ద్వితీయాంకము
29
ఘంట:- గరిటెడు మీకూ, అరగరిటెడు అబ్బాయిగారికి పోశాను.
లింగ:- మిగిలిందీ?
ఘంట:- చద్దన్నాల్లో సరిపెట్టాను.
లింగ:- నీవో?
ఘంట:- బజార్లోంచి బంగాళాదుంపల కూర తెచ్చుకున్నాను.
లింగ:- ఏడిచినట్లే యున్నది. కాని యెన్నడు నీలాంటి విఁక నింటికి గొనిరాకు! ఆవాసన తగిలి అబ్బాయికూడా పాడుకాఁగలడు! తెలిసినదా? ఇదిగో కరివేపచెట్టు మీఁద కాకి గూడు పెట్టినది. ఇంతలో డొంకినితో దానిని బడద్రోసి ఈ పూఁట పొయిలోనికి సిద్ధము చేసికో. కరివేపమండ రాలినచో కడుపు చీల్చెదను సుమా!
ఘంట:- రామరామా! పక్షిగూడు పడగొట్టడం పాపం కాదండీ?
లింగ:- పాప మేమిటి నీ బొంద! ఖరసంవత్సరములో మా ఇంటి వంటంతయు కాకిగూళ్ళతోనే వెళ్ళిపోయినది.
ఘంట:- ఇదేఁమిటండీ! యింత ఘోర మెక్కడా చూళ్ళేదు. ఇల్లాంటి పనులు మాత్రం ఇంకెప్పుడూ చెప్పకండే. (నిష్క్రమించును.)
లింగ:- దరిద్రపుఁ గుంకలకు ధర్మపన్నములు మెండు! ఆ వాజె వన్నెల విసనకర్ర యిగుటంబట్టి వంటకుంకలను బెట్టుకొనక వల్లపడకున్నది. కుర్రవానికి వివాహమై, యా కుర్రది కాఁపురమునకు వచ్చువఱకు నీకుంక కుద్వాసన చెప్పుటకు వీలులేదు.
బస:- (ప్రవేశించి) నాన్నా! అమ్మకు మొన్న బండికట్టినవాడు అద్దెకొఱకు వచ్చి యఱచుచున్నాడు.
లింగ:- ఇంటిలో లేరని చెప్పకపోతివా? బాబూ! పదునారేండ్లు పయింపడినవి ఇప్పటికైన నీకీపాటి యూహ పుట్టలేదేమిరా?
బస:- ఉండఁగా లేరని చెప్పుట కూహ యెందులకు నాన్నా? అబద్ధమాడఁగూడదని మా టీచర్లనేక పర్యాయములు చెప్పినారు.
లింగ: -మీ టీచర్లిట్టి మెట్టవేదాంతములు కూడఁజెప్పుచున్నారుగా? సరే, యిఁకనేమి చదువు సంగతి చక్కగానే యున్నది!
బస:- ఫవుంటెను పెన్నుకుఁ బయిక మిచ్చెదవా?