162
స్వీయ చరిత్రము.
పయియుత్తరము నాకానెల యెనిమిదవతేదిని చేరినది. మనుష్యులను నాలుగైదు దినములలోఁ బంపుచున్నానని 10 వ తేదిని బ్రహ్మానందముగారికి లేఖవ్రాసి, నేనావిషయమైన కృషిలోనేయుంటిని. ఈవిషయమయి విశేష శ్రద్ధనువహించి తాము రాజమహేంద్రవరమునకు వచ్చినప్పటినుండియు ఆత్మూరి లక్ష్మీనరసింహముగారు నాకు సర్వవిధముల సహాయులుగానుండిరి. పంపవలసిన మనుష్యులవిషయమున నేనాయనతో నాలోచించి, ఆయన తన కార్యస్థానమునందు కొలువులో నుండి మిక్కిలి తెలివిగలవాఁడును పరమ విశ్వాసియు నయిన యొకభటునికి సెలవిచ్చి నేను పంపఁదలఁచుకొన్న నా మిత్రునికి తోడుగా వెళ్లుటకయి యాభటుని దయాపూర్వకముగా నావశము చేయఁగా, ఈ కార్యములయం దత్యంతాదరముకలిగి ప్రథమశాస్త్ర పరీక్ష యందు కృతార్థుఁడయి మొదటినుండియు మాతో పనిచేయుచుండిన సోమంచి భీమశంకరముగారిని నాలేఖతో బ్రహ్మానందముగారియొద్ద కానెల 15 వ తేదిని బంపితిని. ఇటువంటి కార్యములలో పేరు వెల్లడియైనచో కార్యభంగము కలుగును గనుక, ఆచిన్నది యేగ్రామమునందుండెనో, ఆచిన్న దానితల్లి పేరేదో, మేము పంపినమిత్రునకుసహితము చెప్పక రహస్యముగానేయుంచి బ్రహ్మానందముగారిని కలిసికొన్న తరువాత కర్తవ్యమును సమస్తమును వారే చేసెదరనిమాత్ర మాయనతో చెప్పితిని. నామిత్రుఁడు రాజమహేంద్రవరమునువిడిచిన రెండుదినములకు బ్రహ్మానందముగారు వ్రాసిన యుత్తర మొకటి నాకు చేరినది. ఆయన తిరువూరినుండి 14 వ తేదిని వ్రాయఁగా 17 వ తేదిని నాకందిన యాలేఖలో నిట్లు వ్రాయఁబడియుండెను : -
"పదవతేదిగల మీయుత్తరలాభమును వందనములతో నంగీకరించుటకు నేను మిక్కిలి యానందము నొందుచున్నాను. కాని, వెంటనేపోయి తహశ్శీలుదారుగా వినుకొండతాలూకా నొప్పగించుకోవలసినదని యాజ్ఞాపించుచు నిన్నటిదిన మాకస్మికముగా నాకుత్తరువు వచ్చినదని మీకుచెప్పుటకు నేనెంతయు చింతనొందుచున్నాను. నేనక్కడ నలువదిదినము లుండవలసి యుం