5
జైళ్ళు నిండిపోయారు! జైళ్ళు నిండిపోయారు కాంగ్రెసు భోక్తలు, యుద్దభోక్తలు.
గాంధీజీని గురించీ, క్రిప్సు ప్రతిపాదనలను గూర్చీ లూయీ ఫిషర్ అమెరికా నుంచి ఘాటుగా వ్రాయడం ప్రారంభించాడు.
ద్వేషం ప్రపంచం నిండిపోయింది. విషం మంచులా ఆవరించి పోయింది. కోనంగి భార్యకు బాగా నెమ్మదిగా ఉందని తెలుసుకున్నాడు. కాని ఎందుకోసం డాక్టర్ రెడ్డి అనంతలక్ష్మిని ఆస్పత్రికి ఆరోగ్య పరీక్షార్ధమై పంపించాలన్నాడు? ఆ దినం భార్య తన్ను మాటలతో చీల్చివేసినప్పటినుంచీ కోనంగికి నిస్పృహ ఎక్కువైంది.
బిచ్చగానికి రాజ్యాధిపత్యమా! ఒక దివ్యబాలిక జీవిత చరిత్రలో భాగం పంచుకోవడానికి తనకేమి అధికారం ఉంది? స్వచ్ఛాంబుపూర్ణమై ప్రవహించే పవిత్రాపగలో దుర్వాసనాపూరిత మలిననీరాలు సంగమించడం ఎంత అధర్మ సంఘటనో!
తన మూలాన ఆ స్వచ్చజీవిక, అనంతం ఎన్నో బాధలుపడుతోంది. ఎదురుగుండా తాను కనబడుతున్నకొలదీ, ఆ బాలికకు బాధేగాని విశ్రాంతి ఉండదు. తనలో ఏదోలోటు లేకపోతే అంత నిర్మల హృదయంగల అనంతం తన్ను ఎందుకు అనుమానం పడుతుంది? అనంతం జీవితంలో తన బ్రతుకు సంగమించడానికి కారకుడు తానే! ఆమె జాతకంలో ఓ దురదృష్టముహెూర్తం. తాను వాళ్ళ వీధి ద్వారం దగ్గర నుంచోడం తటస్థించింది.
జైలుకు వెళ్ళి తాను అనంతం జీవితంలోంచి తరలిపోతే, ఆమెకు దుఃఖం ఉపశమనమై కొంతకాలానికి ఆమె సంపూర్ణ శాంతి సంపాదించు కుంటుంది. ఆ తర్వాత ఆమెకు కావాలంటే తాను ఆమె తనకు విడాకులు ఇవ్వడానికి అనుమతించుతాడుగాక! సందులలో తిరగవలసిన తనకు సందులే దిక్కు అవుతాయిగాక!
మరునాడు కోనంగి ఖద్దరుపంచే, ఖద్దరుచొక్క తొడుక్కొని, ఇద్దరు టోపీ ధరించి, గాంధీమహాత్మునిమీద, “క్విట్ ఇండియా నినాదపూరితమై వచ్చిన ఒక గీతాన్ని పాడుకుంటూ, త్యాగరాజనగరంలో ఏకసత్యాగ్రహయుతమయిన ఊరేగింపు జరిపినాడు.
“మహాత్మగాంధీ! క్విట్టిండియాను
మహావాక్కునే
మంత్రం చేశావూ
బ్రిటీషుగుండెలూ పీచుపీచుమన
భేరీనాదం చేశావూ
ఇన్నేళ్ళూ నీమాటే మాకూ
ఎంతో ముందుకు నడిపేశక్తయి
స్వరాజ్యయుగముకు సాగించిందీ
అడ్డంలేనీ వేగంతోటీ
మహాత్మ..........
బ్రిటిష్ ప్రభుత్వపు మాయఎత్తులకు
విరుగుడు శక్తయి విజృంభించీ
హిందూముసల్మాన్
పార్శీశిక్కుల