ప్రభుత్వాన్ని సవాలు చేయడం జరిగాక, రాబోవు కాంగ్రెస్ కెవర్ని అధ్యక్షుడుగా ఎన్నుకోవాలి అన్న సమస్య ఉత్పన్నం అయింది.
ఆరేడు మాసాలపాటు మలయా, సయాం, ఇండోచైనా దేశాలలోని కష్టజీవుల స్థితిగతులెల్లా ఉన్నాయో స్వయంగా తెలుసుకోవాలని ఆ ప్రాంతాలన్నీ కలయ తిరిగి, నేను భార్యా సమేతంగా చరిత్రాత్మకమూ, చిరస్మరణీయమూ అయిన ఆ లాహోరు కాంగ్రెస్కు అందుకోగలిగాను. ఆ మూడు దేశాలలోనూ జరిపిన పర్యటన విశేషాలు "స్వరాజ్య పేపరు" అన్న శీర్షిక క్రింద విడిగా వివరిస్తాను.
గాంధీగారి నిర్ణయం
ఓటింగ్ సమయంలో అందరి కళ్లూ గాంధీగారిమీదే ఉన్నాయి. గాంధీగారికి అత్యధికంగా ఓట్లు వచ్చాయి. ఆయనకి వచ్చిన ఓట్లు పది; విఠల్భాయ్ పటేల్కి అయిదూ, జవహర్లాల్కి రెండో మూడో ఓట్లు వచ్చాయి. అయితేనేం, గాంధీగారు తగ్గిపోయారు. విఠల్భాయ్ తప్పుకున్నాడు. దాన్తో యువకుడయిన జవహర్లాల్ నెహ్రూ లాహోరు కాంగ్రెస్ అధ్యక్ష స్థానాన్ని అలంకరించవలసి వచ్చించి.
అదే గాంధీగారి విచిత్ర పద్ధతి. మదరాసు కాంగ్రెస్లో జవహర్లాల్ 'స్వాతంత్ర్య' తీర్మానాన్ని ప్రతిపాదిస్తే, "ఏదో స్కూలు పిల్లల తమాషా" అన్నాడు గాంధీ. కలకత్తాలో మోతీలాల్ నెహ్రూగారితో కలిసి, అ స్వాతంత్ర్య తీర్మానాన్ని వెనక్కి నెట్టి, అన్ని పార్టీలవారికీ అంగీకార యోగ్యమయిన విధంగా అ తీర్మానాన్ని మితవాదంలోకి దింపి, బాగా తేలికపరచి ఆమోదింపజేశాడు. ఆ తర్వాత ఎంతో జాగ్రత్తగా పరిశీలించి, చాలావరకూ నిర్వీర్యం చేయబడిన ఆ తీర్మానాన్నయినా బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించకపోతే ఏడాది నాటికి ప్రత్యక్ష చర్యలకు పూని, మా జాతీయ పతాకం ఎగరవేస్తాం అన్నాడు.
లాహోరు కాంగ్రెస్కి పెద్ద మెజారిటితో ఆయన్ని అధ్యక్షుడుగా ఎన్నుకుంటే, తాను మొదటినుంచీ మితవాదిననీ, మితవాదిగానే తాను ఉంటూవున్న కారణాన్ని ప్రస్తుత పరిస్థితులలో కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి తాను తగననీ, ఉడుకు రక్తంతో ఉన్న జవహర్ లాంటి యువకుడే