సత్యశోధన/రెండవభాగం/5. దక్షిణ ఆఫ్రికాకు ప్రయాణం

వికీసోర్స్ నుండి

5. దక్షిణ ఆఫ్రికాకు ప్రయాణం

నేను ఆ అధికారి దగ్గరికి వెళ్ళడం పూర్తిగా తప్పు. అయితే అతడి తొందరపాటు, అతి ఔద్ధత్యం ముందు నా తప్పు చిన్నదైపోయింది. నన్ను గెంటించనవసరం లేదు. అతని సమయాన్ని అయిదు నిమిషాల కంటే నేను వ్యర్థం చేయలేదు. అతడు నా మాటలు వినడానికే సిద్ధం కాలేదు. నన్ను మంచిగా వెళ్లమని చెప్పవచ్చు. కాని అతనికి అధికార దర్పం పెచ్చు పెరిగిపోయింది. అసలు సహనం తక్కువ అని కూడా ఆ తరువాత తెలిసింది వచ్చిన వాళ్లనందరినీ తృణీకరించి పంపుతూ వుంటాడని. కొంచెం కష్టం తోస్తే మండిపడుతూ వుంటాడని తెలిసింది.

అయితే నా పని అంతా అతగాడి ముందే అతడిని త్రోవకు తేవడం కష్టం ఆశ్రయించడం నాకు యిష్టం లేదు. మాననష్టం దావా వేస్తానని వ్రాసి ఆ తరువాత వూరుకోవడం నాకు యిష్టం లేదు.

ఈ సమయంలో మా రాష్ట్రమందలి చిన్న చిన్న రాజకీయాలు నాకు తెలిశాయి. కాఠియావాడు చిన్న చిన్న రాజ్యాల కూటమి. అందువల్ల రాజకీయవేత్తలు అక్కడ అధికం. సంస్థానానికి సంస్థానానికి పడదు. అనేక కుట్రలు, పలుకుబడి కోసం ఉద్యోగుల్లో ఉద్యోగులికి మధ్య కుట్రలు. సంస్థానాధిపతులు సులభులు. వాళ్లు దొరగారి నౌకర్లకు కూడా సులభులే. ఇక శిరస్తాదారు. ఆయన దొరగారికంటే ఎక్కువ. శిరస్తాదారే దొరగారికి కన్ను, చెవి. అతడే దొరగారికి దుబాసి. అందువల్ల శిరస్తాదారు మాటే మాట. అతడి రాబడి దొరగారి రాబడికంటే అధికం. అతడికి వచ్చే జీతం కంటే అతడికి అయ్యే ఖర్చు చాలా అధికం. యిందు అతిశయోక్తి ఏ మాత్రమూ లేదు.

ఈ దేశమంతా విషవాయుమయం అని అనిపించింది. విషవాయువు తగలకుండా స్వాతంత్ర్యాన్ని రక్షించుకుంటూ ఉండటం ఎలా అనే దిగులు నన్ను పట్టుకుంది.

నాకు ఉత్సాహం తగ్గిపోయింది. యీ విషయం మా అన్నగారు గ్రహించారు. ఎక్కడైనా ఉద్యోగం దొరికితే కుట్ర నుండి బయట పడవచ్చునని తోచింది. కుట్ర చేయకపోతే మంత్రి పదవిగాని, జడ్జి పదవిగాని లభించదు. పైగా ఆ దొరకు నాకు ఏర్పడ్డ వైమనస్యం మా యిద్దరి మధ్య పెద్ద అగాధం సృష్టించింది. అప్పుడు పోరుబందరు సంస్థానం తెల్లవారి ప్రభుత్వాధికారానికి లోబడి వుంది. ఆ సంస్థానాధిపతికి కొన్ని అధికారాలు సంపాదించి పెట్టే ఉద్యోగం ఒకటి ఉంది. ఇది కాక మేరులు అను ఒక జాతివారి మీద విధించబడ్డ హెచ్చు పన్నులను గురించి కూడా ఆ రాష్ట్రాధికారిని కలవవలసిన అవసరం ఏర్పడింది. అతడు హిందువే. కాని దురహంకారంలో తెల్లదొరల తాత అని తెలిసింది. అతడు సమర్థుడు. కాని అతడివల్ల రైతులకు ప్రయోజనం ఏమీ కలుగలేదు. నేను సంస్థానాధిపతికి కొన్ని కొత్త అధికారాలు సంపాదించి పెట్టగలిగానే గాని మేరులకు మేలు చేయలేకపోయాను. వారి విషయమై పూర్తిగా శ్రద్ధ వహించలేదని అనిపించింది.

