అర్జునుండు పుత్త్రఘాతి యగు నశ్వత్థామ నవమానించుట - తరువాయి భాగము
వ. ఇ ట్లస్త్రద్వయంబు నుపసంహరించి ధనంజయుండు ద్రోణనందనుం గూడ నరిగి తఱిమి పట్టుకొని రోషారుణిత లోచనుండై యాజ్ఞికుండు రజ్జువునం బశువుం గట్టిన చందంబున బంధించి శిబిరంబు కడకుం గొని చని హింసింతునని తిగిచినం జూచి హరి ఇట్లనియె. (1-152)
ఉ. మాఱు పడంగలేని యసమర్థుల సుప్తుల నస్త్రవిద్యలం
దేఱని పిన్నపాఁపల వధించె నిశీథమునందుఁ గ్రూరుఁడై ;
పాఱుఁడె వీఁడు ? పాతకుఁడు ! ప్రాణభయంబున వెచ్చ నూర్చుచుం
బాఱెడి వీనిఁ గావకు కృపామతి నర్జున ! పాపవర్జనా ! (1-153)
చం. వెఱచినవాని దైన్యమున వేఁదుఱు నొందినవాని నిద్ర మై
మఱచినవాని సౌఖ్యముగ మద్యముఁ ద్రావినవాని భగ్నుఁడై
పఱచినవాని సాధు జడభావము వానినిఁ గావుమంచు వా
చఱచినవానిఁ గామినులఁ జంపుట ధర్మము గాదు ఫల్గునా ! (1-154)
శా. స్వప్రాణంబుల నెవ్వఁడేనిఁ గరుణా సంగంబు సాలించి య
న్య ప్రాణంబులచేత రక్షణము సేయున్, వాఁ డధోలోక దు:
ఖ ప్రాప్తుండగు రాజదండమున సత్కల్యాణుఁ డౌ నైన నీ
విప్రున్ దండితుఁ జేయుమేటికి మహా విభ్రాంతితో నుండఁగన్. (1-155)
వ. అని యివ్విధంబునఁ గృష్ణుఁ డానతిచ్చిన బ్రాహ్మణుండు (కృతాపరాధుండైనను) వధ్యుండు గాఁడను ధర్మంబుఁ దలఁచి చంపక ద్రుపదరాజ పుత్త్రికిఁ దన చేసిన ప్రతిజ్ఞం దలంచి బద్ధుండైన గురునందనుం దోడ్కొని కృష్ణుండు సారథ్యంబు సేయ శిబిరంబు కడకు వచ్చి, (1-156)
కం. సురరాజ సుతుఁడు సూపెను, దురవధి సుతశోక యుతకు ద్రుపదుని సుతకున్
బరిచలితాంగ శ్రేణిం, బరుష మహాపాశ బద్ధ పాణిన్ ద్రౌణిన్. (1-157)
వ. ఇట్లర్జునుండు తెచ్చి చూపిన బాలవధజనిత లజ్జాపరాఙ్ముఖుండైన గురుని కొడుకుం జూచి మ్రొక్కి (సుస్వభావ) యగు ద్రౌపది యిట్లనియె. (1-158)
మ. పరఁగన్ మా మగవారలందఱును మున్ బాణ ప్రయోగోఫ సం
హరణాద్యాయుధ విద్యలన్నియును ద్రోణాచార్యుచే నభ్యసిం
చిరి ; పుత్త్రాకృతి నున్న ద్రోణుఁడవు ; నీ చిత్తంబులో లేశమున్
గరుణాసంగము లేక శిష్యసుతులన్ ఖండింపఁగాఁ బాడియే ? (1-159)
కం. భూసురుఁడవు బుద్ధి దయా, భాసురుఁడవు శుద్ధవీర భట సందోహా
గ్రేసరుఁడవు శిశుమారణ, మాసుర కృత్యంబు ధర్మమగునే తండ్రీ ! (1-160)
శా. ఉద్రేకంబున రారు శస్త్రధరులై, యుద్ధావనిన్ లేరు, కిం
చిద్ ద్రోహంబును నీకుఁ జేయరు, బలోత్సేకంబుతోఁ జీఁకటిన్
భద్రాకారులఁ జిన్నిపాఁపల రణప్రౌఢక్రియాహీనులన్
నిద్రాసక్తుల సంహరింప నకటా ! నీ చేతు లెట్లాడెనో ? (1-161)
ఉ. అక్కట ! పుత్త్రశోకజనితాకులభావ విషణ్ణచిత్తనై
పొక్కుచు నున్న భంగి నినుఁ బోరఁ గిరీటి నిబద్ధుఁ జేసి నేఁ
డిక్కడ కీడ్చి తెచ్చుట సహింపనిదై భవదీయమాత నేఁ
డెక్కడ నిట్టి శోకమున నే క్రియ నేడ్చుచుఁ బొక్కుచున్నదో ? (1-162)
వ. అని కృష్ణార్జునులం జూచి యిట్లనియె. (1-163)
ఉ. ద్రోణునితో శిఖిం బడక ద్రోణ కుటుంబిని యున్నదింట, న
క్షీణ తనూజ శోక వివశీకృతనై విలపించు భంగి నీ
ద్రౌణిఁ దెరల్చి తెచ్చుటకు దైన్యము నొందుచు నెంత పొక్కునో
ప్రాణ వియుక్తుఁడైన నతిపాపము ; బ్రాహ్మణహింస మానరే ? (1-164)
కం. భూపాలకులకు విప్రులఁ , గోపింపఁగఁ జేయఁదగదు, కోపించినఁ ద
త్కోపానలంబు మొదలికి, భూపాలాటవులఁ గాల్చు భూకంపముగాన్. (1-165)
వ. అని యిట్లు ధర్మ్యంబును సకరుణంబును నిర్వ్యళీకంబును సమంజసంబును శ్లాఘ్యంబునుంగా ద్రౌపది పలుకు పలుకులకు ధర్మనందనుండు సంతసిల్లె. నకుల సహదేవ సాత్యకి ధనజయ కృష్ణులు సమ్మతించిరి. సమ్మతింపక భీముం డిట్లనియె. (1-166)
చం. కొడుకులఁ బట్టి చంపెనని కోపము నొందదు, బాలఘాతకున్
విడువు మటంచుఁ జెప్పెడిని, వెఱ్ఱిది ద్రౌపది, వీఁడు విప్రుఁడే ?
