సత్యశోధన/మూడవభాగం/18. గోఖలేగారితో ఒక మాసం - 2

వికీసోర్స్ నుండి

18. గోఖ్లేగారితో ఒక మాసం - 2

గోఖ్లేగారి గొడుగు నీడలో వున్న నేను కాలవ్యవధిని గమనించలేదు. హిందూ దేశమందలి క్రైస్తవుల స్థితిగతులను గురించి సవివరంగా తెలుసుకొని మీకు తెలియచేస్తానని దక్షిణ ఆఫ్రికా యందలి క్రైస్తవ మిత్రులకు చెప్పి వచ్చాను. కాళీచరణ బెనర్జీగారి పేరు విన్నాను. వారు కాంగ్రెస్‌లో ఎక్కువగా పని చేస్తున్నారు. అందువల్ల వారంటే నాకు ఆదరం పెరిగింది. సామాన్యంగా భారతదేశ క్రైస్తవులు కాంగ్రెస్ సభల్లో పాల్గొనరు. హిందువులతో, ముసల్మానులతో కలవరు. అందువల్ల క్రైస్తవుల యెడ కలిగిన ఆ విశ్వాసం కాళీచరణ బెనర్జీ గారి యెడ నాకు కలగలేదు. నేను వారిని దర్శిస్తానని గోఖ్లేగారితో అన్నాను. వారిని చూచి ఏం చేస్తావు? వారు చాలా యోగ్యులే. కాని వారిని దర్శించినందున నీకు సంతృప్తి కలుగదని భావిస్తున్నాను. నీవు చూడదలుచుకుంటే తప్పక చూడు అని గోఖ్లే అన్నారు. నేను కాళీబాబు దర్శనం కోసం జాబు పంపాను. వారు వెంటనే అనుమతి యిచ్చారు. వెళ్ళి వారి దర్శనం చేసుకున్నాను. ఇంట్లో వారి ధర్మపత్ని మృత్యుశయ్యమీద పడివున్నది. ఇల్లంతా నిరాడంబరంగావుంది. కాంగ్రెస్‌లో వారు కోటు, ఫాంటు ధరించి పాల్గొనేవారు. కాని యింట్లో బెంగాలీ ధోవతి కట్టుకొని వున్నారు. వారి నిరాడంబరత్వం చూచి ముగ్ధుడనయ్యాను. వారి సమయం వ్యర్థం చేయకుండా నా గొడవ చెప్పకున్నాను. “పాపాలతో బాటు మనకు పునర్జన్మ కలదను సిద్ధాంతం మీరు నమ్ముతారా?” అని వారు ప్రశ్నించారు.

“తప్పక నమ్ముతాను.”

“అయితే ఈ పాప నివారణోపాయం హిందూ ధర్మంలో ఎక్కడా లేదు. కాని క్రైస్తవ ధర్మంలో వుంది” అని చెప్పి “పాపాలకు ఫలం మృత్యువు. యీ మృత్యువును తప్పించుకొనుటకు ఏసుక్రీస్తే శరణ్యం” అని అన్నారు.

నేను వారికి గీతలో చెప్పబడిన భక్తి యోగాన్ని గురించి చెప్పడానికి ప్రయత్నించాను. కాని నా ప్రయత్నం వృధా అయింది. నేను వారి సౌజన్యానికి ధన్యవాదాలు సమర్పించాను. మా సంభాషణ వల్ల నాకు తృప్తి కలుగలేదు. కాని లాభం చేకూరింది. నేను కలకత్తాలో గల వీధివీధిన బాగా తిరిగాను. చాలా దూరం నడిచాను. అప్పుడే న్యాయమూర్తి మిత్రగారిని, సర్‌గురుదాసబెనర్జీ గారిని దర్శించాను. దక్షిణ ఆఫ్రికా పనులకు వారి సాయం అవసరం. రాజాసర్‌ప్యారీ మోహన్‌ముఖర్జీగారి దర్శన భాగ్యం కూడా కలిగింది.

కాళీ చరణ బెనర్జీగారు కాళికాలయాన్ని గురించి నాకు చెప్పారు. ఒక పుస్తకంలో దాని వర్ణన చదివాను. న్యాయమూర్తి మిత్రగారి గృహం ఆ ప్రాంతంలోనే వున్నది. వారి దర్శనం చేసుకొని ఆ దారినే వస్తూ కాళికాలయం దగ్గరకి వెళ్ళాను. కాళికాదేవికి బలికాబోతున్న గొర్రెల మందను త్రోవలో చూచాను. ఆలయం సందుల్లో బిచ్చగాళ్లు గుంపులు గుంపులుగా వున్నారు. బైరాగి బాబులు సరేసరి. సంతలు, బజార్లు మొదలుగాగల చోట్ల బిచ్చగాళ్లకు కాణీకూడా యివ్వకూడదని అప్పటికే నేను నిర్ణయించుకొన్నాను. చాలామంది బిచ్చగాళ్లు నా వెంటబడ్డారు. ఒక బాబాజీ ఎత్తగు నలుచదరపు రాతికట్టడం మీద కూర్చొని వున్నాడు. ఆయన నన్ను దగ్గరికి రమ్మని పిలిచాడు. నేను, ఒక మిత్రుడు ఆయన దగ్గరకు వెళ్లాము. “నాయనా! ఎక్కడికి పోతున్నావు.” అని ఆయన నన్ను అడుగగా, తగిన సమాధానం చెప్పాను. ఆయన నన్ను, నామిత్రుణ్ణి కూర్చోమని చెప్పగా మేము కూర్చున్నాము “అయ్యా! ఇన్ని గొర్రెల్ని బలివ్వడం ధర్మమని మీరు భావిస్తున్నారా?” అని అడిగాను. “జీవహత్య ధర్మమని ఎవరంటారు?” అని ఆయన అన్నాడు.

