నాల్గవ ప్రకరణము.
267
నన్ను చూడ నభిలషించి నే నెక్కడనుంటినో తెలియక నాటిదినమున నే నుపన్యసింపఁ బోవుచున్నానని పత్రికాముఖమున నెఱిఁగి యుపన్యాసభవనమునకు నన్ను వెదకుకొనుచు వచ్చిచూచి యాలింగనముచేసికొని ప్రియశిష్యునితోడి సుఖసల్లాపమునందు కొంచెముసేపుగడపి, అయిదు రూపాయలు చందా నిచ్చిపోయిరి. నేనీప్రకరణమునందు వ్రాసినదానిలో విశేషభాగమీదినమునఁ జేసిన యుపన్యాసమునుండి కైకొనఁబడినదే. అప్పు డీయుపన్యాసమునందు పైడా రామకృష్ణయ్యగారినిగూర్చి యిట్లు చెప్పితిని. -
"ఈ వ్యయములన్నియు శ్రీ పైడా రామకృష్ణయ్యగారు మహౌదార్యముతో మాసమాజమునకు దయచేసిన పదివేలరూపాయలతోనే జరపఁబడినవి. ఈయన సాహాయ్యమే లేక యుండినయెడల మేమిందులో నొక్క వివాహమైనను జేయుటకు సమర్థులమై యుండము. కాఁబట్టి యీవివాహములకంతకును మూలాధార మీ మహాపురుషుఁడేయని నిస్సందేహముగా చెప్పవచ్చును. ఈయన కీమధ్య లక్షయేఁబదివేల రూపాయలు నష్టము వచ్చినను, ఇప్పటికిని బహువిధముల నీమహాకార్యమునకు తోడుపడుచు నేయున్నాఁడు. ఈ పదివేలరూపాయలునుగాక మొదటి రెండు వివాహములకు నయిన సమస్తవ్యయములను వహించుటయేకాక, ఈయనయే కొన్ని గృహములను సహితము పునర్వివాహదంపతులు కాపురముండుటకయి సమాజము వారివశమున నుంచి యున్నాఁడు. పరోపకారశీలుఁడైన యీదయా శాలియొక్క యీ యోగ్యదానమును నేను వర్ణింపవలసినపనిలేదు. ఈయిచ్చిన ధనముపోయినను, తనువులుపోయినను, మఱియేమిపోయినను, ఈయనకీర్తి యీ భూమండలములో స్థిరముగా నుండకపోదు. నావంటివారు కొందఱు పనిముట్లవలె కొంత యుపయోగపడినను, ఈకార్యవ్యాపనమున కీఘనుఁడే ముఖ్యకారణుఁడు."
ఈయుత్తమపురుషుని దృష్టాంతమునుజూపి సభవారిని సత్కార్యమునకుఁ బురికొల్పి