శ్రీ సాయిసచ్చరిత్రము /ముప్పదియేనిమిదవ అధ్యాయము

వికీసోర్స్ నుండి
'శ్రీ సాయిసచ్చరిత్రము' (ముప్పదియేనిమిదవ అధ్యాయము - 6వ రోజు పారాయణము )



శ్రీ సాయిసచ్చరిత్రము ముప్పదియేనిమిదవ అధ్యాయము ఆరవ రోజు పారాయణము మంగళవారము 1. బాబా వంటపాత్ర 2. దేవాలయమును గౌరవించకుండుట 3. కాలా లేదా మిశ్రమము 4. మజ్జిగ


గత అధ్యాయములో బాబాగారి చావడి యుత్సవము వర్ణింతిమి. ఈ యధ్యాయములో మనము బాబా వంటపాత్ర మొదలగువానిని గూర్చి చదివెదము.

తొలిపలుకు

ఓ సద్గురుసాయి! నీవు పావనమూర్తివి! ప్రపంచమంతటికి సంతోషమును ప్రసాదించితివి, భక్తులకు మేలు కలుగజేసితివి. నీ పాదముల నాశ్రయించినవారి బాధలను తొలగించితివి. నిన్ను శరణు జొచ్చినవారిని ఉదారస్వభావుడవగుటచే వారిని పోషించి రక్షించెదవు. నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు, వారికి మేలు చేయుటకొరకు నీవతరించెదవు. పవిత్రాత్మయను ద్రవసారమును బ్రహ్మమునెడి యచ్చులో పోయగా దాని నుండి యోగులలో నలంకారమగు సాయి వెడలెను. ఈ సాయి యాత్మారాముడే. స్వచ్ఛమైన దైవికానందమునకు వారు పుట్టినిల్లు. జీవితేచ్ఛలన్నియు పొందినవారై, వారు భక్తులను నిష్కాములను జేసి విముక్తుల జేసిరి.

వంటపాత్ర

యుగయుగములకు శాస్త్రములు వేర్వేరు సాధనములను ఏర్పాటు చేసియున్నవి. కృతయుగములో తపస్సు, తేత్రాయుగములో జ్ఞానము, ద్వాపరయుగములో యజ్ఞము, కలియుగములో దానము చేయవలెనని శాస్త్రములు గోషించుచున్నవి. దానములన్నింటిలో అన్నదానమే శ్రేష్ఠమయినది. మధ్యాహ్నము 12 గంటలకు భోజనము దొరకనిచో మనము చాలా బాధపడెదము. ఆట్టి పరిస్థితులలో నితరజీవులు కూడ నట్లే బాధ పడును. ఈ విషయము తెలిసి యెవరయితే బీదలకు, అకలితో నున్నవారికి భోజనము పెట్టెదరో వారే గొప్ప దాతలు. తెత్తిరీయేపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది. " అహారముమే ప్రరబ్రహ్మస్వరూపము, అహారమునుండియే సమస్తజీవులు ఉద్భవించినవి. చచ్చిన పిమ్మట నవి తిరిగి అహారములొ ప్రవేశించును." మిట్టమధ్యాహ్నము మన యింటి కెవరైన అతిథి వచ్చినచో, వారి నాహ్వనించి భోజనము పెట్టుట మన విధి. ఇతరదానములు అనగా ధనము, బట్టలు మొదలుగునవి యిచ్చునప్పుడు కొంత విచిక్షణ కావలెను. కాని యాహారవిషయములో నట్టి యాలోచన యనవసరము. మన యింటికి మిట్టమధ్యాహ్న మెవరు వచ్చినను వారికి మొట్టమొదట భోజనము పెట్టవలెను. కుంటీ, గ్రుడ్డి, రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనము పెట్టిన పిమ్మట అరోగ్యవంతులకు, అటుపిమ్మట మన బంధువులకు పెట్టవలెను. మన బంధువులు మొగు వారికి పెట్టుటకంటె, నిస్సహయులైన అంగవికలురు తదితరులకు పెట్టుట యెంతో శ్రేయస్కరము. అన్నదానము లేకున్నచో నితర దానములు ప్రకాశించవు. ఎట్లన చంద్రుడు లేని నక్షత్రమువలె, పతకములేని కంఠహారమువలె, పింఛము లేని కిరీటమువలె, కమలము లేని చెఱువువలె, భక్తిలేని భజనవలె, కుంకుమబొట్టులేని పుణ్యస్త్రీవలె, బొంగరు కంఠముగలవాని పాటవలె, ఉప్పు లేని మజ్జిగవలె రుచింపవు. అన్ని వ్యంజనములకంటె పప్పుచారు ఎట్లు ఎక్కువో అట్లే అన్ని పుణ్యములలో అన్నదాన మెక్కువ. బాబా అహారము నెట్లు తయారుచేసి పంచి పెట్టుచుండెనో చూచెదము.