“మీరిక్కడ కూర్చున్నారు గదా? జనానికి బోధించకూడదా?”

“అది నా పనికాదు. భగవత్సేవయే నా పని”

“అందుకు మీకు యీ చోటే దొరికిందా? వేరే చోటుదొరకలేదా?”

“ఎక్కడ బడితే అక్కడ కూర్చుంటాను. నాకన్ని చోట్లు ఒక్కటే, లోకులగోల నాకెందుకు? వాళ్లొక గొర్రెల మంద. ఎక్కడికి పిలిస్తే అక్కడికి పోతారు. వారితో మాకేమిపని?”

నేనిక సంభాషణను పెరగనీయలేదు. తరువాత నేను దేవాలయంలోకి వెళ్లాను. ఎదురుగా రక్తపుమడి చూచి బిత్తరపోయాను. నిలబడలేకపోయాను. పెద్ద క్షోభ కలిగింది. తలక్రిందులయ్యాను. ఆ దృశ్యం ఈనాటికీ మరువలేను. ఆ సమయాన ఒక బెంగాలీ సంఘం వారు నన్ను విందుకు పిలిచారు. ఇక్కడ ఒక సజ్జనునితో ఘాతుకమగు జంతుబలిని గూర్చి ముచ్చటించాను. “అక్కడ బలియిచ్చే సమయంలో చెవులు రింగుమంటూ నౌబత్‌ఖానాలు మోగుతూ వుంటాయి. ఈ గందర గోళంలో గొర్రెలకు మృత్యుబాధ తెలియదు” అనే ఆ సజ్జనుడు అన్నాడు. వారి మాటలు నాకు రుచించలేదు. ‘ఆ గొర్రెలకి నోరుంటే ఊరుకోవు. ఘోరమైన ఈ ఆచారాన్ని ఆపివేయాలి.’ అని అన్నాను. నాకు బుద్దుని కథ జ్ఞాపకం వచ్చింది. కాని దానిని ఆపడం మాత్రం నా శక్తికి మించిన పనియని అనిపించింది.

ఈ విషయంలో అప్పుడు ఏవిధంగా భావించానో ఇప్పుడు కూడా ఆ విధంగానే భావిస్తునాను. గొర్రె ప్రాణం విలువ మనుష్యుని ప్రాణం కంటే తక్కువ కాదు. మనిషి శరీరాన్ని పోషించేందుకు గొర్రెను చంపడం ఎన్నటికీ అంగీకరించలేను. జంతువు కడు నిస్సహాయమగు ప్రాణి. మనుష్యుని సాయం పొందుటకు అది అధికారి. అయితే దానికి సాయం చేయాలంటే మనిషికి ఎంతో యోగ్యత, అధికార విచక్షణ వుండటం అవసరం. అప్పుడే ప్రాణదానం చేయగల శక్తి మనిషికి చేకూరుతుంది. గొర్రెలను ఇంతటి క్రూరమైన హోమం నుండి రక్షించాలంటే నాకు యింకా ఆత్మశుద్ధి, త్యాగం అవసరం. ఇట్టి శుద్ధిని, త్యాగాన్ని గురించి ఘోషిస్తూ ఘోషిస్తూనే ఈ దేహాన్ని విడవలసి వస్తుందేమోనని తోస్తున్నది. మనిషిని ఈమహాపాతకాన్నుండి రక్షించుటకు, నిర్దోషులగు ఈ జీవులను కాపాడుటకు, ఈ ఆలయాన్ని పవిత్రం చేయిటకు ఆ పరమేశ్వరుడు ఏ మహాపురుషుణ్ణి లేక ఏ మహాశక్తిని సృష్టిస్తాడో తెలియదు. కాని నేను అలా సృష్టించమని సదా దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను. జ్ఞానవంతులు, బుద్ధిమంతులు, త్యాగధనులు, భావుకులునగు బెంగాల్ ప్రజలు ఇట్టి వధను ఎట్లు సహించి వూరుకుంటున్నారో తెలియదు.