ఆంధ్ర రచయితలు/అల్లమరాజు సుబ్రహ్మణ్యకవి

వికీసోర్స్ నుండి

అల్లమరాజు సుబ్రహ్మణ్యకవి

1831 - 1892

ఆరామ ద్రావిడ బ్రాహ్మణుడు. హరితసగోత్రుడు. తల్లి: గంగమాంబ. తండ్రి: రంగశాయి. జన్మస్థానము: పిఠాపురము కడనున్న చేబ్రోలు. జననము: 1831- వికృతి సంవత్సరము. నిర్యాణము: 1892. గ్రంథములు: 1. శ్రీకృష్ణభూపతిలలామ శతకము (1853) 2. శేష ధర్మములు (ఆరాశ్వాసముల పద్యకావ్యము). (1867) 3. పాపయమంత్రి శతకము. 4. ఆత్మబోధము (శంకరకృతికి దెలుగుపద్యములు) (1875) 5. మణిధ్వజచరిత్రము (గ్రంథము లభింపలేదు) 6. సింహాద్రి రామాధిప శతకము (1876) 7. భద్రా పరిణయము (1878) 8. శ్రీకృష్ణ లీలా కల్యాణము (1878) 9. చాటుధారా చమత్కారసారము.

ఒకప్పుడు మాడభూషి వేంకటాచార్యుల వారు పీఠికాపుర సంస్థానమునకు శ్రీ గంగాధర రామరాయేంద్రుని దర్శనార్థము వచ్చిరి. అప్పుడు అల్లమరాజు సుబ్రహ్మణ్యకవిగారు నిండుకొలువులోనుండి "ఇక" అను పదముతో నారంభించి కందములో, ప్రభుకీర్తిని వర్ణింపుడని యాచార్యులవారితో ననిరట. వేంకటాచార్యులవారు గొప్ప యాశుకవి. వెంటనే యిట్లు చదివిరి.

క. ఇక నెవ్వరికీర్తులు నీ
ప్రకటగుణుండైన రామరాయ క్ష్మాభృ
త్సుకృతి జనపోషకుని కీ
ర్తికి సరిగారావుసుమ్ము పృథ్వీస్థలిలోన్.

సుబ్రహ్మణ్యకవి "మీ పద్యములో దప్పుకల"దని యాచార్యుల వారి నాక్షేపించెను. 'తప్పులే' దని యాయన గంభీరముగ జెప్పివైచెను. అపుడు సుబ్రహ్మణ్యకవి 'ఇదిగో' నని యీ పద్యమును పఠించెను.

ఇక విను నీయశమునకు ద
లకి శశి కృశుడయ్యును మఱల బెరుగ వేర్వె

ల్ల కియు గొనెనొకొ తొలిమల కె
లకులను శ్రీరామరాయ లలితశ్రేయా !

"ఇక" సబిందుక శబ్దమగుట దక్కిన చరణములు సబిందుక ప్రాసముతో నడుపవలెనని తక్షణమున వేంకటాచార్యులవారికి దట్టియుండక పోవచ్చును. గంగాధర రామారావుగారు గడుసురాజు. "ప్రబంధకవిత్వమున మీరధికు" లని సుబ్రహ్మణ్యకవిని స్తుతించెను. "ఆశుకవితలో మీ రధికు" లని యాచార్యకవి నభినందించెను.

సుబ్రహ్మణ్యకవి చమత్కృతి కప్పు డట్లనెగాని సబిందుక నిర్బిందుక ప్రాససాంకర్యముచేయనని పట్టుదల పట్టిన కవికాడు. ఆయన భద్రాపరిణయములో (ద్వితీయాశ్వాసము 75 పద్యము చూ.) నెన్నో దీని కుదాహరణము లున్నవి.

ఈ సుకవివరుని చాటుపద్యమణులు తెలుగున వ్యాప్తముగ నున్నవి. ఈయన కాట్రావులపల్లి నూతులపై నొక పద్యము చెప్పెను.

దేవాసురు లబ్ధిదరువ
నావిర్భూతమయి హాలహల మపుడు మహా
దేవునకున్ భీతిలి కా
ట్రావులపలి నూతులందు డాగెంజుండీ.

మాడుగల్లు సంస్థానమునకు బోయినపు డక్కడ నొక్క నియోగికవి వైదికకవులనుబట్టి పడదిట్టుచుండెనట. అప్పుడు సుబ్రహ్మణ్యకవి పట్టలేక యీపద్యము చెప్పెను.

చందనశాఖికన్న విరసంబుగ బూరుగ మేలటన్న ఠీ
విం దగినట్లు వైదికకవిత్వసుధారస ధారలెల్ల జె
ల్వొందగ భూతలంబున నియోగికవిత్వముతోడ సాటిరా
దందురు బెట్టిదంబగునటందురు కొందఱు మూడమానవుల్.