బాబాకొరకు చాలా తక్కువ భోజనము కావలసియుండెను. అదియు కొన్ని యిండ్లనుండి భిక్షాటనము చేసి తెచ్చుకొనెడివారు యిదివరకే తెలిసికొంటిమి. ఏనాడైనా అందరికి భోజనము పెట్టవలెనని బాబా నిశ్చయించుకొన్నచో మొదటినుండి చివరవరకు కావలసిన యేర్పట్లు లన్నియు వారే స్వయముగా చేసికొనెడివారు. ఈ విషయమై వారు ఇతరులపై అధారపడలేదు! ఎవరికిని బాధ కలుగజేయులేదు. మొట్టమొదట బజారుకు వెళ్ళి ధాన్యము, పిండి, మసాలాదినుసులు మొదలగునవి యన్నియు నగదునిచ్చి కొనెడివారు. వారే విసరుచుండెడివారు, మసీదు ముందున్న ఖాళీస్థలములో మధ్యన పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంటపాత్రలో కొలత ప్రకారము నీళ్ళు పోసి పెట్టెడివారు. వారు వద్ద వంటపాత్రలు రెండు గలవు. ఒకటి పెద్దది వందమందికి సరిఫొవునది, రెండవది చిన్నది 50 మందికి మాత్రము సరిపోవునది. ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు. మరొకప్పుడు మాంసపు పులవు వండెడివారు. ఒక్కొక్కప్పుడు పప్పుచారుడుకునప్పుడు గొధుమపిండి బిళ్ళలు అందులోనికి వదిలేవారు. మసాలా వస్తువులను చక్కగా నూరి దానిని వంటపాత్రలో వేసేవారు. పదార్థములు చాలా రూచిగా నుండుట కెంత శ్రమ తీసికొనువలెనో అంత శ్రమను పడుచుండెడి వారు. అప్పుడప్పుడు అంబలి వండెడివారు. అనగా జొన్నపిండిని నీళ్ళులో నుడకపెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండెడివారు. భోజన పదార్థములలో ఈ అంబలిని కూడ అందరికి కొంచెము కొంచెముగా పెట్టెడివారు. అన్నము సరిగా నుడికినదో లేదో యని పరీక్షించుటకు బాబా తన కఫనీ పై కెత్తి చేతిని నిర్భయముగా మరుగుచున్న డేకిసాలో బెట్టి కలుపుచుండెడివారు. వారి ముఖమునందు భయచిహ్నములు గాని చేయి కాలునట్లుగాని కనిపించెడిది కాదు. వంట పూర్తికాగానే, బాబా ఆ పాత్రలను మసీదులోనికి దెచ్చి, మౌల్వీచే అరగింపు పెట్టించెవారు. మొట్టమొదట కొంత మహల్సాపతికి, తాత్యాకు ప్రసాదముగా పంపించిన పిమ్మట మిగతదానిని బీదవాండ్రుకు దిక్కులేనివారికి సంతృప్తిగా బెట్టుచుండిరి. బాబా స్వయముగా తన చేతులతో తయారుచేసి స్వయముగా వడ్డించగా భోజనము చేసినవారు నిజముగా ఎంతో పుణ్యత్ములు అదృష్టవంతులయి యుండవలెను.

