పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/758

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్యక్తులు రెండు రేకు పళ్ళెములు తీసుకుని చేతులకు ఎదో ఆకు పసరు పూసుకుని దూరంగా నిలబడతారు. వారు చేతులకు పూసుకున్న పసరు ప్రభావం వల్ల వారి హస్తాల్లో వున్న పళ్ళెములు ఒక్కసారి పైకి ఎగిరి రెండు పళ్ళెములూ కొట్టుకుని మరల యథాస్థానాన్ని చేరుకుంటాయి.

రొమ్ముమీద ఆకు:

అలాగే మరొక వ్వక్తి రొమ్ము మీద ఒక ప్రత్యేకమైన ఆకును అతికించి ఆ ఆకును గురిచూసి కొట్టవలసిందిగా ఒక తుపాకిని ప్రేక్షకులలో ఎవరు ముందుకు వస్తే వారికిచ్చి రొమ్ము మీద ఆకును గురి పెట్టి కొట్టమంటారు. అలా గురిచూచి ఎవరైనా కొట్టి నట్లైతే ఆ గుండు రొమ్ములోపలి భాగానికి పోక ఆ ఆకును కొట్టుకుని అక్కడే పడిపోతుంది. ఆ ప్రదేశంలో ఈ విధమైన గాయమూ మనకు కనిపించదు. ఇది కని కట్టో ఆకు పసరు ప్రభావమో లేక ఇంద్ర జాలమో మనకు తెలియదు గానీ వారు ఇలాంటి ప్రదర్శనలో నిజంగా సాధనాశూరులే. ఈ సాధనా శూరులు ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ తాలూకా వల్లభాపురంలో వున్నారు. ఈ ప్రదర్శన ద్వారా వీరు జానపదులను దిగ్భ్రాంతులను చేస్తారు.


గంట జంగాలు

శైవ, వీరశైవ మతానికి చెందిన వీరముష్టులూ, జంగాలూ, వారి వారి కళారూపాలే కాకుండా ఒంటరిగా జంగం దేవర వేషంలో ఇంటింటికీ తిరిగి వ్యాచిస్తూ వుంటారు. సాంబసదాశివ సాంబ సదాశివ, శంభో శంకర అంటూ శంఖాన్ని పూరిస్తూ, నందిమకుటంగా గల గంటను వాయిస్తూ, బసవ పురాణంలోని బసవేశ్వరుని సూక్తులను సోదాహరణంగా ఉదహరిస్తారు.

బసవేశ్వరుడుగా వేషధారణను తీర్చి దిద్దుకుంటారు. వారిలో ఎంతో పూజ్యభావం గోచరిస్తుంది. పైనుంచి