ఆస్నేహితులు ఒకరొకరుగా వెనుకకు జారుకొనిరి. తుదకుశాస్త్రులవారును వారి సోదరులును మిగిలిరి. వీరికి అభిమానము ఎక్కువ. వెనుకకు పోయిన పరువులోప మని యీదుచునేయుండిరి. లోతు, కాలికి నేల యందదు. ఇందులో శాస్త్రులవారికి ఈత సరిగా రాదు. వారితమ్ములకు చక్కగా వచ్చును. వారు వీరిని పట్టుకొని ఈదుచుండిరి. శాస్త్రులవారి దోవతి వీడిపోయి కాలికి చుట్టుకొన్నది. ఇక ఆ యీతయు అసాధ్యమే. అంత వారు ఈదలేక తమ్మునితో "ఒరేయి, నన్ను వదలివేయి, నేను చచ్చిపోతాను, నాకు ఈదినం గండం, నువ్వెందుకు నాకోసం చచ్చిపోతావు?" అనిరి. "ఆ! మిమ్మల్ని వదలిపెడతానా?" అని వెంకటసుబ్బయ్యగారు మెల్లగా కాలికి నేలతగులువఱకు ప్రయాసతో కొనిపోయిరి. అక్కడ సరిగా కంటివఱకు నీరు. ప్రవాహము వేగముగా లాగుచుండెను. అలసిపోయినారు. వాస్తవముగా శాస్త్రులవారు నాడు తాము చనిపోవుచున్నామనియే తలంచినారు. ఇంతలో దూరమున పడవ యొకటి కనబడినది. 'పడవోయి పడవ, ఓయిపడవ' అని ఇరువురును అఱచినారు. రెండు పర్యాయములు వీరిమాటలు వారికి వినబడలేదు. తర్వాత విని, వీరు గుడ్డను పిండి విసరగా చూచి పడవవాండ్రు వచ్చినారు; 'ఏంబ్రామ్మలయా, ఏంపనయా గోదారిలో' అని కసరుచు ఎక్కించుకొని గట్టుచేర్చిరి.
ఇంతలో నెవరో వారి తండ్రిగారికడకు పోయి వారితో "శాస్త్రులవారూ, మీకొమాళ్లు ఈతపంద్యాలు వేసుకుని