బాబా తన భక్తులందరికి శాకాహారము మాంసాహరము మొకేరీతిగా బెట్టుచుండెనా యని ఎవరికైన సందేహము కలుగవచ్చును. దీని జవాబు సులభము, సామాన్యమైనది. ఎవరు మాంసాహరులో అట్టివారికే, ఆ వంట పాత్రలోనిది పెట్టెడివారు. మాంసాహరలు కానివారి నా పాత్రను గూడ ముట్టనీయలేదు. వారి మనస్సులో దీనిని తినుటకు కోరిక కూడ కలుగనిచ్చెడివారు కారు. గురువుగారేదైన ఇచ్చినప్పుడు దానిని తినవచ్చునా లేదా యని యోచించు శిష్యుడు నరకమునకు పొవునను రూఢీ కలదు. దీనిని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేదో చూచుటకు బాబా యొక్కక్కప్పుడు పరీక్షించు చుండెడివారు. దీనికొక ఉదాహరణము. ఒక ఏకాదశినాడు దాదాకేల్కరుకు కొన్ని రూపాయలిచ్చి కొరాల్బాకు పోయి మాంసము కొని తెమ్మనెను. ఇతడు సనాతనాచారపరాయణుడగు బ్రాహ్మణుడును అచారవంతుడును. సద్గురువుకు ధనము, ధాన్యము, వస్త్రములు మొదలగునవి ఇచ్చుట చాలదనియు, కావలసినది అక్షరాల గురువు అజ్ఞను పాటించుటే యనియు, గురువు అజ్ఞానుసారము నెరవేర్చుటయే యనియు, ఇదియే నిజమైన దక్షిణ యనియు, దీనివల్లనే గురువు సంతుష్టిచెందెదరనియు అతనికి తెలియును, కనుక దాదా కేల్కరు దుస్తులు ధరించి బజారుకు బయలుదేరెను. కాని బాబా అతనిని వెంటనే పిలచి తానే స్వయముగా పోవలదనియు నింకెవరినైన పంపుమనెను. అతడు పాండువను నౌకరును బంపెను. వారు బయలుదేరుట జూచి బాబా వానిని కూడ వెనుకకు బిలిపించి యానాడు మాంసము వండుట మానుకొనిరి. ఇంకొకసారి బాబా దాదాకేల్కరును బిలిచి పొయ్యి మీదనున్న పులావు ఉదికినదో లేదో చూడుమనెను. కేల్కర్ దాని పరీక్షించకయే సరిగా నున్నదని జవాబిచ్చెను. అప్పుడు బాబా "నీవు కండ్లతో దానిని చూడలేదు. నాలుకతో రుచి చూడలేదు, రుచిగానున్నదని ఎట్లు చెప్పితివి. మూత తీసి చూడుము." అనుచు బాబా యతని చేతిని బట్టుకొని మరుగుచున్న డేకిసాలో బెట్టెను. ఇంకను నిట్లనెను "నీ చేయిని తీయము. నీ అచారము నొక ప్రక్కన బెట్టి తెడ్డుతో దీసి, కొంచెము ప్లేటులో వేసి సరిగా ఊదికినది లేనిది తెలిసికొనుము." తల్లి మనస్సున నిజమైన ప్రేమ జనించున్నప్పుడు అమె తన బిడ్డను గిల్లి ఆ బిడ్డ యేడ్చుచున్నప్పుడు దాని కౌగలించి ముద్దుబెట్టుకొనును. అట్లనే బాబా కూడ కన్నతల్లివలె దాదాకేల్కరును ఈ విధముగా గిల్లెను. నిజముగా ఏ యోగిగాని, గురువుగాని తన శిష్యునకు నిషిద్దాహరము తిని చెడిపొమ్మని చెప్పడు.

