వీరు విస్తారముగ భూమికలవారగుటచే వీరికిగల యెద్దులతో పనులు తూగకుండెనట. అమావాస్యనాడు ఆయూరి ఆసామీలుగాని దగ్గరపల్లెల ఆసామీలుగాని భూమిదున్నరు. కావున ఆనాడు వారి అరకలు వీరిభూములు దున్నిపోవుచుండెనట. ఇందువలన వీరికి పలుకుబడి విశేషముగా నుండెనని తెలియుచున్నది. వ్యవసాయంమాత్రమే గాక కొంతకాలము వీరు నీలిమందువ్యాపారము చేయుచుండెడివారు. ఆకాలమున చెన్నపట్టణములో గాజుల లక్ష్మీనరసింగచెట్టియను గొప్ప వర్తకుడు సీమకంపెనీతరపున నీలిమందు ఖరీదుచేసి యోడమీద సీమకు రవాణాచేయుచుండెను. లింగమగుంటవారు వంగోలు, అద్దంకిమధ్య నుండు గ్రామములలో తయారైన నీలిమందు లక్ష్మీనరసింహచెట్టిగారికి ఏజంట్లుగా కొనుగోలుచేయుచుండిరి. ఈవ్యాపారమునిమిత్తము పైకము చెన్నపట్టణమునుంచి లింగమగుంటకు కావిళ్ళమీద మనుష్యులు తెచ్చుచుండెడివారని గ్రామములోని ముదుసళ్లు చెప్పుచుండెడివారు.
కోదండరామయ్యగారు ఆడంబరపురుషుడు. అప్పుడు వంగోలు నెల్లూరుజిల్లాలో చేరియుండెనుగాన నెల్లూరులోను వంగోలులో నుండు సర్కారుఉద్యోగులలో ముఖ్యులైన వారితో స్నేహము సల్పుచుండెను. వారిని తమగ్రామమునకు రప్పించి విందులుచేయించుచుండెను. తెల్లవా డొకడు వంగోలులో డాక్టరుగా నుండెను. ఆయనతో చాల స్నేహము సంపాదించెను. ఆయననిమిత్తము కావలసిన వస్తువులు తెచ్చి, కుడువబెట్టుచుండెను. కొన్నాళ్లు రోడ్డుకంట్రాక్టు పనులుగూడ