అందువల్ల యీ వ్యవహారంలో కూడా నిరాశపడ్డాను. నా క్లయింట్లకు న్యాయం జరగలేదు. న్యాయం కలిగించగల సాధనం నా దగ్గర లేదు. చివరికి పొలిటికల్ ఏజంటుకో లేక గవర్నరుకో అర్జీ పెట్టుకోవాలి. అలా చేస్తే దీనితో మాకేమీ సంబంధం లేదని వాళ్లు త్రోసి పుచ్చేవాళ్లు, చట్టం ఏమైనా వుంటే అవకాశం వుండేది. కాని యిక్కడ దొరగారి మాటే చట్టం, అదే శాసనం.

ఈ విధంగా నేను ఉక్కిరి బిక్కరికావలసి వచ్చింది. ఇంతలో పోరుబందరు నుండి మేమన్ దుకాణం వారు మా అన్నగారికి జాబు వ్రాశారు. “మాకు అక్కడి కోర్టులో పెద్ద దావా వున్నది. అది నలభైవేల పౌండ్ల దావా. చాలా కాలాన్నుండి నడుస్తున్నది. మేము అందుకు పెద్ద వకీళ్లను, బారిష్టర్లను పెట్టాము. మీ తమ్ముణ్ణి పంపితే అతడు మాకు ఉపయోగపడతాడు. అతడికీ ఉపయోగం కలుగుతుంది. అతడు క్రొత్త దేశం చూస్తాడు. క్రొత్త అనుభవాలు పొందుతాడు” అని ఆ జాబులో వారు వ్రాశారు.

ఈ విషయం మా అన్నగారు నాకు చెప్పారు. అక్కడ నేను చేయాల్సిన పనేమిటో తెలియదు. అయితే వెళ్లాలనే కోరిక కలిగింది. “దాదా అబ్దుల్లా అండ్ కో లో భాగస్వామియగు సేఠ్ అబ్దుల్ కరీం జావేరీ గారికి (తరువాత గతించారు) మా అన్న నన్ను చూపించారు. ఆయన యిదేమి కష్టం కాదు అని నచ్చచెప్పి “అక్కడ మాకు పెద్ద పెద్ద తెల్లవాళ్లు మిత్రులుగా వున్నారు. వారితో మీకు పరిచయం కలుగుతుంది. దుకాణంలో మీరు మాకు ఉపయోగపడతారు. మా వ్యవహారమంతా ఇంగ్లీషులో పుంటుంది. దానికి మీరు పనికి వస్తారు. ఆ దేశంలో వున్నంత కాలం మీరు మాకు అతిథులు. అందువల్ల విడిగా మీకు ఖర్చు ఏమీ ఉండదు” అని చెప్పాడు, “ఒక్క సంవత్సరం కంటే ఎక్కువ పట్టదు. రాకపోకలకు మీకు ఫస్టు క్లాసు టిక్కెట్టు యిస్తాం. నూట అయిదు పౌండ్ల సొమ్ము యిస్తాం” అని అన్నాడు. ఇంత కొద్ది సొమ్ము కోసం దక్షిణ ఆఫ్రికా వెళ్లడం బారిస్టరు చేయవలసిన పని కాదు. పైగా దాస్యం చేయాలి. అయినా ఏదో విధంగా యీ దేశాన్ని విడిచి వెళదామనే కోరిక ఎక్కువైపోయింది. క్రొత్త దేశం చూద్దామని, క్రొత్త అనుభవం పొందుదామని అభిలాష కలిగింది. యిదిగాక ఆ నూట అయిదు పౌండ్లు మా అన్నగారికి పంపవచ్చు. కుటుంబ ఖర్చులకు ఆ సొమ్ము వినియోగపడుతుంది. యీ రకమైన అభిప్రాయాలతో యిక మారు మాటాడకుండా సరేనని చెప్పి దక్షిణ ఆఫ్రికా ప్రయాణానికి సిద్ధపడ్డాను.