శాస్త్రులవారి పద్ధతులంగని కొందఱు పండితులు తమ నాటకములలో నీచపాత్రములకు అచ్చతెలుగుం బెట్టసాగిరి. దీనింగూర్చి వారే తమ గ్రామ్యభాషాప్రయోగనిబంధనమున నిట్లు వ్రాసినారు.
"కొందఱు మదీయ నాగానందముంగని, భాషాభేద మావశ్యకమని గ్రహించియు, నామార్గ మవలంబించిన నా శిష్యు లగుదురని ద్వేషించి, నీచపాత్రముల కచ్చతెలుంగని యొక రసాభాసంపు నియమముం గల్పించుకొని నిర్వహించుకోలేక, పరమనీచ పాత్రములకు నిజనియమవిరుద్ధముగా తత్సమముంబెట్టుచు, ఋషికన్యాది సత్పాత్రములచే మాల మాదిగల చేతనుంబోలె మహారాజును 'పబువులు' అనిపించుచు, నీచనీచతరపాత్రములైన చేటికాదులచే సీతారాజ కన్యాదులను అతి నమ్రతతో అతి సుకుమార సంబోధన చేయవలసినచో, అతి తిరస్కార సూచకముగా, మౌండ్యకశాఘాతాంగ కర్తనాంక నిర్వాసనాది దండార్హముగా 'రాచకూతురా' యని సంబోధన చేయించుచు, నటిని సూత్రథారునిచే 'దేవీ' యని దేవిరింపించుచు గ్రామ్యనాటకములు వ్రాయుచున్నారు." (పుట 60)
1897 సం. శాస్త్రులవారి జీవితమున మఱువరానిది. ఈసంవత్సరమే వారు తాము బాల్యములో తమ తండ్రిగారు చెప్పగా విన్నట్టిదియు, వెనుక, తాము పెంపొందించి, కథగా జనవినోదినిలో ప్రకటించినదియునైన, ప్రతాపరుద్రుని కథను