ఈ శృంగారనైషధ వ్యాఖ్యంగూర్చి మదరాసులోను నెల్లూరులోను శాస్త్రులవారు కొన్ని యుపన్యాసముల నొసంగిరి. ఆయుపన్యాసములలో నొకదానిని వినుటకు 'శ్రీ విక్రమసింహపురీ పౌరవతంసులు, శ్రీయుత రేబాల లక్ష్మీనరసారెడ్డిగారు విజయంచేసి విని తత్ప్రబంధప్రౌడికి కరమానందించిరి,' అనంతరము, "శ్రీ గునుపాటి యేనాదిరెడ్డి గారు మన్మిత్త్రులు నాకు ముప్పదియేండ్లుగా ప్రతివర్షకుటుంబపర్యాప్తథాన్యదాత - మదీయ శృంగారనైషధ వ్యాఖ్యాముద్రణార్థమై ధనముంగూర్చుటకు సమకట్టి, శ్రీయుత రేబాల లక్ష్మీనరసారెడ్డి గారితో 'అయ్యా, రెండుమాసములు నేను మీసన్నిధింబాసి యీజిల్లాలో సంచరింపవలసియున్నది.' అని నుడివిరి. అంతట శ్రీ రెడ్డిగారు 'ఏలసంచారమేగెదవు ? అని యడిగిరి. 'వేదము వేంకటరాయశాస్త్రిగారి శృంగారనైషధ వ్యాఖ్యాముద్రణార్థము ధనమార్జించుటకు' అని ఏనాదిరెడ్డి గారు బదులుపలికిరి. 'నీవు మత్సన్నిథానవర్తివైయుండి బిచ్చమునకుపోయెదవా!' అని రెడ్డి గారు నవ్వుమంబలికిరి. 'నాకై యాచించిన, నది బిచ్చమగునుగాని, నా గురువుగారిపుస్తకము ముద్రించుటకై యడుగుట బిచ్చమేలయగును?' అని యేనాదిరెడ్డిగారు వచించిరి. అంత ఆదొడ్డదొర సుగృహీతనాములు లక్ష్మీనరసారెడ్డి గారు 'సరిలేవోయి దానిని మేమును వినియున్నాము, దానినిముద్రించుటకు ఏపాటిపైకముపట్టును?' అని ప్రశ్నించిరి. 'సుమారు