ఈ విధముగ బాబా పలావు వండుట 1910వ సంవత్సరమువరకు జరుగుతుండెడిది. పూర్వము చెప్పిన రీతిగా దాసగణు, బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రములో వెల్లడి చేసెను. ఆ ప్రాంతమునుండి ప్రజలు తండోపతండములగా శిరిడీకి వచ్చుచుండిరి. కొలది దినములలో శిరిడీ యొక పూణ్యక్షేత్రమాయెను. భక్తులనేక రకముల యాహరములను బాబాకు నైవేద్యము పెట్టుచుండిరి. వారి తెచ్చిన పదార్థములు ఫకీరులు, బీదలు తినగా నింకను మిగులుచుండెను. నైవేద్యమునెట్లు పంచి పెట్టెడివారో చెప్పుటకు ముందు బాబాకు శిరిడీలోని దేవాలయములందును, నందుండు దేవతుల యందును గల గౌరవమును చాటెడు నానా సాహెబు చాందోర్కరు కథ తెలిసికొందము.

నానాసాహెబు దేవాలయమును అగౌరవించుట

ఎవరికి తోచినట్లు వారాలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని కొందరు, మహమ్మదీయుడని మరికొందరు చెప్పుచుండిరి. నిజముగా బాబా యేజాతికి చెందినవారు కారు. వారెప్పుడు పుట్టిరో, ఏజాతియందు పుట్టిరో, వారి తల్లిదండ్రులెవరో యెవరికి తెలియదు. కనుక వారు బ్రాహ్మణుడుగాని, మహమ్మదీయుడుగాని యెట్లు కాగలరు? వారు మహమ్మదీయు లయినచో మసీదులొ నెప్పుడు ధుని నెట్లు మండనిత్తురు? అచ్చోట తులసీబృందావన మెట్లుండును? శంఖము లూదుట కెట్లు ఒప్పుకొందురు? గంటలను మ్రోగించుట కెట్లు సమ్మతింతురు? సంగీతవాద్యముల నెటుల వాయించనిత్తురు? హిందువుల మతప్రకారము షోఢశోపచార పూజలెటుల జరుగనిత్తురు? వారు మహ్మదీయు లయినచో వారి చెవులకు కుట్లు (రంధ్రములు) ఎటులుండును? గ్రామములోని హిందూదేవాలయము లన్నిటిని ఏల మరమ్మతు చేయుంచిరి? బాబా హిందూ దేవాలయములను దేవతలను ఏ మాత్రము అగౌరవించినను ఊరుకొనెడివారు కారు.

ఒకనాడు నానాసాహెబు చాందోర్కర్ తన షడ్డకుడగు బినీవాల్యతో శిరిడీకి వచ్చెను. బాబా వద్ద కూర్చొని మాట్లాడుచుండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపగించి, "నా సహవాసము ఇన్నాళ్ళు చేసియు నిట్లేల చేసితివి?" అనెను. నానాసాహెబు మొదట దీనిని గ్రహించలేకపోయెను. కనుక అదేమిటో వివరించవలసినదిగా ప్రార్థించెను. కోపర్‍గాం నుండి శిరిడీకి ఎట్లు వచ్చితివి బాబా యతని నడిగెను. నానాసాహెబు వెంటనే తన తప్పు గ్రహించెను. సాధారణముగా శిరిడీకి పోవునపుడెల్ల నానాసాహెబు కోపర్‌గాంలో దిగి దత్తదర్శనము చేసికొనెడివాడు. కాని ఈసారి తన బంధువు దత్తభక్తుడయినప్పటికి అతనిని గూడ వెళ్ళనీయక, యాలస్యమయిపోవునని చెప్పుచు తిన్నగా శిరిడీకి చేర్చెను. ఇదంతయు బాబాకు తెలియజేయుచు, తాను గోదావరిలొ స్నానము చేయునప్పుడొక ముల్లు పాదములొ గ్రుచ్చుకొని తనను చాలా బాధ పెట్టెనని చెప్పెను. బాబా యది కొంతవరకు ప్రాయశ్చిత్తమే యనుచు నిక మీదట జాగ్రత్తయని హెచ్చరించెను.

