పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1908 కి ముందే రాయప్రోలు వెంకటరమణయ్యశాస్త్రిగారు అనగా రాయప్రోలు యజ్ఞనసోమయాజులుగారి తండ్రిగారు నాకు చిరపరిచయులుగానున్నందున నొకదినము నాయొద్దకువచ్చి నీకు భగవద్గీత భాష్యముతోగూడ చదివిచెప్పవలె నను సంకల్పము కలదనిరి. నేను మిక్కిలి సంతోషముతో చదివెద నని నుడివితిని. ఉదయమున 6 గంటలకే లేచి స్నానమాడి మడివస్త్రము ధరించి పూజాద్రవ్యములతో సిద్ధముగా నుండవలెననియు తా నప్పుడు వచ్చి, యొకగంటకాలము భగవద్గీతాపఠనము గావించెదననియు చెప్పిరి. అప్పటికి నాకు పుట్టినపిల్లలలో మొదటపుట్టిన ఆడపిల్లమాత్రమే మిగిలియుండెను. ఈగ్రంధకాలక్షేపమున నీకు సత్సంతానప్రాప్తికలుగునని శాస్త్రిగారు వాక్రుచ్చిరి గాని నాకు అట్టి విశ్వాసము లేకపోయినను భగవద్గీతాపాఠము అవసరమును యుక్తము నని తలంచి వారు నియమించిన ప్రకారము ప్రతిదినము ఉదయమున ఆనందగిరిభాష్యముతో గూడిన గీతాగ్రంధము నొక పీటమీదపెట్టి పూజించి, పిమ్మట ఉపనిషత్తులందలి ప్రథమశ్లోకములుపఠించి, గీతాశ్లోకములను భాష్యముతో గూడ చదువుచుంటిమి. ఆప్రకారము పదునెనిమిదిఅధ్యాయములు చదివి ముగించినపిదప నొకరోజున సమారాధనచేసి శాస్త్రిగారిని వారి భార్యగారినిగూడ బిలిచి, నూత్నవస్త్రము లొసగి, గురుదక్షిణయు నిచ్చితిని.

కొంతకాలమునకు బిమ్మట నాభార్య ఆడశిశువును గనెను. భగవద్గీతాపఠనమున శ్రద్ధావిహీనుడగుటచే ఆడశిశువు కలిగినదని శాస్త్రిగారో వారిభార్యగారో యనినట్లు గాలివార్త యొకటి వింటిని. ఒకరోజున ఆ శిశువు ఇంచుక జబ్బుచేసి పొట్ట