216
ఒక యోగి ఆత్మకథ
శ్రీ యుక్తేశ్వర్గారి వంటి గురువులు అంతకన్న విశాలమైన సామ్రాజ్యాన్ని - మానవ హృదయాల్లో జయిస్తారు.
తమ శిష్యుల లోపాల్లో చిన్నవాటినీ పట్టించుకోనవసరం లేనివాటినీ ఉత్పాతాన్ని సూచించేటంత తీవ్రంగా ఎత్తిచూపడం గురుదేవుల అలవాటు. ఒకనాడు మా నాన్నగారు శ్రీ యుక్తేశ్వర్గారి దర్శనం కోసం శ్రీరాంపూర్ వచ్చారు. నాన్నగారు నా గురించి మెప్పుగా నాలుగు మాటలు విందామని ఆశించి ఉండవచ్చు. కాని నాలోఉన్న లోపాల్ని వరసపెట్టడం వినేసరికి అదిరిపోయారు. వెంటనే నా దగ్గరికి వచ్చారు.
“మీ గురువుగారి మాటల్ని బట్టి నువ్వు పూర్తిగా ధ్వంసమయావని అనుకోవలసి వస్తోంది!” కన్నీళ్ళకీ నవ్వుకీ మధ్య అవస్థలో ఉన్నారు నాన్నగారు.
ఆ సమయంలో శ్రీ యుక్తేశ్వర్గారి అసంతుష్టికి కారణం ఒక్కటే - ఒకతన్ని ఆధ్యాత్మిక మార్గంలోకి మార్చే విషయమై, గురువుగారు ఆ పని వద్దని సౌమ్యంగా సూచించినప్పటికీ నేను అందుకు ప్రయత్నిస్తూ ఉండడమే. నేను రోషంగా గబగబా గురువుగారి దగ్గరికి వెళ్ళాను. చేసిన తప్పు తెలిసినవారిలా, నన్ను చూసి కళ్ళు కిందికి వాల్చుకున్నారు. ఆ దివ్య సింహం నా ఎదుట అంత సౌమ్యంగా ఉండగా చూడడం అదొక్క సారే, ఆ ఏకైక క్షణాన్ని పూర్తిగా ఆనందించాను.
“స్వామీ, మా నాన్న గారిదగ్గర నా గురించి అంత నిర్దయగా మాట్లాడి ఆయన విస్తుపోయేటట్టు ఎందుకు చేశారు? అది న్యాయమేనా?”
“ఇంకెప్పుడూ అలా చెయ్యను.” శ్రీయుక్తేశ్వర్గారి కంఠస్వరం క్షమాపణ చెప్పుకొంటున్నట్టుగా ఉంది.
చటుక్కున నేమ నిరాయుధుణ్ణి అయిపోయాను. ఆ మహాను