హిమబిందు/ప్రథమ భాగం/1. వణిక్సార్వభౌముడు

వికీసోర్స్ నుండి

హిమబిందు

· చారిత్రాత్మక నవల ·

ప్రథమ భాగం

1. వణిక్సార్వభౌముడు

కృష్ణవేణీ ప్రవాహమున నీడ చూచుకొనుచున్న శ్రీ ధాన్యకటక దుర్గాధి లక్ష్మికి, వణిక్సార్వభౌముడగు చారుగుప్తుని మహాసౌధము శ్రవణావతంసమై విరాజిల్లుచుండెను. అచట కిన్నూరు ధనువుల దూరమందున్న మహాసంఘా రామచైత్యమును, చారుగుప్తుని సౌధమును చక్కదనమున నక్కా సెల్లెండ్రవలె నున్నవి. నున్ననై నిగనిగలాడుతూ పాలరాతిగోడలపై చిత్రించిన బుద్ధదేవ జాతక గాథలతో నలరారు చారుగుప్తప్రాసాదము కనులు చల్లజేయుచూ రూపెత్తిన శిల్పలక్ష్మివలె నున్నది.

చారుగుప్తుడానాడు వ్యాఘ్రాజినము పఱచిన దంతపుబీట పై నధివసించి, తూలికోపధానములపై నొఱగి, గోష్టపాలకుడగు నింద్రగోపునితో సంభాషించుండెను.

చారు: మన శూరనేత్ర సంజీవకములు ఉజ్జయినిలో పందెముగెలిచి, ఱేనిచే బంగారు కట్లబండిని బహుమానముగా దెచ్చినమాట నిజమేకాని, కామందక కుల పాలకముల కవి తీసికట్టే. మన జతల నన్నిటిని మా మేనల్లుడు, సమవర్తి, పరీక్షించి కామందక కులపాలకయుగళమే అన్నిటికి మిన్నయని తేల్చినాడు. సార్వభౌముని జన్మదినోత్సవము నాటి పందెములలో ఆ జతనే కట్టినచో మనకు జయము లభించునన్నాడు. మఱి, నీ యభిప్రాయమేమో!

ఇంద్ర: చిత్తము. తమ మేనల్లుడుగారా జత నిదివర కెన్నడైన బండి తోలి చూచిరా యని సంశయించుచున్నాను.

చారు: ఆ! రెండుసార్లు బండి తోలినాడు. స్నేహితుడగు శశాంక వసువుగారి మ్లేచ్ఛాశ్వముతో సమానముగ రెండు గోరుతములు[1] పరువెత్తెనట. విజ్ఞానకంఠీరవుడుగూడ సుళ్ళు, రూపురేఖలు పరిశీలించి ఉత్తమోత్తమములని నుడువుటచేతనేకదా ఈ ఎడ్లజతలకు పదునేనువందల పణాలిచ్చి, కొంటిని.

ఇంద్ర: చిత్తము. అయినచో అంత బలవత్తరమైన జతను మన సారథి నడపగలడా? చారు: నిజమే. ఇదివరకు చారుగుప్తునితో పందెమువేసి యెవ్వరును జయమొందలేదు. ఇప్పుడు ఈ కోడెల నడుపు మగటిమి గలవాడు లేక మన మోడిపోయిన తలవంపులు. సమవర్తియే బండితోలుగాక.

ఇంద్ర: కాని....

చారు: “కాని” యని మాట్లాడకూరకుండెదమేమి? అంతకన్న ధాన్యకటక నగరమున సారథి యెవ్వడు? అతని నిదివరకొక్కరైన మఱి ఓడించిరా? ఎంత పొగరుగిత్తలనైన నాతడు సులభముగ లోబరచుకొన లేదా?

ఇంద్ర: చిత్తము. దేవరకు పూర్తిగా నిష్టముండిన నా అభ్యంతర మేమియులేదు. ఇక నాకనుజ్ఞ.