సూరపరాజు మల్లపరాజు అనునాయన గంగాధర రామారావుగారి మిత్రుడు. సుబ్రహ్మణ్యకవి యీయనను జూడబోయెను. "శ్రీరావు వేంకటమహీపతి గంగాధర రామారావు" అనివరుసగా వచ్చునటులొక కందము చెప్పుడని మల్లపరాజుగా రడిగిరి. అప్పుడు వీరిటులు చెప్పిరి.

శ్రీధర! శౌరీ! వైకుం
ఠా! ధర శ్రీరావువేంకటమహీపతి గం
గాధరరామారాయ
క్ష్మాధరునిం బ్రోవు మెపుడు కరుణాదృష్టిన్.

ఈచాటువులు వేటూరి ప్రభాకర శాస్త్రిగారు సేకరించి వెలువరించిరి. సుబ్రహ్మణ్యకవిది పండితవంశము. ఇతని తండ్రి రంగధామాద్యుడు. నారాయణాచల మాహాత్మ్య కృతికర్త. కవిచోర చంద్రోదయ, సత్యభామా విలాసాదులు రచించిన రామకృష్ణకవి కితడు భిన్నోదర సోదరుడు. సుబ్రహ్మణ్యకవి నాగాభట్ల నరసకవితో నుభయభాషల పఠించెను. చాలావఱకు స్వయంకృషి చేసి సాహిత్యనిష్ణాతుడాయెను. మనుచరిత్రము-ఆముక్తమాల్యద వీరి కభిమానిత గ్రంథములు. జ్యోతిషభాగముకూడ నీయన చక్కగనెఱిగెను. అదికొంత తొలుత జీవనాధారమైనది. క్రమముగా గవిత్వరచనమే ప్రధానవృత్తిగా బెట్టుకొని రాజ దర్శనము చేయుచు సుబ్రహ్మణ్యకవి తనలేవడి నెట్టుకొనుచుండెను. 1853లో మాడుగల్లు సంస్థానాధిపతియగు శ్రీకృష్ణభూపతిపై నీకవి సీసపద్యములశతక మొకటి చెప్పెను. అది "శ్రీకృష్ణభూపతి లలామశతకము." అప్పటికి గవియీ డిరువది రెండేడులు. మాడుగల్లుసంస్థాన పండితులు మనకవి నెన్నో తిప్పలు పెట్టిరట. మంత్రిప్రెగడ సూర్యప్రకాశరాయకవి మున్నగువారు నాడు తత్సంస్థాన విద్వత్కవులు. అక్కడివారు "కుట్రయొనర్చె లేమ తన గుబ్బలయుబ్బు సహింపలేమిచేన్." అను సమస్య నిచ్చి, నిలుచుండగా బూరింపుమనిరి. అది యీకవిచే నిటు పూరింపబడియె.

వట్రువహారరత్నములు వన్నె నగల్ పులిమీదవచ్చు నా
పుట్ల యటన్నరీతి జిగి బొల్పగు చూచుకలీల జూచుచున్

దొట్రిలనేల? కేలగొని గోగులనొక్కుము నాథయంచు దా
గుట్రయొనర్చె లేమ తనగుబ్బలయుబ్బు సహింపలేమిచేన్.

ఇట్టి పరీక్షల కాగిన సుబ్రహ్మణ్యకవిని మాడుగల్లుఱేడు మెచ్చి యాస్థానకవిగా నర్థించెను. కాని జన్మస్థానమున కాయూరు దూరమగుటచే నంగీకరింపక కవిగారు వార్షికబహూకారము వచ్చునటుల ప్రార్థించెను. 1853 మొదలు 1869 వఱకు నాసంస్థాన వార్షికవిత్తము సుబ్రహ్మణ్యకవి పొందుచుండెను.

1869 లో పీఠికాపుర సంస్థానమున మాసవేతన మేర్పడినది. గంగాధరరామరాయేంద్రు డీకవిప్రతిభ దెలిసికొని సన్మానించెను. "భద్రాపరిణయము" అను ప్రౌఢాంధ్ర ప్రబంధ మా మహారాజున కంకితము గావించెను. ఏత త్కృతిప్రదానవిషయ మీ పద్యము తెలుపును.

శాలివాహనశక సంవత్సరము లిందు
          గగనకరీందుసంఖ్యల నెసంగ
జరుగు ప్రమాధివత్సర మార్గశిరశుద్ధ
          సప్తమీ శుక్రవాసరమునందు
శ్రీ మహారాజభూషిత చరిత్రుండు సూ
          ర్యారాయభూనాయకాత్మజుండు
రావు గంగాధరరామరాయక్షమా
          ధవుడు సుబ్రహ్మణ్య కవివరునకు

బీఠపురదుర్గ సౌధంపు బెద్దకొలువు
నందు భద్రాపరిణయ కావ్యంబు నంది
యధికతరమాన్యభూమి నెయ్యూఱులును సు
వర్ణ వలయంబులును సేలువలు నొసంగె.

