Jump to content

పుట:Konangi by Adavi Bapiraju.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 జయలక్ష్మి అల్లుణ్ణి అరెస్టుచేసి తీసుకు వెడుతున్నారని తెలియగానే ఒళ్ళు విరుచుకొని పడి మూర్ఛపోయింది. చుట్టాలు, ఆడవాళ్ళు గొల్లుమని జయలక్ష్మి దగ్గరకు వ్రాలినారు. కొందరు మొహమ్మీద నీళ్ళు చల్లినారు.

జయలక్ష్మికి మెలకువ వచ్చింది. కోనంగినీ, పోలీసువాళ్ళనూ, తన దురదృష్టాన్నీ తిట్టుకుంటూ జయలక్ష్మి ఏడవడం మొదలు పెట్టింది. ఒకరు డాక్టరు రెడ్డిగారింటికి పరుగెత్తారు. డాక్టరు రెడ్డిగారిని కూడా అరెస్టుచేసి తీసుకెళ్ళారని అక్కడ తెలిసింది.

ఎందుకు అరెస్టు చేసినట్లు అని ఇంటిల్లిపాదిని విచారం ఆకర్షించింది. చుట్టపు మొగవాళ్ళు కారువేసుకు వెళ్ళి జయలక్ష్మిగారి అడ్వకేటును తీసుకు వచ్చారు. ఆయన వచ్చి సంగతులన్నీ తెలుసుకొని, కోనంగిరావు గారి అరెస్టు విషయమై, సర్వమైన దర్యాప్తులు చేస్తానని చెప్పి వెళ్ళాడు.

జయలక్ష్మి సేదతేరుకుంది. ఆమె తన కూతురు దుఃఖం, కంట నీరులేని భయంకర విచారం చూచి బేజారై పోయింది. వర్ణించలేని, అర్థం కావటంలేని, గుండెను కలచివేసే అనంతలక్ష్మి స్థితిని చూసి జయలక్ష్మికి ఎక్కడలేని భయమూ వేసింది.

కూతుర్ని వదలిపెట్టి ఉండకండని చుట్టాలను స్నేహితురాండ్రను ప్రార్థించి, తాను స్నానాదికాలు కావించి పూజా గృహంలోకి వెళ్ళింది. పూజ ముగించుకొని, భగవంతుని ఎదుట పద్మాసనం వేసుకొని అలాగే కూర్చుంది.

ఆమె పూజాపీఠంలో కూడా భర్తయొక్క ఛాయాచిత్రముంది.

భగవంతునర్చిస్తూ స్వచ్చమైన జీవితం గడుపుదామన్న ప్రతివానికీ ఇలా కష్టపరంపరలు రావలసిందేనా? భక్తుల శక్తి సామర్థ్యాలనూ, దీక్షనూ భగవంతుడు పరీక్ష చేస్తాడట. సుఖమంటే మనిషికంత ప్రీతేమిటి? అనంతంగా ఎవడు సుఖవంతుడు? ఉత్కృష్టమైన ఆనందంవల్ల వచ్చే అనుభవమూ, భయంకరమైన దుఃఖంవల్ల వచ్చే అనుభవమూ, రెండూ చీకటి వెలుగులు కాబోలు.

ఇలాంటి జీవిత రహస్యాలు తన భర్త తనకు బోధించలేదా?

* * * *

దొడ్డిలోని మువ్వురు వస్తాదులకు పట్టరానికోపం వచ్చింది. అనంతలక్ష్మిని తమ బిడ్డను తమ సహెూదరి కొమరితను, ఎవరయ్యా ఈలాంటి దుర్భరమైన అవమానంచేసి ఆమె దివ్యానందకలశాన్ని ముక్కలుచేసి, కోనంగిని బంధించి తీసుకుపోగలిగారు? తాము ముగురు తలచుకుంటే ఏ పోలీసువారు ఆగుతారు? వాళ్ళను ముక్కలుచేసి కోనంగిరావుగార్ని ఆపు చేసి వుండేవారుకదూ!

ప్రజలలోని అరాజకత్వాన్ని అదుపాజ్ఞలలో ఉంచేవారు పోలీసువారు మాత్రం కాదు. ప్రజలలోని అరాజకత్వం నాయకులపై భక్తీ, పెద్దలంటే భయమూను.

ఎన్నిసారులు మన మువ్వురు వస్తాదులూ పోలీసువారికి ముగ్గురు నలుగురు మహా భయంకరులయిన దుర్మార్గులలో దుర్మార్గులను పట్టి యివ్వలేదు! దుర్మార్గ ప్రపంచానికి నాయకులయిన రౌడీలు, మన వస్తాదులు ముగ్గురూ అంటే గజగజలాడుతారు. వారి ద్వారా వీరు రౌడీమహారణ్యంలోని హీన క్రూరమృగాలను పట్టి యిచ్చారు పోలీసువారికి.

ఒకరోజు కలకత్తా మెయిలు వచ్చింది. ఆ బండిలో నుండి ఖద్దరు వస్త్రధారులైన ఒక కుటుంబమువారు దిగారు. ఆ కుటుంబం పెద్ద కాంగ్రెసు ప్రపంచంలో కొంచెం