అప్పటికే ఆయన తలప్రాణం తోకకి వచ్చినంత పనయింది. ముందు కార్యక్రమం నడపగల ఓపిక ఆయనలో సన్నగిల్లింది. అందులో విశ్వనాథంగారి ప్రతిపాదన కొరకరాని కొయ్యే. ఆత్రుత కలిగించేదే. పైగా తాను కాంగ్రెసు అధ్యక్షుడుగా ఉండగానే, స్వరాజ్యపార్టీని శంకించే పరిస్థితి!
2
మదరాసు కాంగ్రెస్ - స్వాతంత్ర్య తీర్మానం
గౌహతి కాంగ్రెస్ (1926) అధ్యక్షుడుగా శ్రీనివాసయ్యంగారు మరుసటి సంవత్సరపు కాంగ్రెస్ను మదరాసుకు ఆహ్వానించడమూ, ఆ ఆహ్వానాన్ని మన్నించి 1927 లో డా॥అన్సారీ అధ్యక్షతను చెన్నపట్నంలో కాంగ్రెస్ను జరపడమూ సంభవించింది. ఆ మదరాసు కాంగ్రెసువారు రెండు ముఖ్య మయిన తీర్మానాలని ప్యాసు చేశారు: మొదటిది స్వాతంత్ర్యానికి సంబంధించింది; రెండవది సైమన్ కమిషన్ను బహిష్కరింప వలసింది అన్నది.
హజరత్ మొహనీ అభిలాష
దేశానికి స్వాతంత్ర్యం అనే అభిప్రాయం 1921 లో అహమ్మదాబాదు కాంగ్రెస్లో ఆవిర్భవించింది. అదే రోజులలో అహమ్మదాబాదులో జరిగిన ముస్లిం కాన్ఫరెన్స్ అధ్యక్షుడయిన హజరత్ మొహనీ (Hazrath Mohani) దేశ స్వాతంత్ర్యం పట్ల తాను సుముఖుడనేనని వ్యక్తపరిచాడు. స్వభావసిద్ధంగా మహాత్మగాంధీ, తాను స్వయంగా ప్రత్యక్ష చర్యలకు సిద్ధమయ్యే పరిస్థితి ఉత్పన్నమయ్యేదాకా, మితవాదిగానే ఉండాలని కోరుకునే బాపతు వారు. అందుచేత హజరత్మొహనీ, స్వాతంత్ర్య ప్రస్తావన వచ్చినప్పుడు, తాను స్వాతంత్ర్యాన్నే కాంక్షిస్తున్నానని చెప్పేసరికి, ఆ కబురు విని గాంధీగారు విస్తుపోయారు.
తాను శాసనధిక్కారం ప్రవేశ పెట్టేలోపల, నిర్మాణం కార్యక్రమ