నాల్గవ ప్రకరణము.
263
జనులకు విశ్వాసము కలిగించుటకయి మాచేతనైన దంతయు చేసియున్నాము. ఈశ్వరాశీర్వాదమువలన మేము కడచిన మూఁడుసంవత్సరములలోపల బాలవితంతువులయొక్క పండ్రెండువివాహములను చేయునంత కార్యసాఫల్యము నింతవఱకు పొందియున్నాము ; సాంఘికక్రౌర్యమునకు తాళుటకయి శక్తులనుగాఁజేయుటకొఱకు కొంత ధనసాహాయ్యముచేయఁబడెడు పక్షమున, వివాహములు చేసికొనుట కనేక బాలవితంతువులును యౌవనపురుషులును నున్నారని చెప్పుటకు మేము సంతసించుచున్నాము. హిందూస్త్రీల పునర్వివాహమును ప్రోత్సాహపఱుచుటకయి లంచములిచ్చు పద్ధతిని దేనిని అవలంబించుటకు మేము ప్రతికూలురముగా నున్నాముకాని సంఘముయొక్క ప్రస్తుతస్థితిని బట్టి కొంత ధనసాహాయ్యమత్యంతావశ్యకమయినట్టు కనఁబడుచున్నది. ఈ కార్యములకు విరోధముగా దురాగ్రహము బలముగా నున్నందున, ఈ వివాహములు చేసికొన్న వారు సర్వవిధములైన బాధలకును లోఁబఱుపఁబడుచున్నారు. వారు తల్లిదండ్రుల యిండ్లనుండి వెడలఁగొట్టఁబడుచున్నారు ; బంధువులచేత విడిచి పెట్టఁబడుచున్నారు ; సేవకులు వారిని విడిచి పోవుచున్నారు ; జనులవద్ద పనిలోనుండుట తటస్థించినపక్షమున, వారు పనులలో నుండి తీసివేయఁబడుచున్నారు. కాఁబట్టి యట్టివారిని మరల సంసారయాత్ర యందు నిలువఁబెట్టుటకయి కొంత ధనసాహాయ్య మావశ్యకముగా నున్నది. మేము కొన్ని సమయములయందు వారికి కాపురములుండుటకయి యిండ్లియ్య వలెను ; రోగసమయములయందు సాయము చేయవలెను ; విద్య చెప్పింప వలెను ; స్వయముగా సంపాదించుకొనుటకు శక్తులగువఱకును వారి జీవనమున కాధారములు కల్పింపవలెను. ఇవిగాక, మేము వివాహవ్యయములను భరింప వలెను. అపరిమితమయిన జీతములిచ్చి సేవకులను పెట్టవలెను ; పెండ్లి తంతును నడుపుటకయి పురోహితునికియ్యవలెను. ఇంతవఱకు మేమీవ్యయముల నన్నిటిని అత్యంత దేశాభిమానియు పరోపకార బుద్దియు కాకినాడనివాసియు నయిన పైడా రామకృష్ణయ్య సెట్టిగారు మావశములోనుంచిన దనము (సుమారు