పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండవ అధ్యాయం అంగనిరూపణ, మూడవ అధ్యాయం మండల లక్షణం, నాలుగవ అధ్యాయం, కరణాంగహార వివేచనానికి సంబంధించినది. ఐదవ ఆధ్యాయం దేశి, స్థానక, కరణ, భ్రమరీ లక్షణాలను తెలుపుతూ వుంది. ఆరవ అధ్యాయం దేశ పాట, చారీలాస్యాంగ గతి లక్షణమనే పేరు గలది. 6-7-8 అధ్యాయాలు ఆ నాటీ ఆంధ్రదేశంలో వాడుకలో వున్న దేశి, నృత్త పద్ధతులన్నీ వివరించేవిగా వుండి గ్రంథ ప్రాముఖ్యాన్ని ఎంతగానో చాటుతున్నాయి.

జాయప నృత్తరత్నావళిలో తన కాలంలో ప్రచారంలో వున్న దేశీ నృత్యాలన్నింటినీ అమూలంగా చిత్రించాడు. ఎనిమిది ఆధ్యాయాలు గల ఈ గ్రంథంలో కడపటి మూడు అధ్యాయాలూ దేశి నృత్య సాంప్రదాయాలైన పేరణి, ప్రేంఖణం, రాసకం, చర్చరి, నాట్య రాసకం, దండ రాసకం, శివప్రియం, చిందు, కందుకం, భాండికం, ఘంటసరి, చరణము, బహురూపం, కోలాటం, మొదలైన ప్రాంతీయము లైన అనేక జానపద నృత్యాలను వివరించాడు.

జాయప నృత్తరత్నావళిని పరికించి చూస్తే భరతముని ప్రసాదించిన భరత నాట్యశాస్త్ర గ్రంథంతోనూ, భరత నాట్యంపై ఆభినవ గుప్తాచార్యుల వ్యాఖ్యానం తోనూ జాయపకు పరిపూర్ణ పరిచయం వున్నట్లు తోస్తూవుందని క్రీ॥శే॥ మల్లంపల్లి వారు అదే వ్యాసంలో వ్రాశారు.

జాయప నృత్యరత్నావళిలో నృత్యానికి అనుగుణమైన సంగీత రత్నావళిని గూడ అనుబంధంగా రచించాడట. కాని దురదృష్ట వశాత్తూ అది లభ్యం కాకుండా పోయింది.

జాయప 1213 వ సంవత్సరం నాటికే సాల నాట్య వైదికమణి అనీ, కవి సభాశిఖామణి అనీ పేరొందాడు. జాయప నృత్తరత్నావళిని 1253 - 54 నాటికి రచించండం వలన దాదాపు 60 సంవత్సరాల వయసులో వ్రాసి వుండ వచ్చు. ఏమైనా ఈనాడు ఆంథ్రుల గర్వించగగిన పురాతన నృత్యశాస్త్ర గ్రంథాలలో నృత్తరత్నావళి మణి భూషణం.