువీడి భుజమండలి దాండవ మాడుచుండ నీ

రెండ ప్రభాతవేళ మెయికింపుగ దాకగ నిద్రవోయెడిన్.

ఈ లక్ష్మినరసింహరాయకవి కవిత యాత్మానందము నుద్దేశించి వ్రాయబడిన దగుటచే దెలుగు ప్రజలు హెచ్చుగా జూడలేదు. ఈయన ధోరణిలో వ్యుత్పత్తికంటె బ్రతిభాభ్యాసముల సాలు మిక్కిలిగా నుండును. అందచందములకంటె నావేశము హెచ్చు.

                         _______________