పుట:Kinnera, sanputam 2, sanchika 7, july 1950.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

" నారాయణభట్టు "[1]

శ్రీ బులుసు వేంకట రమణయ్య

గత శతాబ్ది చివఱివరకును గల గద్య, పద్య కావ్యముల పద్ధతిని విలక్షణముగ కల్పిత కథలగు "నవల"లు వచన రూపమున నేడు మంచి ప్రచారము నొందియున్నవి. ' నవల ' రచనమునకు బీజము గత శతాబ్ది చివఱనే నాటబడినది. ఆంగ్లభాషా కోవిదులగు నాంధ్ర కవుల ప్రయత్నమున నవలలు పరివిష్ఠితరూపము నేర్పఱచుకొనినవి. ఈ శతాబ్దిలో తొలిరోజులలో వలసిన ఆంధ్రప్రచారిణి, వేగుజుక్క, ఇతిహాస తరంగిణి, కళాభివర్ధని, విజ్ఞానచంద్రిక మున్నగు సంస్థలు నవలా రచనకు తగిన ప్రోత్సాహము నొసగినవి. కాని మొనమొన్నటివఱకును వెలువడిన నవలలలో చాలవఱకును భాషాంతరీకరణములు, అనుసరణములు మాత్రము కానవచ్చుచున్నవి.

కథా వాజ్మయమునను, ' నవల ' రచనమునను సాహితీసమితి సమర్థులగు పండిత కవుల పర్యవేక్షణమున పెక్కు మార్గముల ముందంజ వేసినది.

చక్కని కథలు వ్రాయుటయందును, నవలల రచనమునను సాహితీసమితి సభ్యులు సిద్ధహస్తులు. సభాపతి యగు శ్రీ శివశంకరులు తమ సభ్యుల రచనలను దిద్ది, తీర్చి వన్నెలు చిన్నెలు కూర్చి పేరుప్రతిష్ఠలు కలిగించుట సమితి సభ్యులకున్ను, మిత్రులు కొందఱికిని విదితము. వారు చేసిన యాంధ్రీకరణము లనువాదములవలె గాక స్వతంత్ర రచనల రీతిచే హృదయంగమముల- యుండును. అట్టి రచయితలలో శ్రీ నోరి నరసింహశాస్త్రిగారు ఎన్నదగినవారు.

కాలక్రమమున మన వాజ్మయమున అనువాదములయెడ వ్యామోహము తగ్గినది ; స్వతంత్రములును, అందును ఆంధ్రదేశ సంబంధములును అగు నవలలకు ఆదరము హెచ్చినది. శ్రీ ' విశ్వనాథ ' వారి ఏకవీర, వేయి పడగలు, శ్రీ బాపిరాజుగారి ' నారాయణ రావు ', శ్రీ ఉన్నవవారి ' మాలపల్లె ' మున్నగు నవల లుచిత స్థానము నాక్రమించుకొన్నవి. ఈ " నారాయణభట్టు "ను అట్టి ఉత్తమ తరగతికి చెందినది.

శ్రీ నరసింహశాస్త్రిగారు ఆంధ్రమునను, ఆంగ్లమునను విద్వాంసులు; సంస్కృత పరిజ్ఞానము కలవారు; గ్రంథ రచనముననే కాక, విమర్శనమునను దిట్టలు. వారు పెక్కు విషయములను సంగ్రహించి, శాసనములను

  1. కర్త : శ్రీ నోరి నరసింహశాస్త్రి, సాహితీసమితి, రేపల్లె, గుంటూరు జిల్లా. ఆంధ్ర వారపత్రికనుండి పునర్ముద్రితము; డెమ్మీ 280 పుటలు. చిన్న అచ్చు. వెల రు 4-0-0. ముద్రణ: ఆంధ్రపత్రికా ముద్రణాలయము, మద్రాసు 1.