పుట:Kulashekhara-mahiipaala-charitramu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

ప్రథమాశ్వాసము


క.

అందొక దేశికమణి ని
ష్పందముకుందాంఘ్రిభక్తి భజనాసక్తిం
జెంది సికతాతలమ్మున
సుందరపద్మాసనైకశోభితుఁ డగుచున్.

31


వ.

విచ్చేసియున్నయెడ శిష్యప్రవరు లయ్యాచార్యపురుషునకుఁ బ్రదక్షిణ
ప్రణామమ్ములాచరించి యంజలిపుటంబులు నిటలతటంబులం గదియించి యిట్లని
విన్నవించిరి—

32


ఉ.

దేవరవారు మున్ను వసుదేవకుమారక భక్తవృత్తముల్
పావనసూక్తులం దెలియఁబల్కితి రక్కులశేఖరాభిధా
నావనిభర్త సచ్చరిత మద్భుతరూప మనంగ నాత్మలన్
దావలమయ్యెఁ గౌతుకము దాసులకున్ గృప నానతీదగున్.

33


క.

అనుచుం బ్రార్థించిన శి
ష్యనికాయము జూచి పలికె నాచార్యుఁడు మీ
రనుపమభక్తిన్ వేడిన
ఘనుచరితంబిపుడు దెలియఁగా వివరింతున్.

34


క.

శ్రీదమ్ములు దళితాశ్రిత
ఖేదమ్ములు దుష్టహ్వద్విగీతాచారో
చ్ఛేదమ్ములు శోషితభవ
శాదమ్ములు విష్ణుభక్తజనపాదమ్ముల్.

35


క.

పావనములు వినమితసుజ
నావనములు విబుధకోకిలాశ్రయణమధు
శ్రీ వనములు కృతముని సం
భావనములు విష్ణుదాస పదసేవనముల్.

36


వ.

అదిగావునఁ బ్రపన్నపురుషశ్రేష్ఠుండగు కులశేఖరమహీపాలునిచరి
త్రంబు పురాతనభాగవతపరంపరాముఖోదీరితం బై వచ్చుచున్న యది. పరమపవిత్రం
బగు తచ్చరిత్రంబు మీకు దెలియునట్లు వివరించెద సావధానులరై వినుండని పల్కి
ప్రసాదసుముఖుండగుచు వారలంజూచి యిట్లని యానతిచ్చె—

37