అని ఇంద్రగోపుడు చేతుల జోడించి వీడ్కొని చన, చారుగుప్తుడు యేమేమియా యాలోచించు కొనుచుండెను. ధాన్యకటక నగర వర్తకులలో ముఖ్యుడును, వణిక్సంఘాధి పతియునగు చారుగుప్తునకు పందెములన్నచో బ్రాణము. అతని గజాశ్వవృషభశాలలలో, చక్రవర్తిశాలలలో నున్న మృగముల కెంతమాత్రము వెనుదీయని ప్రాణులున్నవి. అతని శకటములు దేవవిమానములు. ఆతని సేవకులు పరాక్రమవంతులగు యక్షపుత్రులే. ధనరాసులు సమకూర్పనెంతయో కష్టపడు చారుగుప్తుడు భోగముల ననుభవించుటలో ఆ ధనరాసుల నశ్రమముగా వెచ్చించును.

హిమబిందు కుమారిని మహారాజు నింటికోడలిని కావింప నెంచియున్నాడు. సౌందర్యఖనియు, ఆనందకందము, తన బహిఃప్రాణము నగు హిమబిందుకుమారి మహారాజ్ఞి కాకపోయినచో తన కుబేరవైభవము గాల్పనా? తనతనయకాక, భరతఖండాన ధాన్యకటక సింహాసనాసీనురాలగుట కింక నేబాల తగును? రాజకుమారిక లుందురుగాక! వారు తెచ్చెడిదేమి, ఇచ్చెడిదేమి! సర్వవిద్యాపరిపూర్ణ సర్వకళాశోభిత, దివ్యసుందరగాత్రయగు తన బాల, హిమబిందుకుమారి. చక్రవర్తులు కని విని యెరుగని మహానిధులతో, అతులవైభవముతో వచ్చుచుండ ఏ సార్వభౌముడు మోకాలొడ్డును! ఈ కార్యసిద్ధికై తాను రెండవ చాణక్యదేవుడు గావలసివచ్చిన వచ్చుగాక.

ఇట్టి యాలోచనలనేకములు చారుగుప్తుని హృదయాకాశాన వెలుగువలె ప్రజ్వరిల్లి పోయినవి. ఆ ఆశయే అతని తపస్సు; ఆతని యైశ్వర్య మాతపస్సాధనము; అతని జీవిత మా తపస్సిద్ధి కంకితమైనది.

చారుగుప్తుడు సన్నగా పొడువున ధనువునకొక గుప్పెడు తక్కువగా నుండును. తప్తకాంచనవర్ణమువాడు. కమ్మెచ్చులు తీసినట్లుండు అంగసంపద గలవాడు. దీర్ఘమై చివర వంగిన గరుడనాసికవాడు. అతివిశాలమగు ఫాలము గలవాడు. గరుడపక్షికి వలె నాసికామూలమున లోతులై ఆతని కన్నులు దీర్ఘములై విశాలములై తీక్షణములై ఎదుటివాని మనసు లోతుల జొఱబాఱుచుండును. పెద్దదగు నాతని బట్టతలపై, అచ్చటచ్చట తెల్లని వెండ్రుకలు లంకలలోని రెల్లుపూవుల జ్ఞప్తిగొల్పుచుండును. మెడలోని ఆణిముత్యముల పేరును, స్వచ్ఛమగు యజ్ఞోపవీతము నాతని బంగారు వన్నెకు మెరుగులు దిద్దినవి. సువర్ణదీప శోణరత్నాలు, సింహళదేశపు గరుడపచ్చలు నాతని కుండలముల మెరుగు లీనుచు కంఠరేఖలలో లీనమగుచుండును. “బాలనాగీ! బాలనాగీ! చిరంజీవను తోడ్కొనిరా” యని చారుగుప్తుడు కేకవేసెను.