కాలా(మిశ్రమము)

ఇక నైవేద్యమెటుల పంచి పెట్టెడువారో చూచెదము. హారతీ పిమ్మట భక్తులందరికి ఊదితో తమ అశీర్వాదములు ఇచ్చి పంపివేసిన పిమ్మట, బాబా మసీదులోనికి బోయి నింబారువైపు వీపు పెట్టి కూర్చొనుచుండిరి. కుడివైపు ఎడమవైపు భక్తులు పంక్తులలో కూర్చొనుచుండిరి. నైవేద్యము తెచ్చిన భక్తులు పళ్ళెములను మసీదులో బెట్టి బాబా యశీర్వాదములకై ఊదీకై కనిపెట్టుకొని బయట నిలుచుండిరి. అన్ని రకముల ప్రసాదములు బాబాకు వచ్చుచుండెడివి. పూరీలు, మండెగలు, బొబ్బట్లు, బాసుంది, సాంజా, పరమాన్నము మొదలగున వన్నియు ఒకే పాత్రలో వేసి బాబా ముందుంచువారు. బాబా దీనిని దైవమునకు అర్పించి, పావన మొనర్చుచుండెను. అందులో కొంతభాగము బయట కనిపెట్టుకొని యున్నవారికి పంచి తక్కినది బాబాకు అటునిటు రెండు వరసలలో కూర్చుండిన భక్తులు సంతృప్తిగా తినుచుండిరి. శ్యామా, నానాసాహెబు నిమోనకర్ వడ్డించువారు. వచ్చినవారి సౌకర్యములను వీరు చూచువారు. వారాపని అతిజాగ్రత్తగాను, ఇష్టముగాను చేయుచుండిరి. తిన్నట్టి ప్రతి రేణువు కూడ తృప్తియు, సత్తువయు కలుగజేయుచుండెను. అది యట్టి రుచి, ప్రేమ, శక్తి గలిగిన యాహారము, అది సదా శుభ్రమైనది, పవిత్రమైనది.

ఒక గిన్నెడు మజ్జిగ

ఒకనాడు హేమడ్‌పంతు మసీదులో నందరితో కడుపునిండ తినెను. అట్టి సమయమున బాబా అతనికొక గిన్నెడు మజ్జిగ త్రాగుమని యిచ్చెను. అది తెల్లగా చూచుట కింపుగా నుండెను. కాని యతని కడుపులో ఖాళీ లేనట్లుండెను. కొంచెయు పీల్చగా అది మిక్కిలి రూచిగా నుండెను. అతని గుంజాటనము గనిపెట్టి బాబా యతనితో నిట్లనెను. "దాని నంతయు త్రాగుము. నీ కికమీదట ఇట్టి యవకాశము దొరకదు". అతడు వెంటనే దాని నంతయు త్రాగెను. బాబా పలుకులు సత్యమయ్యెను. ఏలన త్వరలో బాబా సమాధి చెందిరి.

పాఠకులారా! హేమడ్‌పంతుకు మనము నిజముగా నమస్కరించ వలెను. అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదముగా త్రాగెను. కాని మనకు కావలసినంత యమృతమును బాబా లీలల రూపముగా నిచ్చెను. మనము ఈ యమృతమును గిన్నెలతో త్రాగి సంతుష్టిచెంది యానందించెదముగాక!


శ్రీ సాయినాథాయ నమః ముప్పదియేనిమిదవ అధ్యాయము సంపూర్ణము

సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు