బందరులో పనిచేయుచున్నందున, గుంటూరులో కలసికొని, మనముగ్గురము కలసి జాయింటుఫరముగా వకాల్తాలు పుచ్చుకొని పనిచేయవచ్చుననియు, బందరులో తనకు తెలిసినవారు పలువురు కలరుగావున మనకు పని ప్రోత్సాహకరముగా నుండుననియు చెప్పగా అంగీకరించి ముగ్గురము కలసి బందరు గొడుగుపేటలో ఇల్లు అద్దెకుతీసుకొని ఆఫీసు పెట్టితిమి. గుమస్తాల నిరువురను నియమించితిమి. 1894 సంవత్సరము ఆగష్టులో 21వ తేదీనో లేక 24వ తేదీనో నేనూ హనుమంతురావును న్యాయవాదులముగా జేరితిమి. ఈమధ్యనే హైకోర్టువారివలన ఫస్టుగ్రేడు ప్లీడరీపట్టాలను పొందితిమి. శ్రీ దేవమ్మగారు అనునామెతండ్రి నాయుడుగారు మామిత్రుడు లక్ష్మీనరసింహముగారిపై ఎక్కువ అభిమానము కలవాడుగానుండుటచేత, శ్రీదేవమ్మగారికి సంబంధించిన చిన్న రివెన్యూ సివిల్వ్యాజ్యములలో వకాల్తాలు మేము మువ్వురము కలసి దాఖలుచేసితిమి. ఆప్రధమదినములలో బందరుకు సమీపమున గూడూరులో జరిగిన కూనీ కేసులో ముద్దాయిలపక్షమున నేను, హనుమంతురావును వకాల్తాలు పుచ్చుకొంటిమి. లక్ష్మీనరసింహంగారి బంధువులు ఆగ్రామంలో కొందరు ఉండుటచేత మమ్ములను ముద్దాయిలపక్షమున ఏర్పరచుట జరిగినది. ముద్దాయి బ్రాహ్మణుడు. అతడు చంపినట్లు చెప్పబడినస్త్రీ వయస్సుచెల్లిన శూద్రురాలు. ఈబ్రాహ్మణునకును, ఆస్త్రీకిని వ్యభిచారసంబంధము ఉండి వీరిమధ్య గల్గిన ద్వేషములనుబట్టి ఆమెను అతడు చంపివేసెనని ప్రాసిక్యూషను వాదము. అప్పుడు ఎల్విన్ అనువారు న్యాయమూర్తిగా నుండిరి. నేను ఆ కేసును నడిపించుటలో ఎక్కువబాధ్యత వహిం