"శ్రీమన్మదరాసు రాజథానియందు మ.రా.రా.శ్రీ, వేమూరు వేంకటకృష్ణమసెట్టిగారును తత్పుత్రులును ఆనంద ముద్రాక్షరశాల యనుపేర నొక యచ్చకూటమును స్థాపించి యున్నారు. వీరు ముఖ్యముగా ఆంధ్రప్రబంధముల నభిమానించి ముద్రించుచున్నారు. వీరియుద్యమ మేమనిన - ఈభాషయందు సద్గ్రంథములను లేఖకాది ప్రమాదజనిత దోషరహితముగా బండితులచే శోధింపించి ముద్రణసేసి లోకోపకార మొనర్పవలయునని, ఈయుద్యమమును నెఱవేర్చుటకై వీరు శోధన దాక్ష్యార్థము ఎంత ధనవ్యయమునకేని వెనుదివిసినవారు కారు. వీరి యీయుద్యమమునకు సంతసిల్లమి మూర్ఖత. వీరి యుద్యమము నెఱవేరి వీరికి కీర్తిగలుగు గావుత.
"ఇది సరియేగాని వీరికి గ్రంథములు శోధించుటకు వ్యుత్పన్నులు దొరకలేదు. కూలికిం జొరబడినవాడెల్ల బండితుండా? అచ్చుగూటపు మున్మానిసి కటాక్ష వీక్షణమునకు బాత్రమయిన మాత్రాన నొకడు పండితుడా? వీరికై తోడ్పడినవారికి తెలివిచాలమిచే వీరు ముద్రింపించిన గ్రంథములు సీతారామాచార్య పండితవర్య ద్విరేఫమాలికా బాలచంద్రోదయమాత్ర విజ్ఞేయములగు శకటరేఫార్థానుస్వారముల శోధనామాత్రమునం బరిడవిల్లుచు, కడమవిషయములం గుంటుపడుచు, వీరికి కీర్తికి బదులు ఆకీర్తిందెచ్చుచున్నవి. అచ్చు చక్కనిది, అట్ట గట్టిది, తప్పులు మెండు అని యీముద్రణగుణమును నాలుగు మాటల సంగ్రహింపవచ్చును..........