భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/భక్తావర్‌ మాయి

వికీసోర్స్ నుండి

జమిందారీ దాష్టీకాన్ని సాయుధంగా ఎదుర్కొన్న

భక్తావర్‌ మాయి

(-1946)

భారతీయ ముస్లిం మహిళలు జాతీయోద్యమంలో పాల్గొనటమే కాకుండ, బ్రిటీష్‌ ప్రభుత్వ వత్తాసుదారులుగా మారి ప్రజలను హింసిస్తున్న ప్రజాకంటకులను ధైర్య సాహసాలతో ఎదాుర్కొన్న సంఘటనలు కూడ చరిత్రలో దర్శనమిస్తాయి. జమీందారీ దాష్టీకాలను ప్రతిఘటించే క్రమంలో గ్రామ ప్రజలను ఆదుకునేందుకు ఆయుధ ఎత్తుకుని చరిత్రకెక్కిన మహిళలలో శ్రీమతి భక్తావర్‌ మాయి ఒకరు.

భక్తావర్‌ మాయి వాయువ్యసరిహద్దు రాష్ట్రం (ప్రస్తుతం పాకిస్థాన్‌ భూభాగం) లోని సింథ్‌ ప్రాంతం లాషారి గ్రామానికి చెందిన ఆడపడుచు. ఆమె భర్త వలి ముహమ్మద్‌ లాషారి. అతను సామాన్య రైతు. ఆ ప్రాంతపు జమీందారు పరమ క్రూరుడు. బ్రిటిషర్ల తొత్తు. ఆతడు రైతుల శ్రమను దోచుకుంటూ విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డాడు . ఈ విషయమై ఎవ్వరైనా జమిందారునిగాని, అతని వత్తాసుదారులను గాని ప్రశ్నిస్తే అంతటితో వారికి నూకలు చెల్లినట్టే.

అది 1946 నాటి సంఘటన. భారతదేశం పరాయిపాలకుల పాలనలో ఉంది. ఆ పాలకవర్గాల తాబేదారులైన జమీందారుల రాజ్యం గ్రామాలలో సాగుతూనే ఉంది. లాషారి గ్రామ రైతులు ఆరుగాలాలు శ్రమపడి పండించుకున్న పంటను ఇళ్ళకు తెచ్చుకుని

229 ఆనందిసున్నారు. జమీందారుకు అప్పగించాల్సిన పంటభాగాన్ని చెల్లించేందుకు సిద్దంగా ఉన్నారు. జమీందారు అత్యధిక భాగాన్ని కోరాడు. ఆ కోరికను మన్నించలేమనిరైతులు మొరపెట్టుకున్నారు. ఆగ్రహించిన జమీందారు తన మనుషులను లాషారి గ్రామానికి పంపాడు. ఆ గూండలు రైతుల కష్టార్జితాన్ని ఎత్తుకుపోవాటానికి రాగా, బక్క జీవులలో రోషం రగిలించి, ధైర్యం చెప్పి జమీందారు అనుచరులను ఎదుర్కొనేందుకు ఆమె రంగం సిద్ధం చేశారు.

ఆ పరిస్థితులను గమనించిన జమీందారు గూండలు పోలీసులను తమకు వత్తాసుగా పిలిపించుకుని గ్రామస్థుల మీద విరుచుకుపడ్డారు. భక్తావర్‌ దంపతులు జమీందారు మూకలకు తగిన బుద్ధిచెప్పాలని నిర్ణయించుకున్నారు. భార్యభర్తలిరువురు సాయుధులై ధార్మపోరాటానికి సిద్ధమయ్యారు. ఈ దాడిలో భర్త వలి మహమ్మద్‌ లాషారి తీవ్రంగా గాయపడినా ఆమె ఏ మాత్రం అధైర్య పడకుండ గ్రామస్థులలో ఉత్సాహం నూరిపోస్తూ, జమీందారి మూకల మీద విరుచుకుపడ్డరు. సాయుధ శిక్షణ పొందిన గూండలను ఎదుర్కోవడం గ్రామీణులకు అసాధ్యమైంది. ఆ పోరాటంలో భక్తావర్‌ గుండెలను చీల్చుకుంటూ తుపాకి గుండ్లు దూసుకు పోవటంతో ఆమె నేల కూలింది. నేల కూలిపోతూ కూడ ఒక్క గింజ కూడ రాక్షసులకు అందనివ్వకండి అని కోరుతూ ఆ యోధురాలు కన్నుమూసింది.

ఆనాటి సంఘటనలో ఆమె ప్రదర్శించిన త్యాగాన్ని ప్రజలు మర్చిపోలేదు . భక్తావర్‌ ధైర్యసాహసాలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఈనాటికి కూడ ఆమె అమరగతిని పొందిన రోజున సింథ్‌ ప్రాంతంలోని ప్రజలు, ఆమె పట్ల గౌరవాభిమానాలు వ్యక్తం చేస్తూ చెడు మీద మంచి సాధించిన విజయంగా భావిస్తూ ఉత్సవాలు జరుపుకోవటం విశేషం.

భక్తావర్‌ మాయి త్యాగనిరతి, ధైర్యసాహసాలను ప్రస్తుతిస్తూ మనం మృత్యువు నీడలో ముందుకు సాగాల్సి ఉంది. మన కోసం భక్తావర్‌ మాయి తన రక్తం, చివరకు తన ప్రాణం ధారబోసింది. ఆమె రకం ఈనాికి సత్య మార్గాన నడుస్తానంటుంది. మనల్ని ధైర్యంగా మున్ముందుకు సాగమంటుంది అని ప్రసిద్ధా సింథీ కవి శౌక్‌ అయాజ్‌ రాసిన కవిత, 1967లో ప్రముఖ సాహిత్యకారులు మునీర్‌ మానక్‌ ఆమె త్యాగాన్ని ధైర్యసాహసాలను కీర్తిస్తూ రాసిన నాటకం లోకప్రసిద్ధమయ్యాయి.

230