ఈ భద్రాపరిణయము నాలుగాశ్వాసములు కలది. కాణాదము పెద్దన సోమయాజి భద్రాపరిణయమను మాఱు పేరుగల ముకుందవిలాస ప్రబంధము రచించెనని వీరేశలింగముపంతులు గారు వ్రాసిరి. ఆ ముకుంద విలాసములోని కవితారీతు లీ సుబ్రహ్మణ్యకవి కొన్ని సంగ్రహించెను. అందలిపద్యములు పద్యములుగా గొన్ని యిందున్నవి. కథలో గూడ బెద్ద మార్పులేదు. భావములు చాలవఱకు దానిని బోలినవే. ఈవిషయము శ్రీ నడకుదుటి వీరరాజుగారును వెల్లడించిరి. ఆకవి కవితపైగల యభిమానమున నీసుబ్రహ్మణ్యకవి యిటులు చేసినాడని సమర్థించు కొనవలయును. పురాణపండ మల్లయ్యశాస్త్రిగారి వ్యాఖ్యతో 1912 లో నీగ్రంథము నేటి పీఠికాపుర ప్రభువు లావిష్కరించిరి. సుబ్రహ్మణ్యకవి సాధారణకవి కాడనుట కతనిగూర్చినకథలు చాలగలవు. పెద్దపెద్ద సంస్థానములకు బోయి యతడుచూపిన విచిత్రాశుకవితాదు లందులకు దార్కాణ. ఆయన 'చాటు ధారాచమత్కారసార' మనునొక గ్రంథము సంధానించెను. అందు సంస్కృతమున జాటువులుగ నుండి పండితులచే బరంపరాయాతములై యున్న గంభీరార్థకములగు శ్లోకములకు సులభమైన యర్థము వ్రాయబడియున్నది. ప్రాచీనాధునాతనపద్యము లెన్నో యందున్నవి.

కమలాకర కమలాకర
కమలాకర కమల కమల కమలాకరమై
కమలాకర కమలాకర
కమలాకరమైనకొలను గని రా సుదతుల్.

ఈపద్య మిచ్చి మాడుగుల సంస్థానములో నెవరో పండితులు సుబ్రహ్మణ్యశాస్త్రిగారి నర్థము చెప్పుమనిరట. నాటి వారిలో నిట్టి పాషాణములను బ్రద్దలుగొట్టు దిట్టలు చాలమంది యుండువారు. మన శాస్త్రీగారు వెంటనే దానికర్థము వివరించిచెప్పిరి. తరువాత సేకరించిన కొన్ని చాటువులకు వ్యాఖ్య వ్రాసి "చాటుధారా చమత్కారసారము" వెలువరించిరి.

జయంతి రామయ్యపంతులుగారికి వీరికిని మైత్రి. రామయ్యపంతులుగారి ప్రోత్సహమువలన నీకృతి రచితమైనది. ఆ విషయమును నిస్పష్టముచేయు శ్లోక మీక్రిందిది విధిగా నుదాహరింపదగినది.

శ్లో. ఏతాదృగ్భిర్గుణ మణిగణై ర్భూషి తేనై వతేనా
నుజ్ణాంప్రాప్య శ్రితహితకరీం ప్రేమవన్మానపూర్వాం
అల్లంరాజాస్వయమణి రసౌ రంగశాయ్యార్యపుత్ర
స్సుబ్రహ్మణ్యన్సుకవి రకరో చ్చాటుధారార్థసారమ్"

రామయ్యపంతులుగారి నుద్దేశించి సుబ్రహ్మణ్యకవి 'అంతర్లాన' యిటులు చెప్పెను. ప్రశ్నోత్తరములు లోపలనే నిగూడముగా నుండు సమస్యకు 'అంతర్లాన' యనిపేరు.

చెప్పినాడ రెండు చిత్రోత్తరము లిందు
నల జయంతి రామయార్యవరుని
సువచనమున నే దడవిలో జరించు నె
ద్దీశ్వరునికి బ్రియము నెక్కు డనగ.

సుబ్రహ్మణ్యకవి యాధునికుడగుట గ్రంథవిమర్శములనుగూడ వ్రాసెను. శ్రీమన్మాడభూషి వేంకటాచార్యకవి రచించిన 'భరతాభ్యుదయము' న దోషము లున్నవని సప్రమాణముగ జూసి రాజయోగి పత్రికలో వెలువరించెను. కానియిక్కవి రేఫద్వయమైత్రి, అఖండయతి, కొన్ని ప్రాచీనలాక్షణికానభిమత సంధులు విడచి పెట్టలేకపోయెను. అదియటుండె, సుబ్రహ్మణ్యకవి ప్రతిభావ్యుత్పత్తులు సమానముగా గల కవివరుడు. వారిపద్యధారకు జివర నొక యుదాహరణమిచ్చి విడిచెదను.

పగడపుమోవితో జిలుగుబయ్యదతో విడియంపుసొంపుతో
నిగనిగ నుబ్బుసిబ్బెముల నిగ్గులతో దగుగుబ్బదోయితో
సొగసగువేణితో బెళుకు చూపులతో లలిలేతనవ్వుతో
జిగివగగుల్కవచ్చి యొక చేడియచూచె ద్రిలోకమోహనున్
                                               భద్రాపరిణయము------


                   ----------------------------