చారుగుప్తుడు కూర్చుండిన మందిరాన గోడలన్నియు రమణీయచిత్ర లేఖనావిలసితములు, రత్నకంబళాచ్ఛాదితములు. నలువైపుల మణిఖచితధూప కరండాలనుండి అగరు జవ్వాజి కస్తూరి పునుగు మంచిగంధపు పొట్టు యందుగుబంక మొదలగు ధూపద్రవ్యముల పొగలు సువాసనల వెదజల్లుచు చిన్న మేఘాలరీతి ప్రసరించుచున్నవి.

ఇంతలో ఘల్లుఘల్లని బంగారు చిరుమువ్వల చప్పుడు విననైనది. అంతఃపురమున కేగు ద్వారమధ్యమునుండి పూలప్రోవు, రూపముదాల్చిన చంద్రకిరణము, ఒక్కబాలిక, కొండవాగువలె ప్రవహించివచ్చి చారుగుప్తుని యెదుట వంగి పాదాల నంటినది.

చారు: సత్వరసామ్రాజ్య సింహాసన సిద్ధిరస్తు. అమ్మా! రేపటి ఉత్సవములకు పోయెదవుగాదా?

హిమబిందుకుమారి: అత్తయ్య, అమృతలతాదేవి, రమ్మని వార్తపంపినది నాయనగారూ

చారు: వారి మండపమునకా?

హిమ: అవును.

చారు: పుణ్యాత్మురాలు మీతల్లి నిర్యాణమైన ఈమూడు సంవత్సరాలనుండి మన మండపము కళాహీనమైన పుష్పాలులేని వృక్షమైనది. తల్లీ! ఈ దీర్ఘవిచారమున కింక స్వస్తి చెప్పుదము. మన హృదయాల ఆవరించిన మేఘాలుమాయమగు శుభసమయ మరుదెంచుచున్నది. బంగారు తల్లీ! నీ యమూల్య విభూషణాలన్నియు నలంకరింప పరిష్కర్త్రి తారాదత్త కాజ్ఞ నిచ్చితిని. మన మండపమును హర్షుడను మండనకుడు అలంకరించుచున్నాడు. మా చెల్లెలు అమృతలతను నీవే యాహ్వానింపుము. నీముత్తవ ముక్తావళీదేవియు నిన్ను వెంబడించుగాక. అప్సరసలతో లక్ష్మివలె చెలికత్తెలతో నందవతరింపుము తల్లీ!

హిమ: నాయనగారూ! మనబండిని బావ సమవర్తి తోలునటకాదూ!

చారు: అవునమ్మా, అవును సమవర్తి శకటపరీక్షలో విజయ మంద గలడు. ఆ ఉత్తమ వృషభయుగ్మము శ్రీకృష్ణశాతవాహన మహారాజకుమారులకు నివేదనమగుగాక.

హిమ: నా కేదో భయము కలుగుచున్నది నాయనగారూ!

చారు: చిట్టితల్లీ, ఆ మాటలేమిటే! మనధాన్యకటక పురిని జరుగు మహోత్సవమునకుబోవ చారుగుప్తునితనయ భయపడుటేమి!

హిమ: అదికాదండీ, ఏదో భయము. మహోత్సవమునకు బోవ భయము కాదు.

చారు: వెఱ్ఱితల్లివి! వెళ్ళిపాడుకొనుము. వీణ బాగుగా వాయించు కొనుచున్నావా? నృత్యాచార్యులు నీ నాట్యము చూచి హర్ష మొందుచున్నానని వచించినాడు. నీ తల్లి ఎంత ఆనందించియుండునో!

అతని కన్నుల విచారమేఘము లావరించినవి.

హిమబిందుకుమారి తండ్రికి నమస్కరించి వెడలిపోవుచుండ నశ్రుసిక్తములగు చారుగుప్తుని కన్ను లామెను ద్వారతోరణమువరకు సాగనంపినవి.

  1. సుమారు 1260 ధనువులు,
    ఇప్పటి 12 అణాల వెలగల వెండి నాణెము.