విడువఁగ నేల ? చంపుఁడిటు వీనిని మీరలు, చంపరేని నా
పిడికిటి పోటునన్ శిరము భిన్నము సేసెదఁ , జూడుఁ డిందఱున్. (1-167)
వ. అని పలికిన నశ్వత్థామకు ద్రౌపది యడ్డంబు వచ్చె. భీముని సంరంభంబు సూచి హరి చతుర్భుజుండై రెండు చేతుల భీముని వారించి కడమ రెండు చేతుల ద్రుపదపుత్త్రికను దలంగంద్రొబ్బి, నగుచు భీమునికిట్లనియె. (1-168)
ఉ. అవ్యుఁడు గాఁడు వీఁడు ; శిశుహంత దురాత్మకుఁ డాతతాయి హం
తవ్యుఁడు బ్రహ్మబంధుఁ డగుఁ దప్పదు నిక్కము ; "బ్రాహ్మణో న హం
తవ్య" యటంచు వేదవిదితంబగుఁ ; గావున ధర్మదృష్టిఁ గ
ర్తవ్యము వీనిఁ గాచుట యథాస్థితిఁ జూడుము పాండవోత్తమా ! (1-169)
వ. అని సరసాలాపంబులాడి పవన నందను నొడంబఱచి యర్జునుం జూచి "ద్రౌపదికి నాకు భీమసేనునకును సమ్మతంబుగ మున్ను నీ చేసిన ప్రతిజ్ఞయు సిద్ధించునట్లు నా పంపు సేయు"మని నారాయణుం డానతిచ్చిన నర్జునుండు తదనుమతంబున, (1-170)
శా. విశ్వస్తుత్యుఁడు శక్రసూనుఁడు మహా వీరుండు ఘోరాసిచే
నశ్వత్థామ శిరోజముల్ దఱిఁగి చూడాంతర్ మహారత్నమున్
శశ్వత్కీర్తి వెలుంగఁ బుచ్చుకొని పాశవ్రాత బంధంబులన్
విశ్వాసంబున నూడ్చి ద్రొబ్బె శిబిరోర్వీ భాగముం బాసిపోన్. (1-171)
కం. నిబ్బరపు బాలహంతయు, గొబ్బునఁ దేజంబు మఱియుఁ గోల్పడి నతుఁడై
ప్రబ్బిన చింతన్ విప్రుఁడు, సిబ్బితితో నొడలి గబ్బు సెడి వడిఁ జనియెన్. (1-172)
ఆ.వె. ధనముఁ గొనుట యొండె తల గొఱుగుట యొండె, యాలయంబు వెడల నడచుటొండె
కాని చంపఁదగినయట్టి కర్మంబు సేసినఁ , జంపఁదగదు విప్రజాతిఁ బతికి. (1-173)
వ. ఇ ట్లశ్వత్థామం బ్రాణావశిష్టుం జేసి వెడలనడచి పాండవులు పాంచాలీసహితులై పుత్త్రులకు శోకించి మృతులైన బంధువులకెల్ల దహనాది కృత్యంబులు జేసి జలప్రదానంబు సేయు కొఱకు స్త్రీల ముందల నిడుకొని గోవిందుండునుం దారును గంగకుం జని తిలోదకంబులు సేసి క్రమ్మఱ విలపించి హరిపాద పద్మజాత పవిత్రంబులైన భాగీరథీ జలంబుల స్నాతులై యున్నయెడం బుత్త్రశోకాతురులైన గాంధారీ డృతరాష్ట్రులను గుంతీద్రౌపదులను జూచి మాధవుండు మునీంద్రులుం దానునుం బంధుమరణ శోకాతురులైన వారల వగపు మానిచి మన్నించె, నివ్విధంబున, (1-174)
శా. పాంచాలీ కబరీ వికర్షణ మహాపాప క్షతాయుష్కులం
జంచద్గర్వుల ధార్తరాష్ట్రుల ననిం జంపించి గోవిందుఁ డి
ప్పించెన్ రాజ్యము, ధర్మపుత్త్రునకుఁ గల్పించెన్ మహాఖ్యాతిఁ, జే
యించెన్ మూఁడు తురంగమేధములు దేవేంద్ర ప్రభావంబునన్. (1-175)