పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

70

మహాపురుషుల జీవితములు

రాదయ్యె. అమెరికాఖండమునకుఁ బోయినవెనుకనే యీతనియం దణగియున్న జ్ఞానవిశేషమంతయు బయలుపడుటయు నందుమూలమున లోకమంతయు నతని నెఱుఁగుటయు సంభవించెను.

అమెరికాఖండమున యునైటెడుష్టేట్సను దేశము గలదు. అందు షికాగోయను గొప్పనగరమున్నది. ఆ దేశస్తులందఱు కోట్లకొలఁది ధనము చందామూలమున జేర్చి షికాగోనగరమున 1893 సంవత్సరమున గొప్పప్రదర్శనము జరిగించిరి. ఆప్రదేశమునందే దేశపు మనుష్యులు మున్నెన్నఁడు జూచియుండని చిత్రములు చూచునట్లును విని యెఱుగని సంగతులు వినునట్టును తత్కార్య నిర్వాహకు లేర్పరచిరి. ఆ ప్రదేశమునందే సర్వమతములఁగూర్చియు జర్చలు జరపఁదలంచి మతమహాసభ (Parlament of Religions) నొక దాని నచ్చటివారు కూర్చిరి. ఆమతమహాసభకు వివిధదేశములవారు తమతమ మతములయందలి మేలిసంగతుల ప్రపంచమునకు దెలియునట్లచ్చట నుపన్యసింప దలంచి యా నగరమునకుం బోయిరి. వివేకానందస్వామియు బవిత్రమైన యుపనిషన్మతమును బ్రహ్మవిద్యను నాగరికతతో దులతూఁగుచున్న పశ్చిమఖండ వాసులకు నమెరికాఖండవాసులకుఁ దెలుఁపగోరి యా మతమహాసభకుఁ బోవ సమకట్టెను. గాని ప్రయాణము ధనమూలముగదా. అదివఱకె సన్యసించియున్న యామాహాత్మునకు ప్రయాణమునకుఁ గావలసిన ధనము చిక్కకపోవుటచేతను తనదేశస్థులెవ్వరు దనపూనికకుఁ దోడుపడకపోవుట చేతను వివేకానందుఁడు చెన్న పట్టణము వచ్చి తన యుద్యమ మచ్చటి పెద్దమనుష్యుల కెఱిఁగించెను. నివురుగప్పిన నిప్పువెలెనున్న యాతనిజాడ నెఱిఁగి చెన్న పురివారు కొంత ధనమిచ్చి యాయన నమెరికాఖండమునకుఁ బంపిరి.

స్వమతములంగూర్చి యుపన్యసించుటకు షికాగోనగరమునకు మన దేశమునుండి వెళ్ళిన పురుషుఁడొక్కఁడేగాడు. బ్రహ్మసమాజ