18
ప్రత్యేకాంధ్రరాష్ట్ర నిర్మాణము (1953)
ప్రకాశంగారి కబురు అందుకొనివచ్చి, సంజీవరెడ్డిగారు ఆయనను చెన్నపట్నంలో కలుసుకొన్నారు. రెండు పర్యాయాలు కలిసి చర్చించిన ఫలితంగా, జవహర్లాల్ నెహ్రూగారితో ఈ విషయం చర్చించడానికి నిర్ణయించారు.
సంజీవరెడ్డిగారు ఇలా ప్రకాశంగారితో కలుసుకోవడం, ఆయన సీనియరులైన గోపాలరెడ్డి, వెంకటరావుగారలకు ఇష్టంలేదు. అలాగే ప్రకాశంగారు సంజీవరెడ్డిగారితో ముచ్చటించడం, ప్రకాశంగారి అనుయాయులకు చాలా మందికి ఇష్టంలేదు.
ఇష్టంలేకపోయినా - ప్రకాశంగారు, నేనూ వారందరినీ ఒప్పించ గలిగాము.
పార్టీసమావేశ మొకటి ఏర్పాటుచేసి, ప్రకాశంగారి చర్యను ఆమోదిస్తూ, ఆ చర్యలు శాంతంగా సాగించవలసిందని తీర్మానం వ్రాసుకొన్నాము.
దీంతో ఆంధ్రదేశంలో అందరినీ ఆవరించిన స్తంభనంపోయి, నిర్మాణాత్మకమైన ఒక సంచలనం కలిగింది. తమిళ జిల్లాలలోకూడా కలవరము, సంతోషమూ రెండూ కలిసి, రాజకీయవాదుల మనస్సులను భాధించసాగాయి. కొందరికి సంతృప్తి కలిగింది.
ఆ తర్వాత రంగస్థలం ఢిల్లీకి మారింది.
ఢిల్లీలో ప్రకాశం, నెహ్రూగారల కలయిక
జవహర్లాల్ నెహ్రూగారు నిర్ణయించిన తేదీకి ప్రకాశంగారు, నేనూ ఢిల్లీ వెళ్ళాము. అక్కడ కాన్ట్సిట్యూషన్ హౌసులో బస చేశాము. సంజీవరెడ్డిగారు అంతకు ఒకరోజు ముందుగానే వెళ్ళారు.
ఆ తర్వాత రోజున నెహ్రూగారిని సంజీవరెడ్డిగారు కలుసుకోడానికి వెళ్ళారు. నెహ్రూగారు రెడ్డిగారితో, "ఏమయ్యా సంజీవరెడ్డి!