అబలా సచ్చరిత్ర రత్నమాల/కర్ణాటి

వికీసోర్స్ నుండి

కర్ణాటి

ఈ ప్రౌడకవయిత్రి నామమేమోకాని యీమె కర్ణాట దేశస్థురా లయినందువలన నీమెను కర్ణాటియనియే వాడుదురు. ఈమెను గురించి సూక్తిముక్తావలిలో నిట్లు వ్రాసియున్నది:-

శ్లో. సరస్వతీవ కర్ణాటీ విజయాంకా జయత్యసౌ
   యా వైదర్భగిరాంవాస: కాళిదాసా దనంతరం.

అర్ధము:- 'విజయ' యనుబిరుదుగల 'కర్ణాటి' సరస్వతివలె జయమందుచున్నది. కాళిదాసు తరువాత నీమెయందే వదర్భీరీతి వాసము చేయుచున్నది.

ఈమె తన రమ్యకవిత్వముచే నందరు కవులను గెలిచి 'విజయ' యను బిరుదును చెందినది. గనుక పూజ్యులగు వ్యాస వాల్మీకులను దప్ప మరి యితరకవుల నేరిని మెచ్చకయుండెను. ఈమెదియని చెప్పబడెడి యీక్రింది ప్రౌడోక్తివలన నీమె 'విజయ' యను బిరుదు అన్వర్ధకమే యని తోచకమానదు:-

శ్లో. ఏకోభూన్నలినా త్తతశ్చ పులినా ద్వల్మీక తశ్చాపర:
   తేసర్వే కవయోభవన్తి గురవస్తేభ్యో నమస్కుర్మహే;
   అర్వాంచో యది గద్యపద్యరచనై శ్చేతశ్చమత్కుర్వతే
   తేషాంమూర్ధ్ని దదామి వామచరణం కర్ణాట రాజప్రియా.

అర్థము - పూర్వకవులయిన బ్రహ్మ, వ్యాస, వాల్మీ కాదులు నాకు గురువులు, వారికి నమస్కారము చేసెదను: కాని యాథునికు లెవరయిన గద్యపద్యరచనచేత జిత్తమును రంజింపజేసెద మనినయెడల వారిశిరస్సుపయి నాయెడమకాలు మోపుచున్నాను.

ఈశ్లోకములోని 'కర్ణాటరాజప్రియా' పదమువలన నీమె 'మోహనాంగియా' యేమి యని సంశయము కలుగు చున్నది. మోహనాంగి కృష్ణదేవరాయుల కూతురనియు, రామరాజు భార్యయనియు, కవయిత్రియనియు వాడుకగలదు. ఐనను ఇందునుగురించి శోధన చేయవలసి యున్నది.


_______