నీచపు దావులయందును జందమామ వెన్నెల గాయకుండ నుండడుగదా!
మఱియు నగ్ని బ్రాహ్మణులకు బూజ్యుడు. అన్ని వర్ణములవారికి నిజమైన బ్రాహ్మణుడు పూజ్యుడు. స్త్రీలకు భర్త పరమపూజ్యుడు. ఇంటికివచ్చిన యతిథి యందఱకు బరమపూజ్యతముడు. ఎవ్వడింటికి వచ్చిన యతిథిని, నిరాశతో వెడల గొట్టునో వాని సుకృత మా యతిథికి జెందుననియు, నాయతిథి చేసిన పాప మాతని వెడలగొట్టిన వానికి వచ్చుననియు బెద్దలు చెప్పుదురు. అతిథి సర్వదేవలతో సమానుడు. వాడెట్టి నీచుడైనను గౌరవమున కర్హుడు." అని పిల్లి చెప్పిన సంగతులు విని గ్రద్ద మరల నిట్లనెను. "పిల్లులకు మాంసమనం దెక్కువ యిష్టము. పక్షిపిల్లల రక్షణభారము నామీద నుండుటచేత నిట్లంటిని." అనగానే యాబిడాలము చెవులు మూసికొని యిట్లు పలికెను.
"హరిహరీ! ఎంతమాట వినవలసి వచ్చినది! ధర్మ శాస్త్రములు విని, కోరికలు విడిచి చాంద్రాయణవ్రత మాచరించుచుంటిని. ఇతర విషయములను గుఱించి పరస్పరవిరోధము లెన్ని యున్నను ధర్మశాస్త్రము లన్నియు "అహింస పరమధర్మ" మని యేకగ్రీవముగా ఘోషించుచున్నవి. సర్వజీవులయందు దయగలిగి యుండి యహింస నవలంబించువానికి స్వర్గము స్వాధీనమై యుండును. మరణము కలుగునన్నచో బుట్టుదుఃఖము వర్ణింపనలవికానిది. ఒకరి ప్రాణములు దీసి